ఇదీ ప్రాథమిక హక్కే | Sakshi
Sakshi News home page

ఇదీ ప్రాథమిక హక్కే

Published Thu, Nov 19 2015 12:12 AM

ఇదీ ప్రాథమిక హక్కే - Sakshi

నేడు వరల్డ్  టాయిలెట్  డే
 
ముంబై స్లమ్.. ఓ గుడిసెలాంటి ఇంట్లో... బాగా తాగి వచ్చిన ఓ వ్యక్తి భార్యను చితక బాదుతున్నాడు. కర్టెన్ వెనక నుంచి ఆ దృశ్యాన్ని చూస్తూ భయంతో వణికిపోతోంది పదకొండేళ్ల పిల్ల. ‘ఈ రోజైనా నాన్న తాగి రావద్దు.. అమ్మను కొట్టొద్దు’ అంటూ వాళ్ల నాన్న ఇంటికొచ్చేదాకా అల్లాకి దండం పెట్టుకుంటూనే ఉంది ఆ అమ్మాయి. ఆయన తలుపు బాదడంతోనే అర్థమైందా పిల్లకి. ‘ఈరోజూ నాన్న తాగొచ్చాడు’ అనుకుంది నిరాశగా. ‘అంటే తన మొర అల్లాను చేరలేదన్నమాట. రాత్రి ఉపవాసం చేస్తే వింటాడేమో.. చేస్తాను’ నిశ్చయించుకుంది. నాన్న చేత దెబ్బలు తిని అమ్మ ఏడుస్తూంటే అమ్మను చూస్తూ తనూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది ఉపవాసంతోనే!
 
పదకొండేళ్ల ఆ పిల్ల పేరు ముంతాజ్. ఇది పదిహేనేళ్ల కిందటి మాట. ఆమె ప్రస్తుత జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆ పదిహేనేళ్ల ప్రయాణాన్నీ  తెలుసుకోవాల్సిందే. అందుకే  ఫ్లాష్‌బ్యాక్ లోంచి మొదలుపెట్టి వర్తమానానికి వద్దాం!
 
ఫ్లాష్‌బ్యాక్
అమ్మ మీద జరిగే ఆ హింస ఆగిపోతే బాగుండు అని ఏ రోజుకారోజు అల్లాని ముంతాజ్ కోరుతూనే ఉంది. ఆమె కోరుకున్నట్టుగానే ఒకరోజు తల్లిని కొట్టడం ఆపేశాడు తండ్రి. బదులుగా ముంతాజ్‌ను కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ముంతాజ్ వయసు పధ్నాలుగు. ఈసారి తల్లడిల్లడం తల్లి వంతైంది. కూతురు తన దగ్గరుంటే చచ్చిపోతుంది అని భయపడ్డ తల్లి ముంతాజ్‌ని ముంబైలోనే మరో స్లమ్‌లో ఉంటున్న తన తమ్ముడి దగ్గరకు పంపించింది.
 
ఆకలి పోరాటం
మేనమామ దగ్గర కొట్లు, తిట్లు లేవు కానీ అర్ధాకలితోనే సర్దుకోవాల్సి వచ్చేది. మేనమామ కుటుంబానికి తన భారాన్ని తగ్గించడానికి చేతనైన పనిచేసేది. ఇంటి పనుల్లో అత్తకూ సహాయంగా ఉండేది. కష్టాల బాల్యం ఆ పిల్లకు త్వరగానే పెద్దరికాన్నిచ్చింది
 పెళ్లితో. అట్టేకాలం సాకలేని మేనమామ పధ్నాలుగేళ్లకే ముంతాజ్‌ను ఓ అయ్య చేతిలో పెట్టాడు.
 
అదో నరకం...
 భర్త చేయి పట్టుకుని ముంతాజ్ ముంబైలోని ఇంకో స్లమ్‌కి వెళ్లింది. ప్రాంతాలు మారుతున్నాయి కానీ ఆమె పరిస్థితుల్లో మార్పులేదు. పైగా అమ్మ దగ్గరున్నప్పటి పరిస్థితులే పునరావృతం అయ్యాయి. నాన్న తన అనుమతి లేకుండా తనని కాలు బయటపెట్టనిచ్చేవాడు కాదు. ఇప్పుడు భర్తా  తన అనుమతి లేందే కనీసం కిటికీలోంచి కూడా బయటకు చూడనివ్వడంలేదు. బుర్ఖాలేందే గడపదాటేదీ లేదు. ఆయనకు పని దొరక్కపోయినా.. వంట నచ్చకపోయినా.. తాగినా.. తాగకపోయినా.. ఏంచేసినా.. చేయకపోయినా ముంతాజ్ ఒంటి మీద బెల్టు వాతలు తేలేవి. అలాంటి స్థితిలోనే ఓ బిడ్డకు తల్లీ అయింది. అప్పుడు ముంతాజ్ వయసు పదహారు. ‘బిడ్డను మంచి వాతావరణంలో పెంచాలి. ఇప్పటికైనా  తను ధైర్యం చేయకపోతే తన కూతురూ తనలాగే బానిస అవుతుంది’ అనుకుంది ముంతాజ్. కానీ ఎలా? చదువులేదు.. లోకజ్ఞానం అంతకన్నా లేదు. అయినా  ఈ నరకం నుంచి బయటపడాలి.. ఆలోచించసాగింది.
 
నలుగురితో కూడి...
 తన ఆలోచనలకు త్వరగానే దారి దొరికింది. తనుండే ప్రాంతంలోని ఆడవాళ్లంతా ఇంటి మగాళ్లు పనికి వెళ్లగానే మధ్యాహ్నం పూట ఎవరో ఒకరింట్లో సమావేశమయ్యేవారు. ఒకసారి తనూ వెళ్లింది. అది కమిటీ ఆఫ్ రిసోర్స్ ఆర్గనైజేషన్ (సిఓఆర్‌ఓ) మీటింగ్. అందులో ఆడవాళ్ల సమస్యల గురించి మాట్లాడేవారు. ముఖ్యంగా గృహహింస మీద. వారం రోజులు క్రమం తప్పకుండా వెళ్లేసరికి చాలా విషయాల పట్ల అవగాహన వచ్చింది. తన సమస్యను సరిదిద్దుకోవాలంటే ఆర్థికంగా నిలబడ్డం ముఖ్యమనీ గ్రహించింది. తన సమస్య గురించే కాక స్లమ్‌లోని సమస్యల మీదా దృష్టి పెట్టింది. అపరిశుభ్రత, నిరక్ష్యరాస్యత, హింస.. భూతాల్లా కనిపించాయి ఆమెకు. సిఓర్‌ఓలో కార్యకర్తగా చేరింది. భర్త బయటకు వెళ్లినప్పుడే చంటిపిల్లను చంకనెత్తుకొని మీటింగ్‌లకు వెళ్లిపోయేది. అక్కడే నాలుగు అక్షరాలూ నేర్చుకుంది. కానీ ఎంతోకాలం సాగకముందే ఈ విషయం ముంతాజ్ భర్తకు తెలిసి చావబాదాడు. అయితే ఏడుస్తూ మూలన కూర్చోలేదు. ఎదురు తిరిగింది. బిడ్డను తీసుకొని ధైర్యంగా బయటకు వచ్చేసింది. తలాక్ తీసుకుంది. తల్లి తనకు వారసత్వంగా ఇచ్చిన ఇంటిని బాగుచేసుకొని అందులోకి మారింది. సిఓఆర్‌ఓలో శాశ్వత ఉద్యోగిగా చేరింది.

వెనక్కి లాగే బంధనాలు లేకపోయే సరికి ఫుల్‌టైమ్ స్లమ్ కమ్యూనిటీకే కేటాయించింది ముంతాజ్. 75 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. గృహహింసకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. అంతేకాదు స్లమ్‌లో ఉండే సమస్యల మీదా అక్కడివాళ్లను చైతన్యం చేయసాగింది. ఆమె ధైర్యానికి, పనితనానికి మెచ్చిన ‘లీడర్ క్వెస్ట్’ అంతర్జాతీయ సంస్థ ముంతాజ్‌కు ఫెలోషిప్‌నిచ్చింది.

ప్రస్తుతం..
 ముంతాజ్‌పడ్డ శ్రమ వృధాకాలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను ‘డాటర్ ఆఫ్ మహారాష్ట్ర’ అవార్డుతో సత్కరించింది. ‘నేను అవార్డులకోసం, రివార్డుల కోసం పనిచేయలేదు. నేను బాగుపడాలి, నా చుట్టూ ఉన్న స్త్రీలు బాగుపడాలి. మన ఆడబిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని అనుకొని నాకు చేతనైన తీరులో పోరాడాను. పోరాడుతున్నాను. అన్నిట్లో మగవాళ్లతో సమానంగా ఉన్న మనం ఆత్మగౌరవం విషయంలో మాత్రం ఎందుకు అవమానపడాలి?’అంటుంది ముంతాజ్. 2017 ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేయాలనే ఆలోచనలో ఉందట!
 
ప్రభుత్వం దిగివచ్చింది
2013లో గృహహింస వ్యతిరేక ప్రచారంలో భాగంగా ముంతాజ్ కిలోమీటర్లకు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఉదయం వెళితే ఏ రాత్రికో ఇంటికి చేరేది. ఒక స్లమ్ నుంచి ఇంకో స్లమ్ వెళ్లేటప్పుడు నేచర్‌కాల్ కోసం స్త్రీలకు పబ్లిక్ టాయ్‌లెట్స్ లేక చాలా ఇబ్బంది పడేది. ‘మహిళల కోసం ప్రత్యేకమైన బస్సులు, లోకల్ ట్రైన్స్‌లో ప్రత్యేకమైన కంపార్ట్‌మెంట్స్ ఉన్నప్పుడు లేడీస్ కోసం టాయ్‌లెట్స్ లేకపోవడమేంటి? అని విస్మయం చెందింది. ఈ మహానగరంలో పురుషుల కోసం అడుగడుగునా పబ్లిక్ టాయ్‌లెట్స్ ఉన్నప్పుడు ఆడవాళ్లకెందుకుండకూడదు? వాళ్లూ పనుల కోసం బయటకు వెళ్తున్నారు కదా.. వాళ్లకు అవసరాలు ఏర్పడతాయి కదా? ఇంత చిన్నచూపేంటి? స్త్రీలకూ పబ్లిక్ టాయ్‌లెట్స్ కావాలని ‘రైట్ టు పీ’ ఉద్యమం మొదలుపెట్టింది. ముంబైలో ఇది పెద్ద సంచలనమే అయింది. చదువుకున్న వాళ్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులూ ముంతాజ్‌కు మద్దతు పలికారు.

‘రైట్ టు పీ’ నినాదంతో ముంబై మున్సిపాలిటీ భవనం దద్దరిల్లింది. మహిళలకూ పబ్లిక్‌టాయ్‌లెట్స్ కావాలంటూ ముంబైలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులతో మున్సిపాలిటీ ముంగిలి నిండిపోయింది. ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రతి 20 కిలోమీటర్లకు మహిళా టాయ్‌లెట్ల బ్లాక్‌ను నిర్మించాలని జీవో జారీ చేసింది. 147 టాయ్‌లెట్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించింది కూడా. దానికోసం తొలివిడతగా అయిదు కోట్ల రూపాయలనూ విడుదల చేసింది. మొదటిసారిగా చెంబూర్ ప్రాంతంలో ఈ మోడల్ టాయ్‌లెట్ ప్రారంభం అయింది.
 
 

Advertisement
Advertisement