ప్రశ్నలోనే బదులు ఉంది... గుర్తుపట్టే గుండెనడుగు... | Sakshi
Sakshi News home page

ప్రశ్నలోనే బదులు ఉంది... గుర్తుపట్టే గుండెనడుగు...

Published Sun, May 15 2016 1:36 AM

ప్రశ్నలోనే బదులు ఉంది... గుర్తుపట్టే గుండెనడుగు... - Sakshi

పాటతత్వం   
నేను హైదరాబాద్‌కు రావడానికి కారణం సంగీత దర్శకుడు అనిల్. అయితే పాట మీద నాకున్న ఇష్టానికి కారణం సిరివెన్నెల సీతారామశాస్త్రి. వారిద్దరూ కలిసి తొలిసారి చేస్తున్న చిత్రం ‘గమ్యం’. ఓ రోజు అనిల్ స్టూడియోలో ఓ పొడుగాటి పేపర్ చూశాను. బ్లాక్‌పెన్‌తో అర్థం అయి కానట్టుగా ఏదో రాసుంది. పైన చూస్తే ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనే పేరు బోల్డ్ లెటర్స్‌లో ప్రింట్ అయి ఉంది. అప్పుడే అది శాస్త్రిగారి ‘ఎంత వరకు...’ అనే పాటని అర్థమైంది.

ఆ రోజుల్లో ‘ఆత్మసాక్షాత్కార శాస్త్రం’ అనే పుస్తకంలో ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అనే అధ్యాయం చదివాను. ‘ఎంతవరకు...’ అనే పాటలో ప్రతి అక్షరం మనల్ని మనకి పరిచయం చేస్తుంది.  చాలా ప్రశ్నలు. చాలా జవాబులు. ఔననిపించే విషయాలు ఇందులో ఎన్నో ఉంటాయి. గొప్ప పాట ప్రపంచానికి తెలియక ముందే నేను విన్నాను అనే సంతోషం అందులోంచి పుట్టిన ఆలోచన. నాలోని మానవతావాదానికి ప్రేరణ. తర్వాత రోజుల్లో శాస్త్రిగారితో నాకున్న పరిచయంతో నేను అడిగిన ప్రశ్నలకు
 
‘‘నువ్వడిగే ప్రతి ప్రశ్నకీ నీ దగ్గరే జవాబు ఉంటుంది’’అని ఆయన అన్నారు. ఆలోచిస్తే అవును కదా అనిపించింది.
 ‘‘ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తు పట్టే గుండెన డుగు’’ అని మనకి చెబుతూ ఉంటారు. ‘ఐ సీ హ్యూమన్స్ నాట్ హ్యుమానిటీ’’ ఈ కోట్ విన్నప్పుడల్లా ...
 ‘మనకిలా ఎదురైన ప్రతివారు
 మనిషనే సంద్రాన కెరటాలు
 పలకరే మనిషి అంటే ఎవరూ’ అని పాటలోని ఈ లైన్లు మళ్లీ మళ్లీ గుర్తొస్తాయి.
 
శాస్త్రిగారు ఎప్పుడో చెప్పిన మాట ‘పోయెట్రీ ఈజ్ ఫెల్ట్ బిఫోర్ అండర్‌స్టుడ్’’ అని పలు సందర్భాల్లో చెప్పేవారు.
 ‘‘సరిగా చూస్తున్నదా నీ మది
 మదిలో నువ్వే కదా ఉన్నది
 చుట్టూ అద్దాలతో విడి విడి రూపాలతో
 నువ్వే కాదంటున్నది’’ అనే వాక్యాలు ఆ లైన్‌ను ప్రతిబింబిస్తాయి.
 
వేదం చెప్పే మొదటి మాట వెలుగు. ‘నీ ఉనికిని చాటే ఊపిరిలో లేదా గాలీ వెలుతురు’ అని ఆయన మనల్ని ప్రశ్నిస్తారు. పంచభూతాలు నువ్వే కదా అని చెప్పకనే చెబుతారు. పురిటి నొప్పులు తల్లివైతే పోయినప్పుడు కన్నీళ్లు చుట్టూ ఉన్నవాళ్లవి. ఈ రెండిటిలోనూ నీకు బాధ ఉండదనీ, ఆలోచించినప్పుడల్లా ‘అవును’ అనే నిజం తట్టిలేపుతూ ఉంటుంది.
 ‘‘మనసులో  నీవైన భావాలే
 బయట కనిపిస్తాయి దృశ్యాలై
 నీడలు నిజాల సాక్ష్యాలే
 శత్రువులు నీలోన లోపాలే
 స్నేహితులు నీకున్న ఇష్టాలే
 రుతువులు నీ భావ చిత్రాలే ’’
 
ఆయన మన ఇష్టాలను గౌరవిస్తారు. లోపాలను ఎత్తిచూపుతారు. దీన్ని కేవలం పాటగానే విని వదిలేద్దామా, లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందామా అని అనుకోకుండా ఉండలేం. మనం నవ్వినా నవ్వలేనిది... ఏడ్చినా ఏడవలేనిది నీడ మాత్రమే... అందుకే మనం చేసే ప్రతి పనికి నీడలే సాక్ష్యాలుగా నిలుస్తాయి. జీవితం పట్ల మనిషి దృక్పథం, ఆలోచన అతనిని నిర్వచిస్తాయి. ఏ భావోద్వేగాలైనా మనం ఏమిటో ఎదుటివారికి పరిచయం చేస్తాయి.

‘‘ఎదురైన మందహాసం నీలోన చెలిమి కోసం
 మోసం ద్వేషం రోషం నీ నకిలీ మదికి భాష్యం’’
 మనలోని ద్వేషం, కోపం, ఆనందం ఇలా..ఎన్ని రకాల పోలికలతో చెప్పినా, మనకు మనమే కనబడతాం. నీలోని భావాలకు నువ్వే అద్దం...నీవే నిదర్శనం.
 ‘పుటుక చావు రెండే రెండవి
 నీకవి సొంతం కావు’
 అనే లైన్  వేదాంతం నుంచి పుట్టింది కాదు, నిత్యజీవితంలో మనకుండే ప్రశ్న నుంచి పుట్టింది. గమ్యం అంటే చేరడం కాదు. అదే జీవిత గమనం అనే సత్యాన్ని చాలా సరళంగా అర్థమయ్యేట్లు చెప్పారు.
 
‘‘జీవిత కాలం నీదే నేస్తం
 రంగులు ఏం వేస్తావో కానీ’’
 బ్లాక్ అండ్ వైట్ కళ్లతో ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూస్తుంటాం. మనం ఏ మనిషిని చూసినా, ఏ పనిని గమనించినా మనం ఎక్కడ నిలబడి, ఏ దృక్పథంతో చూస్తున్నామనేదే ముఖ్యం. మన ఉద్దేశం..మన నిర్దేశం కూడా అదే. మన ప్రపంచం,  గమ్యం కూడా అదే. ఇలాంటి పాటతో సీతారామశాస్త్రిగారు నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు.
సేకరణ: శశాంక్.బి
- సిరివెన్నెల సీతారామశాస్త్రి
- కృష్ణ చైతన్య, గీత రచయిత

Advertisement
Advertisement