క్లాసిక్ కథ
శేషమ్మకి ఈ లోకంలో ఏ మాత్రమూ ఆనందమూ సౌందర్యమూ కనపడడం మానేసి ముప్ఫై యేళ్లయింది. ఇతరులు నవ్వుతున్నా, తింటున్నా, పాడుతున్నా, ఆమెకి విచారమో లేక, అసహ్యమో కలుగుతుంది. పిట్టల కూతలూ, పిల్లల నవ్వులు కూడా ఆమెని ‘ఇరిటేట్’ చేస్తున్నాయి.
‘‘పాడు పిట్టలు - పనిలేదు వీటికి. వెధవ అరుపులూ, గోలలూ, అంతకన్న చస్తేనేం?’’
ఆమెకి ప్రపంచం దుఃఖమయం, పాపభూయిష్టం, అపవిత్రం.
దీన్నంతా విడిచిపోవాలని, మృత్యువుని తలుచుకుని అందరూ వినేట్టుగా ఆహ్వానిస్తూ వుంటుంది. ‘‘ఆ ఈశ్వరుడు యెప్పుడు దయ తలుస్తాడో, ఎప్పుడు పిలిపించుకుంటాడో, యీ నరకంలోంచి నన్ను!’’
ఆ ఈశ్వరుడు తన తండ్రిలాగూ, తనని భూలోకమనే అత్తవారింటికి పంపినట్టూ మాట్టాడుతుంది. నాలుగేళ్ల క్రిందట కలరా తగిలినప్పుడు మాత్రం -
‘‘ఒరే చస్తానురా. చస్తానురా. డాక్టరేమన్నాడూ? ఆస్పత్రి పెద్ద డాక్టర్ని పిలుచుకురా. ఆ పెరుగు తోడుకుందో లేదో చూచావుటే. మా అమ్మ యెనభై యేళ్లు బతికిందిరా. ఇంత చిన్నదాన్ని నాకప్పుడే యేం చావు? అవునులే ఈ ముసలిముండ చస్తే ఎవరికేం? అందరికీ పీడ విరగడైపోతుంది’’ అంది మళ్లీ.
ఆమె మొహాన నవ్వు చూసిన వాళ్లెవరూ లేరు. చిన్నపిల్లలు గంతులేస్తోవుంటే, ‘‘ఈ గంతులెన్నాళ్లు? మీ కాళ్లు విరగా. ఇదేం పోయేకాలంరా. సరిగా కూచుని యాడవలేరూ?’’ అన్నట్టు చూస్తుంది. ఎంత విచారంగా కనపడితే యీ లోకం మీద, యీ మాయమీద ఎంత అసహ్యం కనపరిస్తే, ఎంత సౌందర్యాన్ని ద్వేషిస్తే ఈశ్వరుడికి అంత సన్నిహితురాలూ, ప్రియతమురాలూ అయి వుంటుంది. యీ లోకంలో తన వంటి సన్మార్గులకు కష్టాలు తప్ప యింకేమీ లేవు కనక సుఖపడేవాళ్లంతా దుర్మార్గులే అయి వుండాలి. తను కష్టాల కోసం ఎంత ప్రయత్నించి ఏరుకుంటుందో ఆమెకి తెలీదు.
‘‘అదేమిటి ఆ కామాక్షి అట్లా పాడుతోవుంటుంది యెప్పుడూ! దేన్ని చూసుకునీ! మొగుడి వుద్యోగం వూడినప్పుడు తెలుస్తుంది, అమ్మగారి అదిరిపాటు!’’
ఆమెని ‘‘యెట్లా వున్నారమ్మా!’’ అని అడిగితే యెప్పుడూ ‘‘బాగానేవున్నా’’నని అనలేదు.
అసలు యీ దేశంలో ఆ మాట అనేవాళ్లే తక్కువ. నిజంగా బాగా వుండేవాళ్లే తక్కువ. బాగా వున్నా కూడ. బాగా వున్నామని తెలుసుకున్నవాళ్లు చాలా తక్కువ. తెలుసుకున్నా, ‘‘బాగా వున్నా’’మని అంటే దిష్టి తగిలి, అదృష్టం మారుతుందని ఆ మాట అనరు. అంతేకాక బాగా వుండడం దోషమనీ, పాపాత్ములే బాగా వుంటారనీ, మూర్ఖులు మాత్రమే బాగా వున్నామనుకుంటారనీ నమ్మకం.
‘‘ఏం బాగుండడమమ్మా! కుర్రాడికి నిన్నటి నుంచి జలుబు కదా! ఇంతవరకు కన్ను తెరచి యెరుగడు. ఆవు పాలివ్వడం మానేసింది. మొన్ననేగా మా తాతగారి సవతి తల్లి మేనమామ పొయినాడు. వాడి మనుమడు మూడో క్లాసు తప్పిపోయినాడా! రాచ్చిప్ప చిల్లిపడ్డది. నిక్షేపం లాంటి రాచ్చిప్ప! ఇట్లావుంది మాగతి. ఏమోనమ్మా ఈ కాలంలో అంతా మాయ మాయ రాచ్చిప్పలూ! మాయ మనుషులూ! అవునులే అమ్మా! ఏం శాశ్వతం? ఈ దేహమూ అంతేకద, వూరికే పట్టుకు పాకులాడుతారు గానీ.’’
ఈ వాక్యాలే ఏ దేశాభిమాని ఐనా విన్నాడా, అక్కడే మూడు పల్టీలు కొట్టి ‘‘హా భారతమాతా! ధన్యురాలిని. ఇట్లాంటి ఆధ్యాత్మికులైన ముసలమ్మల్ని కన్నావు’’ అని ఆనందంలో మూర్ఛపోతాడు.
ఎవరన్నా - ‘‘అదీ, ఆ రత్తమ్మ! మొన్న రాత్రి పారిపోయిందటమ్మా!’’ అంటే - శేషమ్మ ‘‘ఛీ ఛీ, అట్లాంటి మాటలు నా చెవిని పడనీకు. నాకెందుకూ? నా రామ నామమేమో, నేనేమో! ఇంతకీ యెవడితో?’’
‘‘అక్క యింటికి.’’
‘‘ఇంతేనా? పారిపోయిందంటావేం?’’
‘‘ఏమో వాళ్లంటే నేనన్నాను.’’
కొంచెం ఆగుతుంది శేషమ్మ ఇంకా యేమన్నా చెపుతారేమోనని. చెప్పకపోతే -
‘‘నాకెందుకమ్మా! కానీ అక్క యింటికి ఎవరు తీసుకెళ్లారూ? ఎవడో మొగాడు వుంటాడు. బాగా చూడమను. వాతలు పెడితే యిద్దర్నీ పట్టుకుని - నాకెందుకులే. వద్దన్నా నాకెందుకు చెపుతావు! అక్క యింటికి వెళ్లిందో, ఇంకెక్కడికి వెళ్లిందో! ఆ అక్క సంగతి తెలుసుగా! దాని షోకులూ, రవ్వల దుద్దులూ - నాకెందుకమ్మా! బండెడు చాకిరీ! చస్తున్నాను.’’
‘‘మీ కోడలు పనిచెయ్యదా?’’
‘‘అయ్యో దాని చేతులు పువ్వులట, దాని కాళ్లు తామరాకులట!’’
‘‘మీ కూతురో?’’
‘‘మా కూతురుకి గంపెడు రోగమమ్మా! అదేం చేస్తుంది దాని ముఖం!’’
‘‘అట్లానమ్మా! బాగానే తిరుగుతో వుంటుందే!’’
‘‘మీ కంటికి అట్లానే కనపడుతుంది. పై పుస్టేగానీ లోపలంతా గుల్ల. ఒకటే ఆయాసం.’’
‘‘మరి ఎపుడూ అలా చిరుతిళ్లు తింటే...’’
‘‘అయ్యో యేం తింటుంది? అన్నం అసలే తినదు. ఆ చిరుతిళ్లు కూడా లేకపోతే ఎట్లా?’’
‘‘మా కూతురమ్మా, మా సుబ్బలక్ష్మి! దానికొక్కరోజు జబ్బు చెయ్యదు కదా!’’
‘‘చెయ్యకేమమ్మా! అట్లా తిరిగేవాళ్లు గభాలున పడతారు. మా మామ మనుమడు అంతే, పిడిరాయి లాగు-’’
శేషమ్మ ప్రపంచం పనీ, ఆచారమూ. తెల్లవారకట్ట నాలిగింటికి లేచి, రాత్రి పదకొండింటి వరకు (మధ్యాహ్నం రెండు గంటలు విశ్రాంతితో) పనిచేయడం, ముప్పై యేళ్లనించి, ప్రతి దినమూ ఆ విధంగా పనిచేస్తోంది.
ఆమె పని చేసినంతసేపూ, ఆమె నోరు పనిచేస్తోవుంటుంది, మాటలతో తిట్లతో. తెల్లవారకట్టే రాత్రి అల్లరి చేసిన పిల్లుల్నీ, యెలకల్నీ తిట్లు, తరవాత పదింటిదాకా దాసీదాన్ని తిట్లు, అల్లరి చేసే పిల్లుల్నీ కాకుల్నీ తిట్లు. కానీకి వీశడు బీరకాయ లివ్వని కూరలదాన్నీ, మజ్జిగదాన్నీ, తిట్లు. ఈ ముపై యేళ్లలోనూ ఒక్కరోజు కూడా చిక్కని మజ్జిగ పొయ్యలేదు కదా, పుచ్చుపోని కూరలివ్వలేదు కదా?
మధ్యాన్నించి యిరుగు పొరుగు వాళ్లనీ, కోడల్నీ, కొడుకు అనాచారాన్నీ కృతఘ్నతనీ, దేవుణ్ని, పిచికల్నీ, తోవన పొయ్యేవాళ్లనీ తిట్టుకోవడం ప్రారంభిస్తుంది. పని చెయ్యకుండా వుండలేదు. అదే ఆమె మతం, ఆమె శరీరమే పనిచేసే మర అయిపోయింది.
ఆమె ‘ఇంటెలిజిన్స్’ ఎప్పుడో మానింది పని చెయ్యడం. ‘రొటీన్’ తప్ప ఇంకేమీ ఆమె చేతకాదు. ఒక్కరవ్వ ప్రోగ్రామ్ మారిందా యిల్లు పడుకుంటుంది. అంట్ల శుభ్రం, యిల్లు కడగడం, పేడ చల్లడం, మెతుకులూ, ఎంగిలీ మైల మైల అని అరవడం యిదే బతుకు? ఒక కొత్తపనీ, కొత్త యోచనా రెండూ ఆమె చేతకాదు, గానుక్కి కట్టిన యెద్దు నయం.
అందువల్లనే మార్పు అంటే గుండెలు పగిలి చస్తారు. బెత్తం లేకుండా పాఠం చెప్పమంటే, ముసలి స్కూలు మాష్టరికి యెట్లా వుంటుందో, యింగువ లేకుండా వంట చెయ్యటమంటే ఆమెకట్లా వుంటుంది. టేపు లేకుండా పని చెయ్యమంటే తాలూకా గుమాస్తాకి యెట్లా వుంటుందో మడి కట్టుకోకుండా వండమంటే ఆమె కట్లావుంటుంది. ప్రపంచం ముక్కలైనా ఆమెకి ఆశ్చర్యం కలగదు. ఇంత పని యిన్నేళ్లు చేసిందా యెవరికా వుపయోగమంటే యేమీ కనపడదు.
అందరూ ఆమెని చూసి విసుక్కునేవాళ్లే గాని కృతజ్ఞత కనబరిచేవాళ్లు లేరు. నలుగురికి భోజనం పెడుతోంది. తను తింటోంది. ఇంటిని మురికి చేస్తుంది, ఎందుకు? కడగడానికి. కడగడమెందుకు? మళ్లీ మురికి చెయ్యడానికి. అంతకాలం వంట చేస్తే మూడు వందల మందికి భోజనం పెట్టవొచ్చు వొక మనిషి. స్వర్గంలో అంట్లు తోమడమూ, బట్టలారవెయ్యడమూ లేకపోతే యేం చేస్తుందో యీ మనిషి!
పాపం, ఏ కొత్త కాంతినీ, ఆశనీ, ఆనందాన్నీ, కోర్కెనీ, అన్నిటినీ త్యజించి, ఆ వంటిల్లే తన ప్రపంచంగా తన బాధే తన ఆనందంగా, తన చేతికి చిక్కిన అయిదారుగురు దాసీలతో సహా, తన నోటి తీటను తృప్తిపరచగల సాధనాలుగా, తన ఆచారాన్నీ, తులసికోటని చూసుకుని గర్వపడి బతుకుతోంది. భూకంపాలు రానీ, దేశాలు దేశాలు తగలపడనీ, సామ్రాజ్యాలు పడిపోనీ, ఆమెకేమీ సంబంధం లేదు. తన యింటికి వంద గజాలు దాటి ఆమె మనసు పనిచెయ్యదు.
కాపురము, పిల్లలు, ప్రేమ, ఏమీ లేక తనది, స్వంతంగా తనది అనే ఆస్తిగాని మనిషి గాని లేక, క్రమంగా క్రమంగా మనసు మోడైపోయి నిలిచింది ఆమె. ఇంకే ఆసక్తీ లేక ఆ పాత పురాణాలలో విన్న అక్కడక్కడి వచనాలని పట్టుకుని, వాటి వాస్తవత్వం పైన తన ఆత్మ పురోభివృద్ధిని ఆధారంగా చేసుకుని కన్నంలో యెలిక వలె బతుకుతోంది. ఎవరికైనా ప్రేమించడం కన్నా ద్వేషించడం సులభం. ప్రేమ మనిషిని తన స్వంతంగా చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ పేద వితంతువు స్వంతం కావడానికి ఎవరంగీకరిస్తారు?
తన కోడలికి ఒక్కొక్క బిడ్డే పుడుతోవుంటే తన స్వంతం చేసుకోవాలని చూసింది. ఆ తల్లి ప్రతి నిమిషమూ జ్ఞాపకం చేసేది ఆ పిల్ల తనదని - చూపుచాతా, నడవడిచాతా. ఆ పిల్లలే మూడేళ్లు రాగానే అందరి కన్న లోకువ గనక కర్రలు తీసుకుని బాదేవారు ఆమెని. ప్రేమ లేక, సంతోషం లేక, జీవితంలో ఇంటరెస్టు లేక, తను ఏ బాధపడ్డా కరుణించేవారు లేక, తిట్లలో తన ఆనందాన్ని సార్థకం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది.
ఇట్లా ఎందరు యీ దేశంలో యిట్లా కొయ్యబారిన ఆత్మలతో తమ జీవితాన్నీ యితరుల జీవితాల్నీ క్షోభపెట్టి చివరికి మృత్యువులో తప్పించుకునే స్త్రీలు! కానీ మృత్యువులోనైనా తప్పించుకుంటారా? వాళ్ల జన్మలో వుందా యీ లోపం? వాళ్లనిట్టా చేసిన సంఘం పరిస్థితులలో వుందా? వాళ్లు సంఘాన్నిట్టా ఎండపెడుతున్నారా, సంఘం వాళ్లని కొయ్యల్ని చేస్తోందా?
Related news
-
ఉంగరం
క్లాసిక్ కథ అమ్హయ్య! ఈ రోజుతో తన కష్టాలన్నీ ఫలిస్తాయి. దేనికైనా ధైర్యం ఉండాలి. ఎటువంటి అద్భుతమైన ఆలోచన తట్టింది తనకి! ఎలాగ మెరుస్తోంది తన అందమైన వేలికి? - ఇంక దీనితో తాను బతుకుని కొత్తగా తీర్చుకోవాలి. సుఖంగా దర్జాగా జీవితం గడపాలి. ఇంతవరకూ తానెంత నీచంగా బతికిందీ తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. అంట్లు తోమడం, గదులూడ్చడం, వాళ్ళిచ్చే పాసిపోయిన అన్నంతో పాటు తిట్లనీ శాప నార్థాల్నీ మూటకట్టుకుని నిస్సహాయతతో ఉడుకుమోతుతనంతో యింటికి వెళ్ళడమూ - అక్కడ తల్లి రోగంతో మంచం మీద బల్లిలాగా అంటుకుపోయి, తాను ఆలస్యంగా వచ్చి నందుకు ఇంకా తిట్టడమూ - తన వొళ్ళంతా చాకిరితో నొప్పులూ - ఏడుపొచ్చేది తనకి. చచ్చిపోవాలనిపించేది. అందరిలాగా తాను హాయిగా కులాసాగా ఎందుకు బతకకూడదు? పంతులమ్మ కూతురిలా సిల్కు వోణీలు తన కెందుకుండవు? రవణమ్మ బుగ్గలూ వొళ్ళూ ఎలా నిగనిగలాడుతుంటాయో - రెండు పూటలా మీగడ పెరుగూ వెన్నపూసా వేసుకుని తింటుంది కదూ! తన యీడుదే వరహాలు మరి. రోజూ తల్లో పువ్వులు పెట్టుకుని కాటుక పెట్టుకుని సినిమాకు వెళ్తుంటుంది మొగుడితో. మరి తనకి పువ్వులూ సినిమాకి డబ్బులూ ఎప్పుడూ వుండవు. మరి మొగుడూ లేడు! తనలో ఎన్ని కోరికలు! ఎన్ని కలలు! చిన్నప్పట్నుండీ తనకెందుకో ఎగిరిపోవాలనీ, పాటలు పాడాలనీ, నాట్యం చెయ్యాలనీ ఎన్నో ఎన్నో - పొలంగట్టుకాడ కూర్చుని సినిమా పాటలు పాడుతుంటే తనకేసి అందరూ చూసి నవ్వేవారు. తనని వెర్రిదనేవారు. ఏమిటో తన వెర్రి! మంచిబట్టలు కట్టుకోవాలనీ, షోగ్గా సింగారించుకోవాలనీ హాయిగా బతకాలనీ ఎవరనుకోరు! వాళ్ళకి డబ్బూ యిల్లూ ఉన్నా ఎంత అసహ్యంగా బతుకుతారు! ఎంత లేకిగా వుంటారు? వడ్డాణమూ కాసులపేరూ పెట్టుకుని తిరుగుతుంది అమ్మగారు. ‘అమ్మా, ఈవాళ తిరణాల, ఓ బేడ డబ్బు లివ్వండి’ అని అడిగితే దండకం చదువుతుంది. ‘నా దగ్గర ఏం ఒలకడంలేదు. ముష్టిముండా పీనుగని ఒక్క అణా డబ్బులు కూడా నాకివ్వరు. తాళి కట్టాడు కాబట్టి యిలా బతుకుతున్నాను కుక్కిన పేనులాగ. ఈయన్నీ ఈయన డబ్బునీ చూచి పీక కోశాడు మానాన్న’ - అబ్బబ్బ వినలేక వచ్చేస్తాను. ఇవ్వకపోతే మానె, ఇంత అఘాయిత్యంగా మాట్లాడుతుందే విటి: అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు ధాన్యం చాటుగా అమ్మి డబ్బు దాచేసుకుంటుంది. పోనీ అయ్యగారిని అడిగితే ఆయన ఒకటే తిట్లు. ‘‘ఈ గది సరీగా ఊడవలేదేం! వెధవ పనితనం నువ్వూ, పైగా డబ్బులు కావాలిట! మీ అమ్మ నిరుడు వైద్యానికి మూడు రూపాయలు తీసుకు వెళ్ళింది. తీర్చడం మాట ఉత్తిదే. అయినా తిరణాలకెందుకే నీకు? వెధవ చిరుతిండి తింటా నికా? రెండు పూటలా తింటున్నావు చాలదూ?’’ ఉక్రోషం వచ్చింది తనకి! తనదగ్గరే డబ్బులుంటే ‘‘ఏడవకయ్యా! ఈ రూపాయి తీసుకుని తిరణాలకెళ్ళి నువ్వే కొనుక్కో’’ అని యిచ్చేసును. ఇవ్వనంటే పోయేది యింతంత మాటలెందుకో! తనకి అందం లేదా! తెలివితేటలు లేవా! సుబ్బయ్యగారి గదిలో ఎవరూ లేనప్పుడు అద్దంలో తన మొహాన్ని చూచుకొనేది. ఎంత అందంగా వుంది తన మొహం - నిగనిగలాడే వొళ్ళూ, మెరిసే కళ్ళూ, బుగ్గమీద సొట్టా - వాళ్ళ అచ్చెమ్మకన్న వెయ్యిరెట్లు నయం. కొంచెం సబ్బు పెట్టి మొహం తోముకుని పువ్వులరైక తొడుక్కుంటే అచ్చెమ్మ డీలా అయి పోదూ! చిన్న కళ్ళూ, లావాటి పెదవులు - దాన్నెవడు మనువు చేసుకుంటాడూ! డబ్బుని చూశా? వెర్రిముండాకొడుకులు. పిల్ల యేపుగా ఊతంగా వుంటే సరదా కాని డబ్బుతో ఏం మనసు తీరుతుందీ? తిని బలిసిన అచ్చెమ్మకి ఎప్పుడూ సొగసులూ సొలపులూ. లేవలేదు, కూర్చోలేదు. తనకున్న విలువ వాళ్ళకుందా. తన అందాన్ని ఊరకే తక్కువకి కొనెయ్య వచ్చునని అను కుంటారు రౌడీ వెధవలు. రోడ్లమ్మటి పోతుంటే కోరగా జోరుగా చూస్తారు. సుబ్బయ్య గారి కోడలు - అదేవిటి అలా చూస్తాడు? జేబులోంచి వెండి రూపాయితీసి మోగిస్తాడు. చెయ్యి వూపుతాడు! మళ్ళీ భయం. వీధి గుమ్మంలో జోడు చప్పుడవగానే గటుక్కున గదిలోకి దూకి తలుపులు వేసుకుంటాడు, వాళ్ళ బాబు వస్తున్నాడని. తన వాళ్ళందరిలాగా తనకెందుకో తృప్తి వుండదు. రంగురంగుల ఊహలు కలవర పెడు తుంటాయి. తనకెన్నో కథలు వచ్చును. ఊరవతల గుడికాడ సాధుబాబా వుండేవాడు. చిన్నప్పుడు తనకి మాంచి కథలు చెప్పేవాడు. తెల్లని గడ్డం, ముడతలు పడిన కళ్ళూ, వళ్ళూ, చిరిగిన బనీనూ వేసుకుని తన్నెంతో ఆప్యా యంగా చూసేవాడు. తాను గొప్పదానినౌతా నని రాజకుమారినవుతానని చెప్పేవాడు. రాజకుమారులు తెల్లని గుర్రాలమీద ఎక్కించేసుకుని తీసుకెళ్ళిపోయి పెళ్ళి చేసు కుంటారట. వాళ్లకి పెద్ద పెద్ద మేడలు, నౌకర్లు, మాంచి పిండివంటలు, జిగేల్మనే నగలు... సీతాలుని ఓ అబ్బాయి అలాగే లేవ తీసుకుపోయాడు. ఏడాది పోయాక మళ్ళీ వచ్చింది సీతాలు. ఎంచక్కావుంది. సిల్కుచీర కట్టుకుంది. బంగారపు గాజులు వేసుకుంది. ఆ అబ్బాయి పట్నం తీసుకెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకున్నాడట. వర్తకం చేస్తాడట. ఎంతో డబ్భు లాభం వస్తుందిట! ‘‘నన్ను కూడా తీసుకు పోయేందుకు ఎవడినేనా చూసిపెట్టు సీతాలూ’’ అని అడిగింది ఆ రోజున. ఎంతో బతిమాలు కుంది. సీతాలు విరగబడి నవ్వింది. ‘‘నేను చూసి పెట్టనా. ఓయమ్మ యిదేం సోద్దెమే ’’ అంది. ‘‘నాకేం తక్కువ?’’ అంది తను ఉక్రోషంగా. ‘‘ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎలాగ? మాంచి పరికిణీ వోణీ కుట్టించుకో, ఆ మొగుడెవరో వాడే వస్తాడులే’’ అంది సీతాలు. తనకి మంచి బట్టలు ఎలా వస్తాయి? పోనీ సుబ్బయ్యగాడు, వెర్రిపిల్ల చాలాకాలం నుంచి చాకిరీ చేస్తోందని కొనిపెట్టకూడదూ? ఆయన కూతురు అచ్చెమ్మ ఓ చీర యివ్వకూడదూ? ఇలా అనుకునేది తను. కానీ యింత సులువైన ఊహ తట్టనేలేదు ఎప్పుడూ తనకి. సుబ్బయ్య చిన్న కొడుకు బళ్ళో నుంచి వస్తున్నాడు. వాడి వేలిని ఉంగరం మెరిసింది. ఈ కబురూ ఆ కబురూ చెప్పి మిఠాయి కొనిపెట్టి ఉంగరం తీసేసుకుంది. కుర్రనాగన్న యింటి దగ్గర చెప్పగలడా? సుబ్బయ్యగారూ, పెళ్ళామూ ఉంగరం ఎక్కడో పోయిందనుకుంటారు. ఈ ఉంగరం అమ్మితే ఇరవై రూపాయలేనా వస్తాయి. ఆ డబ్బుతో అందమైన బట్టలు కొనుక్కుని కట్టుకుని వెళుతూవుంటే మాంచి రాజకుమారుడులాంటి కుర్రాడు తన్ను చూసి ‘‘ఏయ్ అమ్మాయ్’’ అని నవ్వుతాడు అదోలా. పెళ్ళికొడుకులు నవ్వినట్టు నవ్వుతాడు. అప్పుడు... అయినా తను అందర్నీ నమ్మకూడదు. మంచివాణ్ణి, డబ్బున్న వాడినీ ఏరుకోవాలి. దొరలాగ వుండాలి వాడు. ‘నిన్ను పెళ్ళి చేసి కొంటాను. నువ్వులేందే బతకలేను లచ్చీ’ అనాలి. అప్పుడెంచక్కా వాడిని పెళ్ళి చేసు కుంటుంది. సీతాలులాగా పట్నం వెళ్ళిపో తుంది. ఎప్పుడేనా సుబ్బయ్యగారు యిటువస్తే తనను చూసి ‘అబ్బో’ అని ముక్కు మీద వేలేసు కుంటారు! పెళ్ళి చేసుకోలేకపోతే నలుగురిలో గౌరవం ఉండదు. అందరూ తిడతారు. ఛీ అంటారు. పెళ్ళయితే కాని - మగవాడికి అలుసివ్వకూడదు. దొంగవెధవలు సరదా తీరాక పురుగును దులిపినట్టు దులిపి పారేస్తారు. సింగడు మరి యిదివరకూ ఏం చేశాడు? ఎన్ని కబుర్లు చెప్పాడు? రంగం వెళ్ళిపోదామన్నాడు. తీరా ఓ రోజున మరెవత్తెనో పెళ్ళి చేసుకున్నాడు. తనింకా అప్పుడు చిన్నపిల్ల. ఎంతో ఏడ్చింది. ‘‘ఏంటి యిలా అన్యాయం చేశావ్’’ అంటే ‘నిన్నెవడు పెళ్ళాడుతాడు’ అన్నాడు. నల్లని ఉంగరాల జుట్టు ఉండాలి. తెల్లగా పొడుగ్గా ఉండాలి. మంచి యిల్లు తోటా వుండాలి. అలాంటి అబ్బాయి వచ్చి పెళ్ళి చేసుకోవాలి. తలలో పువ్వులు పెట్టుకొని పెరట్లో పాటలు పాడుతూంటుంది తను. వెనకాలే వచ్చి కళ్ళు మూస్తాడు. చేతులు తీయ కుండానే బుగ్గమీద ముద్దు పెట్టుకుంటాడు. తను మళ్ళీ ఆయన మొహాన్ని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటుంది. తను రోజూ నీళ్ళు పోసుకుంటుంది. ఘుమఘుమలాడే సబ్బుతో వొళ్ళంతా రుద్దుకుంటుంది. బలే వాసన. ఓసారి సుబ్బయ్యగారి అల్లుడు వదిలేసిన సబ్బు ముక్క తెచ్చుకుని నీళ్ళు పోసుకుంది. తన వొళ్ళు కొత్తగా మెత్తగా పట్టుచీరలా మెరిసిపోయింది. ఒకానొక వేసవిలో ఊరికి దూరంగా ఉన్న ఒక మామిడితోపులో కూర్చుని పగటి కలలు కంటోంది. పదిహేడేళ్ళ దాసీపిల్ల లక్ష్మి చిరిగిన మానిన బట్టలూ సంస్కారంలేని చిక్కబడిన జుట్టూ, ఆమె కళ్ళల్లో ఊహల నిచ్చెనలమీద ఎగబ్రాకే కోర్కెల్ని ఆపలేకపోతున్నాయి. చల్లని పైరుగాలి, ప్రశాంతమైన మామిడితోటా, యౌవనం కొత్తగా వింతగా అలుముకుంటూన్న ఆమె వయస్సూ ఆమె కలల్ని మరింత రెచ్చ గొడుతున్నాయి. తాను దిక్కులేని దాసీపిల్లననీ, తన భవిష్యత్తు ఎప్పుడూ యింతేననీ వాస్తవికంగా ఆమె ఆలోచించగలిగితే అప్పుడీ స్వప్నాలవల్ల కలిగే క్షణికమైన మధురానుభూతి కూడా జీవితంలో లేకుండా చేసుకోవడమే అవుతుందేమో! బతుకు అడుక్కిపొయినకొలదీ బతకడానికి చేయూత స్వప్నం మాత్రమే కాబోలు. అందరూ అభాగిని అయిన లక్ష్మిలాగ కలలు కంటారు. కానీ ఆ కలలు నిజాలౌతా యని నమ్మరు. అక్కడ వాళ్ళు తెలివిగా జాగ్రత్త పడతారు. కాని లక్ష్మిలాంటి అమాయకులూ ఆవేశ హృదయాలూ కలల్ని తరుముకుంటూనే పరుగెత్తుతారు. దానిలో గొప్పితగిలేదీ గొయ్యి వచ్చేదీ చూచుకోరు. రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండి వంటల్ని గురించీ, దరిద్రుడు ధనం యిచ్చే సౌఖ్యాన్ని గురించీ ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు. నిజమే. అందుకే భయంకర దరిద్ర పీడితులూ, అంగవికలులూ, దుర్భర వ్యాధిగ్రస్తులూ ఆత్మహత్య చేసుకుని కడతేరకుండా బతుకుతూనే వుంటారు, రేపటి సుఖంకోసం. కళ్ళెంలేని భావనా ప్రపంచంలో విహారం చేస్తూన్న లక్ష్మి తనని ఓ గంట నుండి నారాయణ అదేపనిగా పరికిస్తున్నాడని గమ నించలేకపోయింది. కొంతసేపయ్యాక అతను మెల్లగా ఆమె దగ్గరకు నడచి వచ్చాడు. చామన చాయగా వున్నాడు. పైజామా తొడిగి తెల్లని గ్లాస్కో చొక్కా వేసుకున్నాడు. కాళ్ళకి నల్లని స్లిప్పర్సు, జుట్టు వెనక్కు దువ్వాడు, పెదవులు ఎర్రగా ఉన్నాయి తాంబూల సేవనం వలన. సుబ్బయ్యగారి కొడుకు కన్న, సింగడు కన్న ఎంతో బాగున్నాడు. ఎంతో బాగున్నాడు. చదువుకున్నవాడిలా ఉన్నాడు. లక్ష్మికి ఎదురుగా వచ్చి నిలుచున్నాడు. లక్ష్మి తల పెకైత్తి చూసింది. ఫక్కున నవ్వింది. ఆమెకి కథలో రాజ కుమారుడు నిజంగా వచ్చేసినట్టనిపించింది. ‘‘ఎవరు నువ్వు?’’ అన్నాడు నారాయణ గంభీరంగా. ‘‘ఏం?’’ అంది ఓరగా చూస్తూ లక్ష్మి. ఇంకా ఆమెకు పూర్తిగా మెలకువ రాలేదు. వేలినున్న ఉంగరాన్ని ఆప్యాయంగా చూచుకుంటోంది. ‘‘నీ పేరేవిటి?’’ అడిగాడు నారాయణ. సన్నగా నవ్వి తియ్యగా చూసింది లక్ష్మి జవాబుగా. ‘‘ఈ తోట ఎవరిదో తెలుసునా?’’ ఈసారి కోపంగా అధికారంగా అన్నాడు నారాయణ. ఉలిక్కిపడింది లక్ష్మి ‘‘మీదేంటి బాబూ, ఊరికనే కూర్చున్నాను...’’ భయపడుతూ లేచి నుంచుంది లక్ష్మి. వీడు తనని పెళ్ళి చేసుకోడానికి రాలేదా? నారాయణ గీరగా చూశాడు. అదోవిధంగా దగ్గాడు. లక్ష్మి కూడా గమ్మత్తుగా చూసింది: నవ్వింది. ‘‘నీ పేరేవిటీ?’’ ప్రశ్నించాడు మృదువుగా నారాయణ. ‘‘లచిమి.’’ ‘‘ఈ వూరేనా?’’ ‘‘ఉహు పక్క ఊరు’’ ‘‘ఏం చేస్తుంటావ్?’’ సందేహంగా కనురెప్ప పెకైత్తి నారాయణను చూసింది. దాసీ దాన్నని చెప్పాలా చెప్పకూడదా అని తటపటా యిస్తోంది. నారాయణ మీద చెయ్యివేశాడు. జాలిగా అన్నాడు. ‘‘పాపం. దాసీ పిల్లవా?’’ లక్ష్మి తలూపింది ఔనని. నారాయణ ఈసారి ఆమె బుగ్గలమీద చేత్తోరాశాడు. ‘‘మాంచి దానివి.’’ ఆశగా చూసింది లక్ష్మి! ‘‘అలాగరా - ఆ పక్కకి’’ అని అర్థవంతంగా నవ్వాడు నారాయణ. ‘‘ఎందుకూ?’’ ‘‘ఇక్కడ అందరూ చూస్తారు.’’ తెల్లబోయి చూస్తోంది లక్ష్మి. ‘‘డబ్బులిస్తాను సరేనా, రా.’’ ఛీ, తననింత లోకువగా చూస్తున్నాడేమిటి? తనని ప్రేమించాననీ పెళ్ళి చేసుకుంటాననీ అనడేం అనుకుంది లక్ష్మి. ‘‘నాను సెడిపోయిన దాన్ని కాదు. నానల్లా రాను’’ అంది లక్ష్మి. ‘‘ఇక్కడి కెందుకొచ్చావు మరి?’’ కోపంగా అడిగాడు నారాయణ. ‘‘పెళ్ళి చేసుకుందుకు-’’ అమాయకంగా అంది లక్ష్మి. ‘‘ఎవర్నీ?’’ అన్నాడు. పెళ్ళిచేసుకునేందుకు మామిడి తోపులోకి రావడమెందుకో రకరకాల అనుభవం గల నారాయణకే అర్థమవలేదు. ‘‘నాకు నచ్చినవాణ్ణి, డబ్బున్నవాణ్ణి’’ అంది లక్ష్మి. నారాయణకి లక్ష్మి ఒక్కసారిగా అర్థమై పోయింది, మెల్లగా కబుర్లలోకి దింపాడు. ఆమె ఊహలు పయనించే తోవలేమిటో తెలుసు కున్నాడు. తర్వాత జాలిగా ప్రేమగా అన్నాడు ‘‘నన్ను పెళ్ళి చేసుకుంటావా లక్ష్మీ’’ ‘‘మిమ్మల్నా?’’ ‘‘అవును.’’ ‘‘ఒట్టు?’’ ‘‘ఒట్టు’’ ‘‘మరి సింగడిలాగ..’’ ‘‘సింగడెవడూ?’’ ‘‘దొంగనా...’’... రెండు మాటలలో సింగడెవడో చెప్పింది లక్ష్మి. ‘‘ఛఛ.. నేనలాంటివాణ్ణికాను. నీలాంటి పిల్లకోసమే చూస్తున్నాను. నిన్ను ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటాను. పువ్వుల్లో పెట్టి పూజిస్తాను’’ అన్నాడు నారాయణ. ‘‘నిజం?’’ పెద్దకళ్ళలో వెలుగు నిండగా అడిగింది లక్ష్మి. ‘‘ఇంకా నీకు చదువు చెప్పిస్తాను.’’ ‘‘ఓహ్!’’ ‘‘డ్యాన్సు నేర్పిస్తాను.’’ ‘‘అబ్బో.’’ ‘‘మరి ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం?’’ అన్నాడు నారాయణ. ‘‘పట్నంలో కాదా పెళ్ళి?’’ - సీతాలుని జ్ఞాపకం చేసుకుంటూ అడిగింది లక్ష్మి. నారాయణ ఓ సెకను ఆలోచించి ‘‘అవును పట్నంలోనే - నేనక్కడేగా ఉండేది’’ అన్నాడు. ‘‘మీరు పట్నంలో ఏం చేస్తుంటారు?’’ నారాయణ చిక్కులో పడ్డాడు. ఈ పల్లెటూరిపిల్ల, అమాయకురాలూ, రొమాంటిక్ ఊహలు ఉన్న లక్ష్మికి ఏం చెపితే పని జరుగు తుందో గటుక్కున ఊహించడం నారాయణ వంటి చురుకైనవాడికేనా కష్టమే. హోటలులో సర్వర్గా, కారు క్లీనరుగా, పిక్పాకెటర్గా, రైలులో మందులమ్మేవాడిగా బహుపాత్రాభి నయం చేసిన నటనావతంసుడు ఆలోచించి అన్నాడు ‘‘మోటారు డ్రైవర్ని.’’ ‘‘అంటే’’ ‘‘పెద్ద పెద్ద మోటారులూ, లారీలూ నడుపుతాను. నేనెలాగ నడుపితే అలాగ వెడతాయి.’’ చక్రం దగ్గర కూర్చుని మోటార్లు నడిపేవాళ్ళని చూడకపోలేదు లక్ష్మి. కాని నారాయణ చెప్పడంలో, ఈ డ్రైవరు పని అసాధారణమైనదిగా తోచింది ఆమెకి. ‘‘బాగా డబ్బొస్తుందా?’’ ‘‘ఓ, కావల్సినంత. మనం హాయిగా బతకొచ్చును.’’ లక్ష్మి హాయిగా బతకటాన్ని ఆలోచిస్తోంది. ‘‘నిన్నెప్పుడూ కారుమీద తిప్పుతాను. పట్నంలో కార్ల మీద పెద్ద పెద్ద వీధుల్లో ఝామ్మని పోతూంటే’’ అన్నాడు నారాయణ. కిలకిల నవ్వింది లక్ష్మి. నారాయణ సమర్థతలో నమ్మకం చిక్కింది. సంజ యెరుపులు కళ్ళల్లో కలలకి మరింత విభ్రమాన్ని చేకూర్చాయి. ‘‘మరి ఎప్పుడు పట్నం వెళ్ళటం?’’ అంది. ‘‘ఆ ఉంగరం ఎక్కడిది నీకు?’’ అన్నాడు నారాయణ లక్ష్మిపై గల శ్రద్ధను విశదపరుస్తూ. ‘‘నాదే.. ఏం?’’ బెదురుగా అంది లక్ష్మి. ‘‘అబద్ధం. నా దగ్గర దబాయించకు.’’ ‘‘నాదే నాదే.. మరి..’’ ‘‘నిజం చెప్పు. లేకపోతే పోలీసులొచ్చి జైల్లో పడేస్తారు నిన్ను. నీ కోసమే చెపుతున్నాను. నమ్మవా నన్ను?’’ లక్ష్మి సంగతంతా చెప్పింది. ‘‘ఈ ఉంగరం నీ దగ్గరుంటే అపాయం వెర్రిదానా. రేపీపాటికి ఖైదులో వుంటావు. ఈ ఉంగరం నా చేతికిచ్చెయి. రాత్రికి రాత్రి కరిగించేసి రూపాయలు తీసుకొస్తాను’’ అన్నాడు నారాయణ ఆత్రంగా. ‘‘నేను మంచి వోణీ పరికిణీ కొనుక్కుందామనుకున్నాను’’ దీనంగా అంది లక్ష్మి. ‘‘పిచ్చిదానా, నేను కొని తీసుకొస్తాను. ఈ చిరిగిన బట్టలతో పట్నం వెళ్ళితే నవ్వుతారు.’’ లక్ష్మి సందేహంగా బెదురుగా బాధగా ఉంగరాన్ని వేలినుంచి మెల్లగా తీసి ఇచ్చింది. ‘‘మరి పెళ్ళి చేసుకుంటావా!’’ అంది. ‘‘ఒట్టు వెయ్యలేదూ?’’ ఒట్టుయొక్క మహత్యాన్ని కిమ్మనకుండా అంగీకరిస్తుంది లక్ష్మి. ‘‘మళ్ళీ ఎప్పుడొస్తారు!’’ ‘‘ఈ రాత్రికి ఎక్కడో ఒకచోట పడుకో. తెల్లారగానే గుడి దగ్గరకు వచ్చి ఉండు. అక్కడికి నేను వస్తాను. రాత్రి కరిగించేసి అమ్మేసి డబ్బులు తీసుకొస్తాను. ఇద్దరం కలసి రెలైక్కి బొంబాయి వెళ్ళిపోదాం ఏం?’’ ‘‘అదేం వూరు? ఛ, నేను రాను.’’ ‘‘బొంబాయి చాలా పే..ద్ద పట్నం లక్ష్మీ.’’ ‘‘సీతాలు మరి చెన్నపట్నం వెళ్ళిందేం?’’ ‘‘వెధవ చెన్నాపట్నం. బొంబాయి ఇంకా గో.. ప్పవూరు. అక్కడ డబ్బు బోలెడు దొరుకుతుంది.’’ లక్ష్మి ఆలోచించింది. ‘‘గుడి కాడనే వుంటాను వస్తారా?’’ ‘‘తప్పకుండా. వెళ్ళొస్తాను - ఏం?’’ లక్ష్మి తలూపింది బెదురుగా. బుగ్గమీద చిటికవేసి గబగబా పొలాలలోంచి నడచి వెళ్ళిపోయాడు నారాయణ. చీకటి పడుతూంటే భయం కలసిన ఆనందంతో కలల మత్తుతో గుడివైపు నడచింది లక్ష్మి. ఆరు, ఏడు, ఎనిమిది. తొమ్మిది కూడా అయింది. లక్ష్మికి ఆకలి ఎక్కువౌతోంది. ఎండ చుర్రుమనగానే గుడి దగ్గర రావిచెట్టు నీడకి వెళ్ళికూర్చుంది. గుడిగోపురం అంత ఎత్తుగా ఎవరు కట్టారా అని చాలాసేపు ఆలోచించింది. గోపురం మీద ఏదో పక్షి వాలింది. లక్ష్మికి సరదా వేసింది. తనకి అంత పైన నుంచి భూమి అన్ని వైపులా చూడాలనిపించింది. కొంతసేపు ముసలి రోగిష్టి తల్లి జ్ఞాపకం వచ్చింది. బొడ్డులో తాళాలు దోపుకున్న సుబ్బయ్యగారు కేకలు వేస్తోన్నట్టు అనిపించింది. మధ్య మధ్య అకారణంగా ఉలిక్కిపడింది. గాలిలోంచి యేదో కమ్మని వాసన వస్తోంటే, లాలాజలాన్ని గుక్కిళ్ళు మింగింది. పూజారి గవరయ్య ఎవరు నువ్వని అడిగాడు. ‘బొమ్మాయి’ వెళ్తున్నానని చెప్పింది. నారాయణ ఎటువైపునుండీ రావడం లేదు. తనని దగా చేశాడా? గుండె కొట్టుకుంది భయంతో, ఆశాభంగంతో కాదు. తప్పకుండా వస్తాడు. తనని పెళ్ళిచేసుకుంటాడు. ఆ కళ్ళలో ఎంత ఇష్టంగా చూశాడు! కాలవ రేవు నుంచి తడిసిన బట్టలతో బిందెలు బుజాన పెట్టుకుని ఆడవాళ్ళు వెళు తున్నారు. గుళ్ళోంచి మంత్రాలు వినపడు తున్నాయి. దేవుణ్ణి తలచుకుని నమస్కరించింది. కళ్ళెత్తి చూసింది. ఎదురుగా సుబ్బయ్యగారు పోలీసులతో. లక్ష్మి కంగారుపడిపోయింది. పారిపోదామనుకుంది. ‘‘ఆగక్కడ’’ గద్దించాడు పోలీసు. లక్ష్మి జబ్బ పట్టుకున్నాడు. ‘‘ఇక్కడ తగులడ్డావా, ఇదేం బుద్ధే నీకు?’’ అన్నాడు సుబ్బయ్య. లక్ష్మి వణుకుతూంది. ‘‘ఏదీ ఉంగరం?’’ వగరుస్తూన్న సుబ్బయ్య గారు గట్టిగా గొంతుచించుకుని అడిగాడు. ‘‘ఉంగరవేంటీ?’’- తనని తాను కాపాడుకుంటానికి ఒకటే మార్గం అయిన అబద్ధాన్ని ఆశ్రయించింది లక్ష్మి. ‘‘రెండు తన్నండి’’ సుబ్బయ్య సలహా ఇచ్చాడు. పోలీసు లాఠీతో వీపు మీద పొడిచాడు. ‘‘అమ్మో’’ అంది లక్ష్మి. ‘‘చెప్పు ఉంగరం ఏంచేశావు?’’ ‘‘నాకు తెల్దు’’ మొరాయించింది లక్ష్మి. పోలీసు మొకాళ్ళ మీద లాఠీతో కొట్టాడు. అరిచింది లక్ష్మి. కళ్లమ్మట నీళ్లు ప్రవాహం కట్టాయి. జనం మూగారు. కొందరు వెకిలిగా నవ్వారు. కొందరసహ్యించు కున్నారు. ‘‘స్టేషనుకి నడు’’ అన్నాడు పోలీసు. మునివేళ్ళ మీద నిలబడి చుట్టూ మూగిన జనంలోకి, జనం అవతల వున్న రోడ్డు వైపూ పరకాయించి ఆశగా చూసింది నారాయణ వస్తున్నాడేమో అని. కానీ జాడ లేదు. తల్లి జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారిగా పెద్దపెట్టున ఏడ్చింది రోడ్డు మీద చతికిలబడి. పోలీసు ఒక పక్కా, సుబ్బయ్య ఒక పక్కా నడుస్తోంటే దారి పొడుగునా నారాయణ వస్తాడనీ, తనని విడిపిస్తాడనీ ఆశతో కన్నీళ్ళతో చూస్తూనే ఉంది. రెండు నెలలు జైలులో ఉండేటప్పటికి నారాయణ ఇంక రాడని లక్ష్మికి దృఢమైంది. ఇసుకలాంటి అన్నమూ, చీకటి కొట్టులాంటి జైలుగదీ, మనోవ్యథా... లక్ష్మిని నీరసంగా అసహ్యంగా చేసివేశాయి. ‘ఉంగరమూ పోయింది. పెళ్లీ పోయింది’ అని గొణుగుకునేది ఒక్కతే, కటకటాల్ని పట్టుకుని. మగవాడినెవడినీ నమ్మకూడదనుకుంది. అయినా సుబ్బయ్యగారి కొడుకు ఉంగరం తాను తీస్తే పోలిసులకెందుకూ బాధ అనిపించింది లక్ష్మికి. లక్ష్మి హేతువుకి ఈ చట్టాలు మనుష్యులూ అర్థం లేకుండా కనిపించాయి. రోజూ తెలియకుండా ఏడ్చేది. జ్వరం వచ్చేది. కదలకపోయినా కాళ్ళు లాగేవి. ముసలితల్లి చచ్చిపోయిందేమో అన్న దిగులు, రాత్రుళ్ళు నిద్రలో తనూ నారాయణా ‘బొమ్మాయి’ వెళుతూన్నట్టూ, దారిలో రైలు లోంచి తనని నారాయణ కిందికి తోసేసినట్లు, తన తల చితికి రక్తం ప్రవహించినట్టూ కలవచ్చి ‘బాబోయ్’ అని అరుస్తూ లేచి కూర్చునేది. ఒకరోజు ‘లక్ష్మీ’ అన్న పిలుపు వినబడింది. ఎక్కడా అని తెల్లబోయి గది నలువైపులా చూసింది. ఎవరూ కనబడలేదు. మళ్ళీ ‘లక్ష్మీ ఇక్కడ... నేను’ అన్న మాటలు వినిపించాయి. ధ్వని వచ్చిన వైపే చూసింది. తన గదినాను కున్న గది గోడ పగులులోంచి నారాయణ చూసి నవ్వుతున్నాడు. ‘‘నేనూ-నారాయణని లక్ష్మీ’’ ‘‘నువ్వెలాగొచ్చావు?’’ ఆశ్చర్యంతో అడిగింది లక్ష్మి. ‘‘నిన్న రాత్రి తీసుకువచ్చారు’’ ‘‘ఏం?’’ ‘‘సైకిల్ షాపులో పనికి కుదిరాను. డబ్బు అవసరం వచ్చి సైకిల్ చక్రం అమ్మేశాను. పోలీ సులు వచ్చి ఇక్కడ ఉండమని బతిమాలు కొన్నారు’’ నవ్వుతూ చెప్పాడు నారాయణ. ‘‘బలేగా అయింది సచ్చినోడా-బాగా అయింది’’ కసితో మెటికలు విరిచింది లక్ష్మి. ‘‘నాకిదేమీ కొత్త కాదు పిల్లా. ఇది అయిదోసారి మనం రావడం’’ అన్నాడు నారాయణ తన ఆధిక్యతను నిరూపిస్తూ. ‘‘మంచిదానివి లక్ష్మీ, నీ ఉంగరం అమ్మితే ఇరవైరూపాయలొచ్చినై. వారం రోజులు దర్జాగా వెలిగింది మన బతుకు. సినిమాలూ, కాఫీ హోటళ్ళూ హాయ్ హాయ్’’ ‘‘దొంగనాయాల’’ తిట్టింది లక్ష్మి. ‘‘నీ తిట్లు నాకు తగలవు’’ అన్నాడు. ‘‘అన్నాయం చేశావు దొంగసచ్చినోడా. నా ఉసురు నీకు తగుల్తుంది’’ అంది ఉక్రోషంతో. ‘‘ప్రపంచవే అన్యాయం లక్ష్మీ. ఎవడికి అవసరమైతే వాడే అన్యాయం చేస్తాడు. నువ్వు దొంగతనం చెయ్యలేదూ? నీ దగ్గర్నుంచి నేను కొట్టేశాను’’ ‘‘ఫో...నీ జిమ్మడా’’ ‘‘ఎక్కడికి పోను. ఇక్కడే నీకు సావాసనంగా వుంటాను’’ లక్ష్మి బాధతో మొహం మరోవైపు తిప్పి కూర్చుంది. నారాయణ నవ్వుతూ అన్నాడు.. ‘‘జైలు నుంచి విడిచాక వచ్చి నిన్ను తప్పకుండా పెళ్లిచేసుకుంటానులే’’ అంటూ ఫక్కున నవ్వాడు నారాయణ. లక్ష్మి ఉక్రోషంతో మాట్లాడలేదు. ‘‘అప్పుడు బొంబాయి వెళ్లిపోదాం. ఏది లక్ష్మీ ఇటు చూడు. ఒక ముద్దియ్యి’’ అంటూ ‘ప్చ్’ అని పెదవులతో చప్పుడు చేశాడు నారాయణ. లక్ష్మి దగ్గరున్న నీళ్ల లోటా తీసి పగులు వైపు విసిరింది. పెద్ద చప్పుడయింది. పోలీసు ‘ఏమిటది’ అని కేక వేశాడు. లక్ష్మి మోకాళ్ళ మీద తల ఆన్చి ఏడుస్తోంది. నారాయణ వెకిలినవ్వు జైలుగదిలో కోలాహలంగా ప్రతిధ్వనించింది. - తిలక్ -
జలపాతం గట్టున...
క్లాసిక్ కథ ఈ సంవత్సరాంతంలో ఎదురుచూడని ఒక మంచి ఉత్తరం వచ్చింది మాకు. అది ఎంతో సంతోషం కలిగించింది. జన్మస్థలం మీది అభిమానమూ, పొదిగై కొండ చరియల మీది సౌఖ్యమూ ప్రతి యేడూ మమ్మల్ని కుట్రాలానికి లాక్కుని వెడతాయి. ప్రతి యేడూ మేమక్కడికి వెళ్లేముందు, మా మిత్రులూ మా కుటుంబ వైద్యులూ అయిన డాక్టరు ముత్తుకుమారస్వామి గారిని సకుటుంబంగా వచ్చి మాతో పాటు కాలం గడపవలసిందిగా కోరుతాము. ఆయనా ప్రతిసారి మా ఆహ్వానాన్ని పెడచివిని పెడుతూ ఉంటాడు. ‘‘రెండు నెలలూ మీరు మాతో వుండవద్దు. రెండు వారాలైనా వుండండి’’ అని బలవంతం చేసేవాణ్ని. ‘‘అమ్మో! రెండు వారాలే! రెండు రోజులు కూడా నేనీ చెన్నపట్టణం విడిచిపెట్టి రాలేను’’ అని చెప్పేవాడు డాక్టరుగారు. ముత్తుకుమారస్వామి అలా అనడానికి ప్రబలమైన కారణం లేకపోలేదు. ఈ మహానగరంలో నూర్లకొద్ది డాక్టర్లున్నా ఎడింబరో వెళ్లి ఇంగ్లీషు భాషలోని యిరవై అక్షరాలను తమ పేర్లకు చివర తగిలించుకున్న వైద్యులున్నా, ఈ అరవై ఏళ్ల వృద్ధుడు డాక్టరు ముత్తుకుమారస్వామి వద్దకే రోగులు వెతుక్కుంటూ వెడతారు. అందులోనూ కోయడం, కత్తిరించడం, అతికించడం, కలిపి కుట్టడం వంటి శస్త్ర చికిత్సలంటేనూ, పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలంటేనూ తప్పకుండా కుమారస్వామి చేతి మీదుగా జరగాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రముఖుల శరీరాలు ముత్తుకుమారస్వామి కత్తికోసం ఎదురుచూస్తూ వుంటాయి. ఆయనకి భోజనం చేసేందుకు కూడా తీరిక వుండదు. ఆయనకి భోజనానికి కూర్చునే సావకాశం కూడా లేదని ఆయన భార్య అంటూ ఉంటుంది. నిజానికి ఆమె సాంబారూ అవియలూ అన్నంలో కలిపి ఒక పళ్లెంలో ఉంచుతుంది. డాక్టరు నిలబడే భోజనం ముగించుకుని త్వరత్వరగా ఒక శస్త్ర చికిత్స కోసం బయలుదేరుతారు. ఈ దృశ్యం నేను చాలాసార్లు చూశాను. ‘ఇటువంటి డాక్టర్ని రెండు నెలలపాటు రోగుల నుంచి వేరుచేసి, కుట్రాలంలో బంధిస్తే, అంతమంది రోగుల వుసురు మనకు కొడుతుందండి’ అని నా భార్య చాలాసార్లు నాతో చెప్పింది. ఈ డాక్టరు ముత్తుకుమారస్వామిగారి వద్ద నుంచే ఆ అపూర్వ లేఖ వచ్చింది. మేము కుట్రాలం చేరుకున్న రెండు వారాలకు ఆ జాబు వచ్చింది. సంతోషమూ ఆశ్చర్యమూ మమ్మల్ని ఆవహించాయి. సంతోషం ఎందుకంటే, సకుటుంబంగా వచ్చి డాక్టరుగారు మాతో ఉంటామని వ్రాశారు. ఆశ్చర్యం ఎందుకంటారేమో: రెండు నెలలూ మాతో ఉంటామంటూ ఉత్తరంలో వ్రాశారు. 2 కుట్రాలంలో మేము బస చేసిన యిల్లు మా బంధువులది. కొండ చరియా గుడిని ఆనుకుని వున్న మిట్టా కలిసే చోటు నుంచి జలపాతానికి వెళ్లే అందమైన బాట చివర, చెట్టు చేమలూ పూల మొక్కలూ దట్టంగా పెరిగిన ప్రదేశంలో ఉంది ఆ యిల్లు. చిన్న జలపాతం నుంచి గలగల పారే చిన్న వాగులలో ఒకటి ఈ యింట్లోకి ప్రవేశించి, యింటినంతా ఒక్కసారి ప్రదక్షిణం చేసి, వెనక వాకిలికి దగ్గరగా వున్న సరస్సు గుండా ప్రవహించి, చివ్వరికి ఒక చిన్న నదిలో కలిసింది. ఇంటిని అలా నిర్మించాడు ఆ గృహ యజమాని. ఇల్లు పెద్దది. దాని చుట్టూ మామిడి, పనస, కొబ్బరి - అలా రకరకాల ఫల వృక్షాలు గల ఒక తోట. ఆ తోట నానుకుని దక్షిణం వైపు ఒక గది వుంది. దానిని దానికి పక్కనే వున్న భాగాన్నీ డాక్టరుగారి కుటుంబానికి కేటాయించాము. ఈ ప్రశాంతమైన గదిలో దక్షిణం వైపు కిటికీని కనక తెరిస్తే చాలు కమ్మని తెమ్మెర వీస్తుంది. రోగాలనూ రొప్పులనూ తరిమివేసే యీ దక్షిణానిలం చాలా ఆరోగ్యకరమైంది. పొదిగై కొండమీది మూలికల మీదుగా, పూల మొక్కల సువాసనలను లీనం చేసుకుని వీచే యీ గాలి ఎక్కడ లేని హాయినిస్తుంది. పొద్దుటి వేళల, బాలభానుని కిరణాలలో వజ్రాలు చెదిరినట్లుగా జలపాతం తెల్లగా కనిపిస్తుంది. రాత్రివేళ, ఆ తెల్లని వెన్నెట్లో వెండి కరిగినట్లుగా జలపాతం దర్శనమిస్తుంది. డాక్టరుగారికీ గది బాగా నచ్చుతుందని అనుకున్నాము. ఆయన రాకకోసం మేము ఎదురు చూడసాగాము. డాక్టరుగారు తమ భార్యతోనూ, ఢిల్లీలో ఉద్యోగం చేసే కొడుకుతోనూ, మదరాసులో మేరీ ప్రభుత్వ కళాశాలలో చదువుకునే కూతురితోనూ వచ్చారు. వాళ్ల రాక మాకెంతో సంతోషం కలిగించింది. డాక్టరుగారి కొడుకూ కూతురూ జలపాతం వద్దకు వెళ్లి స్నానం చెయ్యడం, ఆకలితో ఇంటికి తిరిగి వచ్చి, దోసెలు తిని మళ్లీ జలపాతం వద్దకు వెళ్లడం, మళ్లీ యింటికి వచ్చి తిరునెల్వేలి ‘ఆనైకొంబన్’ (శ్రేష్ఠమైన వరి జాతి) అన్నంలో పులుసు పోసుకుని భోజనం చెయ్యడం, మళ్లీ జలపాతం వద్దకు వెళ్లడం - ఇలా కుట్రాలం జీవితాన్ని బాగా అనుభవించసాగారు. డాక్టరుగారి భార్య మొదటి రెండు మూడు రోజులు పొద్దుటిపూట జలపాతంలో స్నానం చెయ్యడం, మిగిలిన వేళల్లో ఆడవాళ్లతో కలిపి తెన్ కాశి, సెంగోట - మొదలైన ఆ చుట్టుపక్కల వూళ్లకు వెడుతూ హాయిగా కాలం గడపసాగింది. ఆ తర్వాత ఒక చిక్కు యేర్పడింది ముత్తుకుమారస్వామి వల్ల. అవును. కుట్రాలానికి వచ్చిన ఆ రోజే డాక్టరులో ఒక మార్పుని చూశాడు. ఎప్పుడూ నలుగురితో గలగలమంటూ నవ్వుతూ మాట్లాడే డాక్టరిప్పుడు మూగనోము పట్టాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. పొద్దునపూట జలపాతంలో స్నానం చేసేవాడు. తర్వాత ఫలహారం చేసి గదిలోకి వెళ్లేవాడు. అంతే. మధ్యాహ్నం భోజనానికి ఆయన్ని పిలవాలి. అంతవరకూ ఆయన ఆ గదిలోనే ఒంటరిగా కూర్చునేవాడు. బయటికి వచ్చేవాడు కాదు. ఆ తర్వాత సాయంకాలం నాలుగింటికి చేతికర్ర తీసుకుని జలపాతం బాట వెంబడి గాని, లేకపోతే చంపకాటవి వైపుగా గాని ఒంటరిగా? నడిచి వెళ్లేవాడు. మాట వరసకైనా తోడు రమ్మని ఎవ్వరినీ పిలిచేవాడు కాదు. చీకటి పడ్డ తర్వాత తిరిగి వచ్చేవాడు. ఇది చూచి నేను చాలా ఆశ్చర్యపోయాను. నాలుగైదు రోజులు గడచిన తర్వాత నా ఆశ్చర్యం మరీ ఎక్కువయింది. ఒకరోజు జలపాతం వద్ద నుంచి వచ్చి, ఫలహారం చేసి, మళ్లీ బయటికి వెళ్లాడు. చేతిలోని అల్యూమినియం పెట్టెలో ఒక దోసె మడిచి పెట్టుకున్నాడు. ‘‘ఇవాళ నేను కొండమీద కొంచెం దూరం వెళ్లి వస్తాను’’ అని వెళ్లిన మనిషి సాయంకాలం బాగా చీకటిపడ్డ తర్వాత గాని ఇంటికి తిరిగి రాలేదు. ఒక వారంపాటు ప్రతిరోజూ డాక్టరు ఒంటరిగా ఎక్కడికో వెళ్లి చీకటి పడ్డ తర్వాత తిరిగి వచ్చేవాడు. ఇది డాక్టరుగారి భార్యకు విచారహేతువయింది. ఒకరోజు ఆమె మాటల సందడిలో తన విచారహేతువుని వివరించింది. రాజస్థాన్ నుంచి తమిళనాడుకి వచ్చిన ఒక కళాకారుల బృందం తలవని తలంపుగా భయంకరమైన రైలు ప్రమాదానికి పాల్పడడం, ప్రభుత్వం ఆసుపత్రిలో వాళ్లకు డాక్టరు ముత్తుకుమారస్వామి కొన్ని ముఖ్యమైన చిక్సితలు చేయడం మొదలైనవాటిని గురించి నేను కుట్రాలానికి వచ్చిన మరునాడు పత్రికా ముఖంగా తెలుసుకున్నాను. ఈ చికిత్సల తదనంతరం డాక్టరుగారి వైఖరిలో ఏదో ఒక మార్పు ఏర్పడిందని ఆయన భార్య ఇప్పుడు చెప్పింది. ‘‘బాబూ! ఆ రోజు మొదలుకొని మీ డాక్టరుగరు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడం మానివేశారు. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించేవారు. కుట్రాలానికి వెడదామని ఆయన చెప్పడం కూడా ఈ మార్పు ఫలితమే. మొదట్లో నేను ఆశ్యర్యపోయాను. కాని కుట్రాలానికి వచ్చిన తర్వాత, ఈ మార్పూ మౌనమూ తగ్గిపోతాయని అనుకున్నాను. ఇక్కడికి వచ్చినా ఆయన ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. ఆయన ఏకాంతంగా వుండడం, కొండలకూ కోనలకూ వెళ్లడం చూస్తుంటే నాకేదోలా ఉంది. మీరు కొంచెం ఆయన్ని కనిపెట్టుకుని వుండండి’’ అంది డాక్టరుగారి భార్య. 3 ఒకరోజు డాక్టరుగారిని అనుసరించి వెళ్లాను, ఆయనకు తెలియకుండా. చేతికర్రను టక్ టక్మని నేలమీద మోపుకుంటూ గబగబా నడిచి వెడుతున్నాడు డాక్టరు. వంపులు తిరిగిన దోవ కావడం వల్ల, ఆయన నన్నెక్కడ చూస్తాడో అని పొదల్లోనూ బండరాళ్ల మధ్యగానూ ఒదిగి ఒదిగి నేను ఆయన వెనకాలే వెళ్లాను. మిట్టమధ్యాహ్నం వేళ ఆయన చంపకాటవిని చేరుకున్నాడు. ఒక పొద మాటున చేరి ఆయన్ని నేను పరీక్షగా చూశాను. చంపకాదేవి ఆలయం పక్కన వున్న కొండ చరియలో అందమైన గుహ ఒకటుంది గదా! గలగలమంటూ కిందికి ఉరుకులు వేసే జలపాతం దగ్గర భగవదనుగ్రహం కోసం నిరీక్షించే భక్తుని నిండు మనస్సులా దర్శనమిచ్చే ఆ గుహ చాలామందికి తెలుసు. ఇంకా కొంచెం పైకి నడిస్తే ఆ ప్రాంతంలో అటువంటి చిన్న చిన్న గుహలు మరికొన్ని కనిపిస్తాయి. ఆ కోవకు చెందిన ఒక గుహలో మన డాక్టరుగారు కళ్లు రెండూ మూసుకుని ఆసీనుడయ్యాడు. తంబురా శ్రుతిని స్ఫురణకు తెచ్చే కొండవాగుల మృదు ధ్వని, ఆ ఆధార శ్రుతిలో తమ వివిధ కంఠాలను మేళవింపు జేసి గానం చేస్తున్న పక్షుల కిలకిల రావాలు, ఆ గానానికి మృదంగం వాయిస్తున్నట్లుగా జలపాతం చేసే సవ్వడీ - మధుర గానంలా వినిపిస్తున్నాయి ఆ కొండ మీద. ఆ గానం వింటూ మైమరచి డాక్టర్ ముత్తుకుమారస్వామి కళ్లు మూసుకున్నాడా? లేకపోతే ఆయన అంతరంగం లోలోపలి వాగురలో చిక్కుకుపోయిందా? పొదమాటు నుంచి బయటపడి తొందరగా నడిచాను. ‘‘డాక్టర్... డాక్టర్!’’ సరాసరి డాక్టరు వద్దకు వెళ్లి, ఆయనకెదురుగా కూర్చున్నాను. బెదిరిపోయినవానిలా, ఆయన కళ్లు తెరిచాడు. నా రాక ఆయనకు నచ్చలేదు. ఆయన చూపులు తీక్షణంగా ఉన్నాయి. ‘‘నన్ను క్షమించాలి డాక్టరుగారూ! మీరిలా యిక్కడ ఒంటరిగా కూర్చోవడం, మాటా పలుకూ లేకుండా మౌనముద్ర దాల్చి మీరు సంచరించడం, చూస్తే మాకందరికీ దిగులుగా వుంది. ఇందువల్ల మీ భార్య కూడా దిగులుపడుతోంది.’’ ‘‘మీ దిగులుని అర్థం చేసుకుంటున్నాను. కాని నన్ను విసిగించననీ, నా ప్రయత్నాన్ని వారించననీ మీరు కనక మాట యిస్తే మీతో మాట్లాడతాను. లేకపోతే...’’ ‘‘మిమ్మల్ని విసిగించను. మీరు చెప్పినట్లే మాట యిస్తున్నాను. మీరు చెప్పండి డాక్టరుగారూ...’’ అన్నాను నేను. డాక్టరు చెప్పాడు. ‘‘రాజస్థాన్ నుంచి ఒక కళాకారుల బృందం తమిళదేశం రావడం, తలవని తలంపుగా ఆ బృందం వారికి రైలు ప్రమాదం సంభవించడం, వాళ్లను ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్చడం, వాళ్లకు నేను చికిత్స చేయడం, మొదలైనవి మీరు పత్రికలలో చదివే వుంటారు. ఆ కళాకారుల్లో ముగ్గురికి బలమైన గాయాలు తగిలాయి. వాళ్లకు చికిత్స చేసే బాధ్యత నామీద పడింది. ఇందులో ఒక పెద్ద చిక్కు యేమిటంటే, ముగ్గురిలో ఒకామె స్త్రీ. ఆమెకు కాలు తీసెయ్యాలి. కోసి తీసెయ్యాలి. ఒక యువకుడి కళ్లల్లో గాజు ముక్కలు లోతుగా నాటుకున్నాయి. అందుకు ఒక కంటి డాక్టరు శస్త్ర చికిత్స చేయాలి. అదీ నా పర్యవేక్షణలోనే జరగాలి. మరొకతనికి కుడి చెయ్యి పూర్తిగా తీసివేస్తేనే, అతను బతుకుతాడు. నా సంగతి మీకు తెలిసిందే గదా! శస్త్ర చికిత్స విషయంలో తూర్పు పడమరలు చూస్తూ కాలక్షేపం చేయను. మనుషులు అరటికాయలు, వంకాయలూ అని అనుకునే స్వభావం నాది.’’ ఇలా డాక్టరు చెపుతున్నప్పుడు, నాకు ఆశ్చర్యం కలిగింది. ‘‘ఏవిటండీ డాక్టరుగారూ! మీరలా మాట్టాడుతున్నారు? మీరు శస్త్ర చికిత్స కనక చెయ్యకపోతే, మొదటికే మోసమవుతుంది కదా! అందుకని శస్త్ర చికిత్స చేస్తారు. ఇందులో తప్పేముంది.’’ ‘‘అంతవరకూ, ఆ ముగ్గురికీ శస్త్ర చికిత్స చేసేంతవరకూ, నేనూ అలాగే అనుకున్నాను.’’ ‘‘ఏం! వాళ్లు ముగ్గురూ బతకలేదా?’’ ‘‘వాళ్లు బతికారు. అందుకే నేను విచారిస్తున్నాను. చచ్చిపోయివుంటే, యింతగా విచారించి వుండేవాణ్ని కాను’’ ఇలా అంటున్నప్పుడు డాక్టరుగారి కళ్లు చెమ్మగిల్లాయి. ‘‘డాక్టరుగారూ! మీరు నన్ను తికమక పెడుతున్నారు.’’ ‘‘బాబూ! ఆ ముగ్గురు కళకారులకు స్పృహ తెలిసిన తర్వాత, ఆ మరు క్షణంలోనే వాళ్లు పడ్డ బాధను చూసి, నేనెంత బాధపడ్డానో నీకెలా చెప్పగలను? నేను పడ్డ బాధ, పడుతున్న బాధ, పడబోయే బాధ - వీటికి హద్దులేదు. ఎందుకంటే, నేను కాలు తీసివేసిన స్త్రీ రాజస్థానంలో ప్రసిద్ధికెక్కిన నాట్యగత్తె అట! కళ్లు తీసివేసిన ఆ కళాభిజ్ఞుడు ప్రముఖ చిత్రకారుడు. దయాదాక్షణ్యాలు లేకుండా కుడిచెయ్యి తీసివేసిన వ్యక్తి సుప్రసిద్ధ సారంగి విద్వాంసుడట! రాజస్థాన్ నుంచి వచ్చిన ఆ బృందంలో వీళ్లు ముగ్గురే ముఖ్యులట. నాట్యగత్తెకు కాలే పంచప్రాణాలు; చిత్రకారుడికి కళ్లే ప్రాణం; సారంగి విద్వాంసుడికి జీవితం అతని వాద్యం; వాయించడానికి చెయ్యి-చేతివేళ్లు చాలా అవసరం. వాటినే నేను తీసివేయవలసి వచ్చింది.’’ చెప్పడం పూర్తయిందో లేదో ఆయన కళ్ల వెంబడి ధారగా కన్నీళ్లు జారాయి. ఏం చెప్పాలో నాకేమీ తోచలేదు. ‘‘నాయనా! మనుషుల్ని బతికిస్తున్నాననే వుద్దేశంతో, నేను నా శక్తిలోనూ సేవలోనూ తృప్తి చెందుతున్నాను. మదరాసు నుంచి కుట్రాలానికి వచ్చినా, ఈ సంఘటనను ఆధారం చేసుకుని యముడు నామీద పగ తీర్చుకుంటున్నాడా అనిపిస్తుంది. నేను చేసిన పనికి ఇదొక శిక్ష. ఆ ముగ్గురు కళాకారులకు ప్రాణదానం చేసి, వాళ్లను జీవచ్ఛవాలుగా చేశాను గదా! ఆ దుఃఖం నన్ను మాడ్చివేస్తోంది. నాకు ప్రాణం పోతున్నట్లనిపిస్తోంది. ఆ ముగ్గురు తమ ప్రాణ ప్రాణమైన అంగాలు కోల్పోయినందుకు కన్నీరు మున్నీరుగా దుఃఖించారు. ఆ కన్నీటి వేడిని యీ కుట్రాలం జలపాతం కూడా తగ్గించలేకపోతోంది. ఈ చల్లని తెమ్మెరలు కూడా వేడెక్కిన నా మనస్సుకి చల్లగా తగలడం లేదు. మనస్సులో ఏదో బాధ. దేహ ప్రాణాలలో శక్తి లేదు. ఈ అడవులూ కొండలూ తిరిగి, ఈ ఒంటరితనంలో కళ్లు మూసుకుని నా బాధ నుంచి విముక్తి చెందడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మధురం, మధురం ఏకాంతం’’ అంటారు గద. ఆ ఏకాంతాన్ని వెతుక్కుంటూ యిక్కడికి వచ్చాను. కళ్లు బాగా మూసుకుంటేనైనా, ఆ ఏకాంతం లభిస్తుందేమోనని అనుకుంటున్నాను. కాని అందువల్లా లాభం కలిగించలేదు. కుమిలిపోతున్నాను; కుమిలిపోతున్నాను’’ అన్నాడు డాక్టరు. 4 ఈ సంఘటనకు తర్వాత డాక్టరుగారి వైఖరిలో యింకా గొప్ప మార్పుని చూశాను. అడవిలోకి వెళ్లి, కళ్లు మూసుకుని, ప్రశాంతత కోసం ప్రయత్నించాడు. ఇప్పుడేమో యింట్లోనే కళ్లు మూసుకుని, మౌనముద్ర దాల్చి, ఏకాంతంగా కాలం గడపసాగాడు. ఇది అందరి దిగులునీ యినుమడింపజేసింది. అందువల్ల నేనెక్కడికైనా వెడితే చాలు, బలవంతంగానైనా, డాక్టరుగారిని నాతోపాటు పంపించసాగారు. మదరాసుని గురించి గాని, రోగుల్ని గురించి గాని ఆయన కొంచెమైనా అనుకునేవాడు కాదు. మాకందరికీ ఆయన ఒక మనో వ్యాధిని సంక్రమింపజేయడమే కాక, ఆయన కూడా మహా బాధపడేవాడు. ఇలా ఉండగా, పాళయం కోట నుంచి ఒక వార్త వచ్చింది. రాత్రులలో మదరాసు నగరంలో ఇళ్లల్లో ప్రవేశించి, తుపాకులు చూపి కొల్లగొట్టే గజ దొంగల్లో ముగ్గురు ముఖ్యులు పాళయం కోటలో పట్టుబడ్డారనీ, వాళ్ల వద్ద ఉన్న వస్తువుల్ని సోదా చేయగా మదరాసులో మా యింట్లో ఐదేళ్లకు మునుపు పోయిన కొన్ని వెండి సామాన్లు వాళ్ల వద్ద కనిపించాయనీ, నేను పాళయం కోటకు వెళ్లి ఆ దొంగల్నీ సామాన్లనీ గుర్తుపట్టాలనీ నాకు కబురు అందింది. కారులో బయలుదేరి వెళ్లి, మధ్యాహ్నానికల్లా తిరిగి వచ్చేద్దామనుకున్నాను. బలవంతం చేసి, ఎలాగో డాక్టరుగారిని కూడా బయలుదేరదీశాను. పట్టుబడిన ముగ్గురు దొంగలూ ఘటికులే. తుపాకి గురి చూచి పేల్చడంలో ఒకడు మహా నేర్పరి. అతని కంటిచూపు అటువంటిది. మారు తాళాలతో తాళాలు తీసి, లోపలికి వెళ్లడంలో యింకొకడు సిద్ధ హస్తుడు. మూడోవాడు ఎన్ని బస్తాలనైనా సరే బుజాల మీద మోసుకుని కొన్ని మైళ్లు నిమిషంలో పరిగెత్తగల ఘటికుడు. ఈ ముగ్గురి దర్శన భాగ్యం కలిగింది మాకు పాళయం కోటలో. కాని ఆశ్చర్యమేమిటంటే, నాతోపాటు వచ్చిన డాక్టరుగారిని చూడగానే, వాళ్లు ముగ్గురూ చేతులు జోడించి, ఆయనకు నమస్కరించారు. కాని డాక్టరు నిర్లిప్తంగా ఉండిపోయాడు. అంతసేపూ ఆయన అడవులూ కొండలూ మరిచిపోయి నాతోపాటు వుండడం గొప్ప విషయమనుకున్నాను. ఇక అక్కడ కాలక్షేపం చెయ్యకుండా, మేము కుట్రాలానికి తిరిగి వచ్చేశాము. ‘‘ఈ డాక్టరుగారిని మీరింతకు మునుపే ఎరుగుదురా?’’ అని అడగ్గ, ఈ కింది విషయాలు బయటపడ్డాయి. పెక్కు సందర్భాలలో రకరకాల చిక్కులలో రకరకాల పేర్లతోనూ రకరకాల వంకలతోనూ ఈ ముగ్గురు దొంగలు ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందారు. ముఖ్యంగా చెప్పవలసిన సంఘటన యేమిటంటే; కన్నాలు వేసే దొంగ కణ్ణుస్వామి ఒకసారి పైనుంచి కిందపడి, చెయ్యి విరిగిన స్థితిలో ఆసుపత్రికి వచ్చాడు. అతని చేతిని సరిచేసి, బాగుచేసి, చేతిని మళ్లీ పెకైత్తేటట్లు చేసిన ఘనత డాక్టరు ముత్తుకుమారస్వామికి దక్కింది. ఆ చెయ్యే యిప్పుడు కన్నాలు వెయ్యడానికి ఉపకరిస్తూంది. తుపాకీ వీరుడు దొరసామి ఎటువంటి వాడనుకున్నారు! ఒకసారి జరిగిన ఘోర ప్రమాదంలో వాడి కంట్లో ఒక సూది గుచ్చుకుంది. కన్ను పాడు కాకుండా, చూపు చెడిపోకుండా, ఆ కంటిని బాగుచేయడం జరిగింది. ఎవరనుకున్నారు? ఇంకెవరు? డాక్టరు ముత్తుకుమారస్వామీ, ఆయనకు తోడ్పడ్డ ఒక కంటి డాక్టరూను. బస్తాలు అనాయాసంగా మోసే పహిల్వాన్ ముత్తుపక్కిరి? ఆ మూడో దొంగ ఎలాంటివాడని! ఒకప్పుడు తిండికి గతిలేక, నల్లుల మందు తిని, ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. ముత్తుకుమారస్వామి మనుషుల్ని చావనిస్తాడా మరి! వాడికి ప్రాణ దానం చేసి కాపాడడమే కాకుండా, వైటమిన్ మాత్రలతో వాడి కడుపు నింపి, వాణ్ని లోకంలోకి పంపించాడు. కంటిచూపు పొందిన తుపాకీ వీరుడు దొరసామి యిప్పుడు బాగా గురిచూసి తుపాకీ పేలుస్తున్నాడు. చెయ్యి బాగయిన కణ్ణసామి కన్నాలు వేయడంలో ఘటికుడనిపించుకున్నాడు. పహిల్వాన్ పక్కిరి డాక్టరిచ్చిన ఉత్సాహంతో తన వృత్తిని మహా నేర్పుగా సాగిస్తున్నాడు. ఈ ముగ్గురి వద్దా కనిపించిన వెండి సామాన్లు మావని తేలాయి. 5 పోలీసుల వద్ద నుంచి యీ విషయాదికం తెలుసుకున్న ఆ మరునాడే డాక్టరు ముత్తుకుమారస్వామి మదరాసుకి ప్రయాణమైనాడు. ‘‘ఏవిటి డాక్టరుగారూ! ఉన్నట్టుండి ప్రయాణమయ్యారు?’’ అని అడిగాను ఆశ్చర్యంగా, ఆశగా. ‘‘ఒక్క నెలరోజులుగా నేను నా రోగుల్ని మరిచిపోయి, నేనే జబ్బుపడ్డాను. ఇప్పుడు నా జబ్బు నయమయింది. ఇక నా రోగుల వ్యాధుల్ని పరిశీలించాలి. నా కోసం ఎందరు ఎదురుచూస్తున్నారో మదరాసులో!’’ ‘‘ఏమంటున్నారు మీరు?’’ ‘‘నాట్యగత్తె కాలు తీసివేసినందుకూ, చిత్రకారుని కళ్లు తీసివేసినందుకూ, సారంగి విద్వాంసునికి చెయ్యి తీసివేసినందుకూ నేనింతవరకూ చాలా బాధపడ్డాను, దుఃఖించాను. కానీ యిప్పుడు నేను విన్నదేవిటి! కష్టపడి కళ్లిచ్చాను ఒకడికి. కాళ్లూ చేతులూ బాగు చేశాను మరి యిద్దరికి. వాళ్లిప్పుడు ఏం పనులు చేస్తున్నారో విన్నావుగా? వాటిని తీసివేసినందుకూ నేనే బాధ్యుణ్ని; అలాగే బాగుచేసినందుకూ నేనే బాధ్యుణ్ని. ఏమంటారు?’’ డాక్టర్ ఒక్క క్షణం కళ్లు మూసుకుని మళ్లీ ఇలా అన్నాడు. ‘‘నాయనా, నా వృత్తి శస్త్ర చికిత్స చెయ్యడం. అంతకుమించి నా మెదడు పనిచెయ్యకూడదు. నా బాధ్యత నా వృత్తి నిర్వహణతో పూర్తయినట్లే. దేవుడు చేసే పనిని నేను చేస్తున్నట్టు అనుకోవడం అవివేకం. కళ్లూ కాళ్లూ చేతులూ తీసివెయ్యడం, బాగుచెయ్యడం వైద్య శాస్త్ర రీత్యా చేసే ఒక చికిత్స; పని. ఈ అంగాలను సద్వినియోగమో దుర్వినియోగమో చేసుకోవడం, దేనికి ఎంత కాలం వినియోగించాలో - ఇటువంటివి నా చేతిలో లేవు. అదంతా లలాట లిఖితం’’ అన్నాడు డాక్టరు. ‘‘లలాట లిఖితాన్ని మార్చడమే గదా మీ పని?’’ ‘‘కాదు. కాని అలా అనుకున్నాను కొన్ని రోజులు. అది తప్పు. చావు పుట్టుకలు, రోగాలు రొప్పులూ అవి లేకపోవడం - ఇవన్నీ వైద్య శాస్త్రానికి భిన్నంగా పరిశోధించడం అవివేకం. భగవల్లీలలను పరిశీలించడానికి పూనుకుంటే, డాక్టరుకే జబ్బు చేస్తుంది. ఆ తర్వాత దానికి మందు లేదు. రండి. జలపాతంలో స్నానం చేసి నేను మదరాసుకి బయలుదేరాలి. రోగులెంతమందో నాకోసం ఎదురుచూస్తూ వుంటారు. నా విద్యుక్త ధర్మం నన్ను పిలుస్తోంది.’’ ఇలా అంటూ కాల ప్రవాహమైన జలపాతం గట్టు వెంబడి నడక సాగించాడు డాక్టరు ముత్తుకుమారస్వామి. - సోము -
ముంగిస కథ
క్లాసిక్ కథ వంశధార నది ఒడ్డునే మడపాం గ్రామంలో డాక్టరు అప్పారావుగారి ఇల్లు. రెండు వాసల్లో ఒకటి మిద్దెటిల్లు, రెండోది అటక మీద గడ్డినేత ఇల్లు. ప్రతి సంవత్సరం వరదల్లో ఒడ్డు కూలిపోతూందని సర్కారువారు కొండరాళ్లు వాలుగా పేరుపు పేర్చారు. అది పేర్చాక రెండు వరదలు వచ్చినా ఒడ్డు చెక్కుచెదరలేదు. ఈ ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వర్షాకాలంలో బొబ్బలు పెట్టుకుంటూ చెట్లనూ, శవాలనూ తోసుకు వచ్చిన వరద వెల్లువ పాములను కూడా జీవంతో తెచ్చేది. ఆ రాళ్ల సందుల్లో దాగున్న పాములు ఒకోసారి రాత్రివేళ ఇంట్లోనే ఉండేవి. ఒకనాడైతే ఒక పాము పైనించి మంచం మీదనే పడింది. ఆయుర్వేద వైద్య వృత్తితో పాటు వ్యవసాయం కూడా చేస్తున్న అప్పారావు పంటల కాలంలో ముఖ్యంగా ఇంకో ఉపద్రవాన్ని కూడా ఎదుర్కోవలసి వచ్చేది. ఎంతో పదిలంగా, భద్రంగా దాచిన ధాన్యాలను పదోవంతైనా ఎలకలకూ, పందికొక్కులకూ ధారపొయ్యవలసిందే! పెంచిన పిల్లి ఒకటి ఈ పందికొక్కుల సమూహానికి జడిసిపోయినట్లుంది. ఇంట్లో పడుకోదు. యజమానురాలు పడుకున్న మిద్దె ఇంట్లో పక్కనే పడుకుంటుంది. డాక్టరుగారికి ఇద్దరు పిల్లలు. కొడుకు వెయ్యి మైళ్ల దూరంలో మిలిటరీ ఆఫీసరు. కూతురు అత్తవారింట్లో ఎనిమిది మైళ్ల దూరంలో ఉంటుంది. డాక్టరు ఎందరి బాధలనో కుదర్చగలిగారు గాని ఈ ఎలకల, పాముల బాధ నించి విముక్తి పొందలేకపోయాడు. ఒకనాడు ఉదయమే ఒక ఎరకలవాడు ఒక ముంగిస పిల్లను తెచ్చాడు. ‘‘ఇది నాకెందుకూ?’’ అన్నాడు డాక్టరు. ‘‘బాబూ, మీకు పాములు, ఎలకలు బాధ. ఇది ఇప్పుడు బుల్లిపిల్లలా ఉంది. ఆరు నెలల్లో పెరిగి పెద్దదయిపోతాది. అప్పుడు దీని మేలు మీకు తెలుస్తాది.’’ ‘‘పెంపుడు జంతువా ఉండటానికి.’’ ‘‘మన తరిఫీదు బట్టి ఉంటాది బాబూ. పదిహేను రోజులు ఒక గూడులో తాడుతో కట్టి పెట్టండి. ఏ పిల్లీ, కుక్కా నొక్కేకుండా సూడండి. పాలన్నం తింటాది. ఏదైనా తీపి వస్తువు తింటాది. అప్పుడు మెడలో మూడు మువ్వలు కట్టెయ్యండి దొరా.’’ ‘‘మువ్వలు కడ్తే ఎలకల్ని, పాముల్ని ఎలా పడుతుందిరా? పిల్లికి గంటలు కట్టిన చందం కదరా.’’ ‘‘అది కాదు దొరా! మువ్వలు మోగితే ఆ ముంగిస జాతి దీనిని దగ్గిరకు చేరనివ్వవు. వెలేస్తాయి. దానికింకో గతి లేక మనిల్లు వదల్దు.’’ ముంగిస పిల్లను పట్టుకోవడానికి డాక్టరుకు భయం వేసింది. ఆ ఎరకలవాడే తాడు కట్టాడు. పాలన్నం ఇచ్చినా ముంగిస పిల్ల తినలేదు. కర్కర్ అని అరుస్తూంది. ‘‘అది అలా అరుస్తూంది. అదిక్కడ బతుకుతుందిరా?’’ అన్నాడు డాక్టరు. ‘‘తల్లినొదిలి ఉండటం కదా? రెండు రోజులు తల్లికోసరం ఏడుస్తుంది బాబూ.’’ డాక్టరు భార్య అమ్మాయమ్మ దాని గోలను కొంత పంచదార పోసిన రొట్టెముక్కనిచ్చి తగ్గించింది. రెండు మూడు రోజులకొకసారి ఆ ఎరకల ఎండన్న వచ్చి చూసి పెంచడం విషయంలో సలహాలిచ్చిపోయేవాడు. చూస్తుండగానే ముంగిస పెరిగిపోయింది. పదిహేను రోజుల్లో దానికి డొక్కులో పెట్టే అవసరం లేకపోయింది. తాడు మెడకు కట్టి అది ఎటు తీసుకువెళ్తే అటు తిప్పేది అమ్మాయమ్మ. చుంచు మూతి, మూతి చివర లేత ఎరుపు, ఊదారంగు శరీరం, కొండ చీపురుకట్టలా తోక, చిన్న కళ్లూ, చెవులూ గెంతుతూ నడుస్తూంటే మువ్వలు గలగలలాడుతున్నాయి. దానికి పేరు కూడా అమ్మాయమ్మ పెట్టింది. ‘‘బయ్యన్న... బయ్యన్న..’’ నెలరోజులకల్లా ఏ తాడు అక్కర్లేకపోయింది. పేరు పెట్టి పిలిస్తే పరుగెత్తుకు వస్తూంది. మూడు నెలలకు చుంచెలకలా ఎదిగిపోయింది. ఇప్పుడు దాని నివాసం ఇల్లు కాదు, పెరట్లో ఉన్న కర్రడొక్కు కాదు. ఏటి ఒడ్డున రాళ్ల పేరుపులో ఒక బిలం. ఉదయం కాఫీ వేళకి బిలం నించి బయటకు వచ్చి అటకమీదకెక్కి గోడలమీద నించి పాకుతూ ఘల్లుఘల్లుమంటూ మెల్లగా దిగువకు దిగుతుంది. అమ్మాయమ్మ ఆ మువ్వల మోత వినగానే ‘‘బయ్యన్నా, రారా’’ అని పిలుస్తుంది. దానికోసం ఒక పాతచేట గోడ దగ్గిరే పరిచి ఉంటుంది. దానిమీద కూర్చొని ఒకసారి ముందు కాళ్లు రెండూ ఎత్తుతుంది. ఇడ్లీ పంచదార వెయ్యకుండా ఎదర పెడితే అలుగుతుంది. పంచదార వెయ్యగానే అంత ముక్క అయిదు నిమిషాల్లో మింగేస్తుంది. మళ్లీ తిరుగు ప్రయాణం, అటు ధాన్యపు గాదెలు, ఇటు అటక, ఇంటి చుట్టూ ఒకసారి సాయుధ భటునిలా తిరిగి మళ్లీ బిలంలోనికి వెళ్లిపోతుంది. అమ్మాయమ్మ మధ్యన ఒకసారి ఏటి ఒడ్డుకు వచ్చి ‘‘బయ్యన్నా’’ అని కేక వేస్తే, ఒకసారి చాలు - ఘల్లుఘల్లున వస్తుంది. చేతిలో చేపను చూపిస్తుంది. అది ఇవ్వకపోతే ఆమె పాదాలపై నిల్చుని పైకి పాకడానికి ప్రయత్నిస్తుంది. ఈ బయ్యన్న ఇప్పుడు ఇంట్లో ఒక ముద్దు పిల్లాడు. కడుపు నిండా పెట్టకపోతే వాడు ఎంతో మారాం చేస్తాడు. అమ్మాయమ్మ కాళ్లా వేళ్లా పడతాడు. ఏ పనీ చెయ్యనివ్వడు. అదే పనిగా అరుస్తాడు. ఆమె మీదకే చెవిలో ఏదో చెబుదామని ఎగబ్రాకిపోతాడు. ఆ చిన్ని కాళ్లతో అడ్డాలలో పిల్లడు తల్లికి మూతితో, కాళ్లు చేతులతో గిలిగింతలు పెట్టినట్టు పెడతాడు. బయ్యన్న వాళ్ల దృష్టిలో ఇంకా ఆర్నెల్ల పిల్లాడే. కాని వాడు ఇంటి యజమానైపోయాడు. ఇంటి యజమాని సాధించలేక, విసిగి వదిలేసిన పనులన్నీ ఈ ఆరు నెలల యువకుడూ సాధించేవాడు. ఇంట్లో ఎలకలు లేవు. పందికొక్కులింకెటు పారిపోయాయో? ఏ తుప్పలు పట్టేశాయో? పాము పిల్లయినా మచ్చుకు కనబడలేదు. పాము పొరలు వెతుకుదామన్నా ఏటి ఒడ్డున కనబడలేదు. ఈ సంవత్సరం వాళ్లు ఎక్కడ, ఏది, ఎలా విడిచి పెట్టినా అలాగే ఉంటూంది. కూరగాయలు బోనె పెట్టి మీద పడేస్తున్నారు. ధాన్యం ఒక్కోసారి అలా నేలమీదో, బుట్టలోనో ఉంచేస్తున్నారు. ఏటిపై వచ్చే చల్లగాలి హాయిగా పీల్చి, వెన్నెలను తెరచాప చేసుకొని, నావలా కదిలే నీటిని చూస్తూ, ఏటి ఒడ్డున నిల్చుంటున్నారిద్దరూ. ఒక్కోసారి వాళ్ల యౌవనపు రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఇదివరలా ఏ పామైనా కాళ్లకు చుట్టుకుంటుందన్న భయం లేదు. ఒకనాటి తెల్లవారుఝామునే డాక్టరు ఇంటి ముందు గంభీరంగా భైరవయ్య చేతితో కర్రతో నిల్చున్నాడు. వాడు వీళ్లకు దూరపు చుట్టం. వీళ్లకు వాడి కంటే జరుగుబాటు హెచ్చని కన్నుకుట్టుకుంటున్నాడు. ఏదో సాకుతో వీళ్లమీద విరుచుకుపడ్డానికి ఉరుకుతూంటాడు. మాంచి పొంకంతో మెలితిరిగిన నల్లని బొడ్డు మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టగలనంటాడు. పెరిగిన జుత్తుకు వంకీలు తిప్పి వెనక్కి వదిలాడు. ‘‘ఏమైం’’దన్నాడు డాక్టరు. ‘‘నే చెప్పాలా? రాత్రి బయ్యన్న ఈ కోడిపిల్లల్ని నొక్కేసింది.’’ ‘‘ఎవరు చూశారు?’’ ‘‘దీనికి సాక్ష్యం కావాలా?’’ ‘‘నీవు కళ్లెర్రజేస్తే పనికిరాదు. అనవసరంగా మా బయ్యన్న మీద నేరం మోపక. అలాంటి పని చెయ్యడు. ఎవరో పిలిచి వేస్తే తింటాడు. అంతే.’’ ‘‘నీకు సాక్ష్యమే కావలసినవే వస్తే తెస్తాను.’’ వాడు పొరుగునుంచే సాక్ష్యం తెచ్చాడు. గడపలోనున్న కోడిప్లిలల్ని హతమార్చింది మీ బయ్యన్నేనని చెప్పగానే ఇది దొంగ సాక్ష్యమని కేకలేశాడు. ‘‘వీటి ఖరీదు, పది రూపాయలు. ఇచ్చేయి.’’ ‘‘అనవసరంగా నేనెందుకివ్వాలి? మా బయ్యన్న పీకలు కొరికే నీచుడు కాడు. నేను ఒక్క దమ్మిడీ ఇవ్వమంటే ఇవ్వను.’’ ‘‘సరే! పెద్దింటివాడివి. పసిమితో ఎగురుతున్నావు. నాకు నష్టం వచ్చింది. నీకు కాదు కదా! ఈ కోళ్లు నాకు హక్కయినవి కావనుకుంటాను’’ అంటూ ఆ కోడి పిల్లలను ఏట్లోకి విసిరేశాడు. ఇట్టే ఎగురుతున్న గెద్దలు అందుకున్నాయి. కోపంతో ఇంట్లోకి వచ్చిన డాక్టరుతో భార్య అంది. ‘‘వాడు క్రూరుడండీ. పోనీ, కొంతలో కొంత ఇచ్చి సముదాయించలేకపోయారా?’’ డాక్టరు ఖస్సుమన్నాడు. ‘‘వెధవ, అనవసరంగా మన బయ్యన్న మీద నిందలేస్తే పడతామా? అదే అక్కడకు వెళ్లుంటే ఘల్లుఘల్లుమని శబ్దం వినపడేది కాదా? ఆ పెట్ట అరిచేది కాదా? వీళ్లు లేచేవాళ్లు కాదా?’’ పది రోజులు గడిచిపోయాయి. డాక్టరు దగ్గరకు మందుకి వచ్చాడు భైరవయ్య. డాక్టరు పైసా పుచ్చుకోకుండా మందిచ్చాడు. కోడిపిల్లల ఊసే మరిచిపోయారు. పట్నంలో కూతుర్ని చూడ్డానికి డాక్టరూ, భార్య ఉదయమే బయలుదేరారు. ఇల్లుకు తాళాలు వేశారు. పెరటి డొక్కులో పాలన్నం గిన్నెలో పెట్టి ‘‘బయ్యన్నా, మధ్యాన్నం తినరా, పట్నం వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం. ఇల్లు జాగ్రత్త’’ అంటూ అమ్మాయమ్మ చెప్పి మరీ వెళ్లింది. బయన్న వాళ్ల వెంట వద్దన్నా పడ్డాడు. ఇద్దరూ మర్రిచెట్టు కింద బస్సుకోసం కూర్చుంటూనే ముంగిస అరుపులు విన్నారు. ఆత్రంగా తిరిగి చూసేసరికి ఒక ముంగిస కాదు - బయ్యన్న కాక మరి రెండు ముంగిసలు. ఆ రెండు ఆ చిన్న చెవులు రిక్కించి కోపంతో అరుస్తున్నాయి. బయ్యన్న దారికడ్డమయ్యాయి. బయ్యన్న వాటిని చేరాలని ఆత్రపడుతున్నాడు. ‘‘అవిగో అవే, ఆ రెండు బయ్యన్న అమ్మా, నాన్నా’’ అన్నాడు డాక్టరు. ఇద్దరూ వింతగా చూస్తున్నారు. ఆ రెండు బయ్యన్న మీద ఉరకడానికి సిద్ధమౌతున్నాయి. బయ్యన్న కులం నుంచి వెలివేసిన మనిషిలా ఉన్నాడు. ‘‘చంపగలవండి. వాటిని తోలండి’’ అంది భార్య. వాటిని అదిలించి ‘‘రారా, బయ్యన్నా’’ అంటే మెల్లగా మూతి వంచుకుని అమ్మాయమ్మ దగ్గరకు వచ్చి పాదం మీద పడుకున్నట్లు వంగిపోయాడు. ఆమె ఎత్తుకొనగానే మూతి దగ్గర మూతిపెట్టి మెల్లగా అరుస్తున్నాడు. ‘‘మీ అమ్మా, నాన్నా నిన్ను రానివ్వలేదని ఏడుస్తున్నావా? మేం ఉన్నాం కదరా. నీ అమ్మను నేను, అరుగో, మీ నాన్న. వెళ్లు ఇంటికి - ఇంట్లో నీవు లేకపోతే శత్రుమూకలు దాడిచేసేస్తాయి. వెళ్లు, నాయనా. వెళ్లరా’’ అమ్మాయమ్మ ఒక ముద్దు పెట్టుకుని అంత దూరం వెనక్కు వచ్చి విడిచిపెట్టింది. రాను రాను ఘల్లుఘల్లుమనే శబ్దం దూరమైపోయింది. ఇంతలో బస్సు వస్తూంది. డాక్టరు పిలుస్తున్నాడు. తిరిగి రోడ్డుమీదకు పరుగెత్తింది. పది గంటలయింది. ఇంకా పాలన్నం తినటానికి సమయం కాలేదు. ఆ సమయం వస్తే గంటలు విన్నట్లు మరీ వెళ్తుంది. ‘‘బయ్యన్నా, రారా...’’ అన్న పిలుపు ఒకసారి బిలం నించి వచ్చి చూశాడు. మళ్లీపిలుపు. భైరవయ్య ఒడ్డులో నిల్చున్నాడు. ‘‘రారా బయ్యన్నా... ఇదిగో చేప... రారా... రారా...’’ సన్నగా మోత వినిపించింది. చెంగుచెంగున రాళ్లన్నీ ఎగబ్రాకింది. భైరవయ్య చేతిలో చేప చూశాడు. కొద్దిగా జరిగాడు భైరవయ్య. అందుకోడానికి ఘల్లుమని శబ్దం చేస్తూ ఉరికాడు. ఎదురుగా మునకాలకర్ర పట్టుకుని మీసం తిముడుతూ నిల్చున్న భైరవయ్య, ఒక్కసారి కర్రెత్తి దభీమని బయ్యన్న శరీరం మీద వేశాడు. బయ్యన్న ఒక్కసారి అరిచి ‘‘వద్దు! వద్దు! నేనేం పాపం ఎరగ’’నన్నట్లు ఆ మూతి ఎత్తాడు. మళ్లీ దభీమని ఇంకో దెబ్బ. బయ్యన్న కిలకిలా తన్నుకుంటున్నాడు. మరి రెండు దెబ్బలతో మూగబోయాడు. భైరవయ్య తోక పట్టుకుని ఎత్తాడు. నోటి వెంబడి రక్తం కారుతూంది. ‘‘బయ్యన్నా, రారా’’ అంటే ఈ మానవాళి అరుపంతా సౌహార్థం, ప్రేమతో నిండి ఉంటుందనీ, వాళ్ల కరుణతో తనలాంటి జంతు జాలానికి కడుపు నింపుతారని ఆశతో ఆ పిలుపు వింటుండిన చెవులు శాశ్వతంగా చెముడయ్యాయి. భైరవయ్య ఏటిలోనికి బయ్యన్న శవాన్ని విసిరేశాడు. కింద రక్తం పడిన జాగాలో మన్నంతా ఎత్తి ఏటిలో పారేశాడు. ఏమీ తెలియనట్లు, ఏటికి పోయి కాళ్లు చేతులు కడుక్కున్నాడు. సాయంత్రం. పొద్దుకుంగకుండానే ఉదయం పశువులను తోలుకు వెళ్లిన పసివాడు తిరిగి వచ్చాడు. పట్నం నించి డాక్టరూ, అమ్మాయమ్మా తిరిగివచ్చారు. బయ్యన్నకు తీపి వస్తువులు ఇష్టమని, ఎండు చేపలు మరీ ఇష్టమని అమ్మాయమ్మా అవే కొనుక్కొని వచ్చింది. ఇంటికి రాగానే పెరటి డొక్కులో చూసింది. పాల అన్నం అలాగే ఉంది. ‘‘చూడండి, మన బయ్యన్నకు, ఎంత దర్జాయో! చెప్పి మరీ వెళ్లినా - తినలేదు.’’ ‘‘నీవు దగ్గర ఉండి తినిపిస్తే గాని తినడే.’’ సంచిలోని ఒక ఎండు చేపను తీసుకుని, అమ్మాయమ్మా ఏటి ఒడ్డుకు వచ్చింది. ‘‘బయ్యన్నా, రారా... నీకిష్టమైనది తెచ్చాను రా. రారా... నాయనా... రారా’’ పిల్చింది. మళ్లీ మళ్లీ పిల్చింది. ఇంట్లో ప్రతిచోటా పిల్చింది. ‘‘ఎక్కడ తప్పిపోయాడో, ఇంటికి తెచ్చి దిగబెట్టకుండా మధ్యమ వదిలి వచ్చేశాను. ఆ పాడు బస్సు అంతసేపు రానిది, అప్పుడే వచ్చేయాలా? తోవలో ఏ కుక్క నొక్కేసిందో, ఏ పిల్లి పట్టేసుకుందో, ఆ రెండు ముంగిసలు వచ్చి దానిమీదపడ్డాయేమో?’’ అంత చీకట్లో కూడా మొగుడితో కలిసి మర్రిచెట్టు వరకు కేకలు వేసుకుంటూ వెళ్లింది. పిల్చింది. తిరిగివస్తూ ఎన్నో విధాల పిలిచింది. ఇంటికి వచ్చినా వంట లేదు. నోట్లో మంచినీరైనా పొయ్యలేదు. రాత్రంతా జాగారం చేసింది. మధ్యన లేచి వచ్చి ఏటి ఒడ్డున ‘‘నాయనా, బయ్యన్నా, నీకు తీపి తీపి మిఠాయి తెచ్చానురా. నీకిష్టమైన చేపలు తెచ్చానురా. రారా. నాయనా, రారా...’’ అని పిలిచింది. తెల్లవారినా ఆ ఘల్లుఘల్లు శబ్దం వినబడలేదు. ఉదయమే తలకు స్నానం చేసి దేవుడి గదిలో గంటసేపు కూర్చొని నా బయ్యన్నను నాకియ్యమని మొక్కింది. నలుగురిచేత వెతికించింది. వాడు దొరికితే పూజలు పునస్కారాలు చేస్తానంది. రెండు రాత్రుళ్లు గడిచిపోయాయి. బయ్యన్న జాడ తెలియలేదు. మూడో రాత్రి అటకపైన చప్పుడయింది. ఆత్రంగా లేచింది. అది ఘల్లుఘల్లుమన్న శబ్దం కాదు. పటుక్కు పటుక్కుమని శబ్దం వినిపిస్తూంది. లెటైత్తి చూస్తే ఇదివరలా బాహాటంగా ఒదిలేసిన ధాన్యాన్ని ఎలకలు వంచన చేస్తున్నాయి. వాటిని తోలాలన్న మనసైనా పుట్టలేదు. బయ్యన్న ఎక్కడో బతికి ఉన్నాడని, ఎవరో ఇనప గొలుసుతో కట్టేశారని, ఆ గొలుసు పటుకు పటుకుమని నమిలి, తెంపుకుని తనను చూడటానికి ఎప్పటికైనా వస్తుందని అమ్మాయమ్మ విశ్వాసం. ఒకనాడు ఉదయం. పొద్దు కాస్త మీదికి లేచింది. భైరవయ్య ఇంట్లో నించి కోడిపిల్లలను వదిలాడు. డాక్టరు ఇంటి ఎదర వీధి అది. చింతచెట్టు కింద ఏటి ఒడ్డులో రాలిన గింజలను కోళ్లపిల్లల సమూహం ఏరుకుంటున్నాయి. బయ్యన్న బాధ తప్పించుకున్నందుకు భైరవయ్య మురిసిపోతూ ఇంక కోళ్లను ఆ రాత్రి నించి అరుగుల మీద విడిచిపెట్టినా భయం లేదనుకున్నాడు. ఆ కోడి పిల్లల రంగుల వేపు చూసి మురిసిపోతున్నాడు. అలా అతను చూస్తుండగానే, ఒక ముంగిస - బయ్యన్న కంటె మరీ పెద్దది, భీకరమైంది, లేత నలుపు రంగుది - కోడిప్లిలపై ఉరుకుతూ ఒకదాన్ని పట్టుకుంది. భైరవయ్య పరుగెత్తి వెంట తరిమాడు. రాళ్లలో ఏ బిలంలోనికి పోయిందో ఎంత వెతికినా దొరకలేదు. తిరిగి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ కోళ్లను ఇంటివైపు తోలుకుని పెళ్లాంతో కోళ్లను ముయ్యమని చెప్పాడు. భైరవయ్య మంచం ఎక్కాడు. తన కర్రతో కొడుతుండగా, నేరం ఎరగని అమాయకమైన బయ్యన్న ఎత్తిన మూతి, జోడించిన చేతులు, అదో మానవుడుగా ‘నాదేం తప్పులేదు. నన్ను చంపకు. చంపకు’ అని నిండా ప్రాణంపై ఆశతో గగ్గోలు పెట్టుకున్నట్లు తోచి, ఆ దృశ్యాన్ని మనసు నించి చెరుపుకోలేక నడుం జార్చేసుకున్నాడు. - బలివాడ కాంతారావు -
లలిత పిన్ని
క్లాసిక్ కథ నాకు కర్నాటక సంగీతమంటె, అందులో ముఖ్యంగా త్యాగరాజ కృతులంటేనూ భక్తి కలిగించిన వ్యక్తి మా లలిత పిన్ని ఒక్కటే. అదివరలో త్యాగరాజ కృతులు ఎక్కువగా అయ్యర్లనోట విన్నానేమో, ‘శాస్త్రకట్టు’ సంగీతమంటే సరిగమల తోముడుతప్ప మరేమీ లేదనే దురభిప్రాయంలో పడ్డాను. లలిత పిన్ని నాకంటె రెండేళ్లు చిన్న. ఆవిడకి పెళ్లికాక ముందు ఏడాదికొక సారైనా మా యింటికి వచ్చేది. మా యింట్లో వున్న పాత హార్మోనియం వాయిస్తూ పాడేది. పిన్ని సంగీతం పాడు తుందని నాకు తెలియదు. అది వరకు నేనెన్నోసార్లు విని విసుగెత్తిన కృతులే ఆమె కంఠంలో కొత్త అర్థాలు వ్యక్తం చేసేవి. నిజానికి ఆమెకా సంగీతం నేర్చు కుంటే వచ్చిందని నేను నమ్మను. ఆమెకి మా తాతగారు సంగీతం మేష్టరును పెట్టి వీణ నేర్పించారు. కాని ఆమె వేసే స్వరాలు, సంగతులు ఇదివరకెక్కడా నేను వినలేదు. ప్రతి వేసవికాలం సెలవులికీ మా అమ్మమ్మగారి వూరు వెళ్లేవాణ్ని. చాలాసార్లు ఆరుబయట వెన్నెల్లో కూర్చుని ఆమె వీణవాయిస్తూ పాడుతుంటే విన్నాను. ‘‘ఒరే నువ్వు పాడరాదురా, అస్తమానమూ నన్ను పాడమనకపోతే?’’ అని ఒకసారి నవ్వుతూ అడిగింది పిన్ని. ‘‘సరిసరి, నువ్వు పాడిం తరవాత గొంతెత్త టానికి ఎన్ని గుండెలుండాలి?’’ అన్నాను. కాలేజీలో స్నేహితుల ముందు సినిమాటుమ్రీలు పాడి గర్వపడే నేను మా పిన్ని ముందు కంఠమెత్తటానికి కూడా జడిసేవాణ్ని. ‘‘ఒక్క సినిమాపాట పాడరా, వినాలనుంది’’ అని బలవంతం చేసింది పిన్ని. చివరికి పాడక తప్పింది కాదు. కాని రెండు చరణాలు పాడానో లేదో, పిన్ని పాట తలపుకు వచ్చి, సిగ్గుపడి ఆపేశాను. ఆమె పాడిన కృతులు సముద్రమంత విశాలమూ, అగాధమూ అయినవి. నా పాటలు పిల్లకాలవల్లాంటివి. పిల్లకాలవల్లో సౌందర్యం లేకపోలేదు. కాని సముద్రం ముందు కాదు వాటి దర్పం. మా పిన్ని చామనచాయగా వున్నా, కళా కాంతీ ఉట్టిపడే ముఖం. ఎక్కడో దూరాలకు చూస్తున్నట్టుగా ఉండేవి ఆమె విశాలమైన కోలకళ్లు. నిదానంగా నడిచేది. మాట కూడా నిదానంగా, సౌమ్యంగా ఉండేది. ఆమెకి కోపం రావటం గాని, తొందర పడటం గాని నేనెప్పుడూ చూడలేదు. ఆమె వ్యక్తిత్వంలోని గొప్పతనమంతా ఆమె సంగీతంలో ప్రతిఫలించేది. ఆమె నా కంటే రెండేళ్లు చిన్నది కావటం వల్లనేమో మొదట్లో ‘‘పిన్నీ’’ అని పిలుస్తుంటే ఏమిటోగా వుండేది. కాని ఆమె పాట విన్నప్పుడల్లా ఆమె దగ్గిర చంటిపిల్లాడి వలె అయిపోయేవాణ్ని. ఎప్పుడూ మేమిద్దరం కలిసి తిరిగేవాళ్లం. మా దొడ్లో జామచెట్టెక్కి ఆమెకి పళ్లు కోసిపెట్టేవాణ్ని. సెలవులికి వచ్చినప్పుడల్లా ఏవో కథల పత్రికలూ, నవలలు తెచ్చి చదివించే వాణ్ని. కొత్తగా చూసిన సినిమా కథలు, పాటలు వినిపించేవాణ్ని. నాకు ఆమె కృతులు నేర్పేటట్టు, నేనామెకి సినిమా పాటలు నేర్పేటట్టు ఒడంబడిక చేసుకున్నాం. కాని నాకు ఆ స్వరాలు నోరు తిరిగేవే కావు. ఆమె నా సినిమా పాటల్ని ఎంత నేర్చుకున్నా ఎక్కడో కర్ణాటక బాణీ దొర్లేది. దాంతో మా ఒడంబడిక రద్దు చేసుకున్నాం. ఒక పల్లెటూరి సంబంధం వెదికి మా పిన్నికి పెళ్లి చేశారు. అత్తవారు చాలా భాగ్యవంతులు. భర్తకి పాతికేళ్లుంటాయి. కొత్తగా కరిణీకంలో ప్రవేశించాడు. సాంప్రదాయం గల కుటుంబమనీ, డబ్బున్నవాళ్లనీ మా తాతగారు ఆ సంబంధం చేశారు. లలిత పిన్ని ఆ మారుమూల పల్లెటూరికి కాపరానికి వెళ్లిపోయింది. వెళ్లిన కొత్తలో ఆమెని అత్తవారు మూడు నాలుగుసార్లు పుట్టింటికి పంపించారు గాని, తరవాత క్రమంగా మానివేశారు. నేనొకసారి కాలేజీ నుంచి పెద్ద ఉత్తరం రాశా. ‘‘పిన్నీ! నీ సంగీతం ఎప్పటికీ మర్చిపోలేను; నీ కంఠం లాంటి కంఠం నాకు మళ్లీ వినబడలేదు. నువ్వు నా ఆరాధ్య దేవతవి,’’ అని. ఆ కవర్లోనే నా అడ్రసు రాసి మరో కవరు కూడా వుంచాను, ఆమె సమాధానం రాయటానికి పనికొస్తుంది గదా అని. సమాధానం రాయలేదు. నాలుగైదేళ్ల తరవాత గావును, మా అమ్మ చెప్పింది పిన్ని సంగతి. ‘‘విన్నా వురా? లలితమ్మని దాని అత్తారు నానా బాధా పెడుతున్నారుట.’’ ‘‘ఏం’’ అన్నాను ఆశ్చర్యపోయి. ‘‘ఏమో మరీ. కొత్తలో బాగానే చూశారు. తరవాత వాళ్లకేం పొయ్యేకాలం వచ్చిందో మరి? పాపం ‘లలితమ్మ ఆ లంకలో ఎన్ని కష్టాలు పడుతున్నదో?’’ ‘‘నేనోసారి వెళ్లి చూసొస్తానే, అమ్మా! లలిత పిన్నిని చూసి చాలా ఏళ్లయింది.’’ ‘‘సరేలే. వాళ్లసలే దానిపై లేనిపోని అపనిందలు మోసి హింసపెడుతున్నారు. వీళ్ల అనుమానాలూ, వీళ్లూ విరగడై పోనూ,’’ అని లోపలికి వెళ్లిపోయింది. లలిత పిన్నిని చూసి ఎన్నేళ్లయింది? ఆమె నా ప్రపంచానికి ఎంత దూరమై పోయింది? ఎప్పుడో విని మరిచిపోయిన ఆమె మధుర కంఠపు జ్ఞాపకం ఇప్పటికీ నన్నెందుకల్లా ఆరాటపెడుతుంది? ఆమె పెళ్లి జరుగుతున్నప్పుడు నేను తీవ్రంగా గాయపడ్డాను. నన్ను లోక మంతా వంచించినట్టు, నాకొక్కడికే చెందిన ఒక అమూల్య వస్తువును ఎవరో దొంగిలించినట్టు ఆవేదనపడ్డాను. ఆమె అత్తవారింటికి వెళ్లిన తర్వాత నా జీవి తంలో గొప్ప వెలితి ఏర్పడ్డట్టు బాధ పడ్డాను. అది వైశాఖ మాసం. నాకు మావాళ్లు పెళ్లి నిశ్చయపరిచారు. బంధువులందరికీ శుభలేఖలు పోస్టు చేశాము. లలిత పిన్ని ప్రసక్తి వచ్చింది. ‘‘నేను వెళ్లి పిన్నిని తీసుకువస్తానమ్మా’’ అన్నాను మా అమ్మతో. ‘‘ఎందుకురా వెళ్లటం? వాళ్లు పంపిస్తారా, ఏమన్నానా? శుభలేఖ వేస్తే సరిపోతుంది,’’ అన్నది మా అమ్మ. వాళ్లామెని పంపిస్తారని నాకు ఏకోశానా నమ్మకం లేదు. కాని యీ వంకతో వెళ్లి పిన్నిని చూసినట్టవుతుంది కదా అని నా ఉద్దేశ్యం. మా అమ్మని వొప్పించి లలిత పిన్నిని పిలుచుకు రావటానికి బయల్దేరాను. మా తాతయ్యా, నేనూ కలిసి వెళ్లాం. లలిత పిన్ని అత్తారూరు ఆ మర్నాటి మధ్యాహ్నానికి చేరుకున్నాం. ఎండ తీవ్రంగా ఉంది. వడగాలి ఆ చెవి నుండి ఈ చెవికి రివ్వున కొడుతోంది. ఆ పల్లె టూరి వీధుల్లో ఆ మధ్యాహ్న వేళ పిట్ట యినా తిరగటం లేదు. నాగరిక ప్రపంచానికి ఎటు చూసినా యాభైమైళ్ల దూరంలో వున్న ఆ గ్రామపు దృశ్యం నాకు చెప్పలేని దిగులు పుట్టించింది. ఈ వూళ్లో లలిత పిన్ని యిన్నాళ్లూ ఎలా నివసించ గలిగిందా, ఆమె నిశ్చలమైన చూపులు ఇంకా అలానే అందరాని దూరాలకు చూస్తూనే వుంటాయా, అనిపించింది. వెళ్లగానే లలిత పిన్ని మొగుడు వాకిట్లో కనిపించాడు. కోరమీసాలు, నీరుకావి బట్టలు, నోట్లో చుట్ట అంతా పల్లెటూరి వాలకం. ముప్పయేళ్ల మనిషైనా నలభై ఏళ్ల వాడిలా వున్నాడు. మామగార్ని చూడగానే ఆశ్చర్యం కనబరిచాడు. ‘‘అమ్మా! మామగారొచ్చారు. కాళ్లు కడుక్కోటానికి రెండు చెంబుల్తో నీళ్లు తీసుకురా,’’ అని కేకేశాడు నాకేసి తేరిపార చూస్తూ. ‘‘కొంచెం పనుంది, వెళ్లి వస్తాను,’’ అని మళ్లీ నాకేసి ఒకసారి చురచుర చూసి వెళ్లిపోయాడు. ‘‘అంతా క్షేమమా?’’ అని పిన్ని అత్త గారిని మా తాతయ్య కుశల ప్రశ్న వేశాడు. నన్ను ఫలానా అని తెలియజేశాడు. ‘‘ఆ పెళ్లప్పుడు చూశాగా యీ అబ్బా యిని!’’ అని మూతి తిప్పుకుంటూ అన్న దావిడ. ఇంతలో అయిదేళ్ల మగపిల్లా డొకడూ, మూడేళ్ల ఆడపిల్లా అక్కడికి వచ్చారు. తాతయ్య వాళ్లని దగ్గరికి తీసు కుని, ‘‘వీళ్లనెప్పుడన్నా చూశావురా?’’ అని నన్నడిగాడు. ‘‘చూడలేదు. లలిత పిన్ని పిల్లలేనా?’’ ‘‘ఊ. మరింకెవ రనుకున్నావ్?’’. నిజానికి ఆ పిల్లలెవరో, నేనెవరో? వాళ్లకీ నాకూ ఏమిటి సంబంధం? వాళ్లకేసి చూస్తుంటే వెయ్యామడల దూరంలో నుంచున్నట్టుగా కనిపించారు. ఇంతలో లోపల నుండి ఒకామె వచ్చింది, చంకలో చంటిపిల్లని వేసుకుని. ‘‘ఏం నాన్నా ఎప్పుడొచ్చావు? అంతా కులాసానా? ఏమయ్యోవ్ నువ్వేనా? పెద్దవాడివయ్యావే? జ్ఞాపకమున్నానా?’’ ‘‘అహ, జ్ఞాపకం లేకేం?’’ అన్నాను. కాని ఆమె ఎవరు? మొహాన ముడ తలు, లోతుకుపోయిన కళ్లు, వాటి కింద నల్లటి చారలు, కుంగిపోయిన బుజాలు, పుల్లల్లాంటి కాళ్లు ఎత్తెత్తి వేసుకుంటూ... నా లలిత పిన్నేనా ఈమె? ఏడేళ్ల నించీ ఏ స్త్రీ రూపం నా మనస్సులో నిరంతరం నటించిందో ఆ లలిత పిన్నేనా ఈమె? పూర్వపు లలిత పిన్ని ఎంత గుర్తుకు తెచ్చుకున్నా జ్ఞాపకం రావటం లేదు. ఆమె చంకలోని చంటిపిల్ల కొత్తవాళ్లని చూసి కాబోలు కావురుమంది. అప్పటికి నేను తెప్పరిల్లాను. ‘‘అదేమిటే అమ్మాయ్! మరీ అంత నీరసించిపోయావ్?’’ అంటున్నాడు తాతయ్య. ‘‘అబ్బే. ఏం లేదు, నాన్నా!’’ అన్నదామె. ‘‘ఏమీ లేకపోవటమేమిటి? కిందటి సారి నేను చూసినప్పటి కంటే బాగా చిక్కావ్, వంట్లో బాగుండలేదా?’’ అన్నాడు తాతయ్య. రెండు కన్నీటిబొట్లు ఆయన కళ్ల చివరదాకా వచ్చి ఆగిపోవటం చూశాను నేను. ‘‘ఏమోనండి! మీ పిల్ల వట్టి రోగిష్టి మనిషి,’’ అని ఇంకేదో సణుక్కుంటూ అత్తగారు లోపలికెళ్లిపోయింది. నేనూ, తాతయ్యా దొడ్లో నూతి దగ్గర స్నానాలు చేశాం. పిన్ని అప్పటికప్పుడు మడికట్టుకుని మాకోసం వంట చేసింది. భోజనాల దగ్గిర ఎవ్వరం మాట్టాడలేదు. తరవాత పిన్ని ఆకు వక్క చుట్టి నాకూ, తాతయ్యకి యిచ్చింది. ప్రయాణ బడలిక మీద వున్నామేమో, వసారాలో మంచాల మీద వళ్లు వాల్చామో లేదో సుఖమైన నిద్రపట్టింది. ఆ రాత్రి భోజనాల దగ్గిర తాతయ్య మేము వచ్చిన సంగతి చెప్పాడు. నా పెళ్లికి అందర్నీ రమ్మని అడిగాడు. ‘‘మాకెక్కడ వీలు కుదురుతుందీ రావటానికి’’ అన్నది అత్తగారు. ‘‘పోనీ లలిత పిన్నినైనా పంపించండి. పెళ్లి కాగానే ఎవరమన్నా వచ్చి దిగబెడతాము,’’ అన్నాను నేను. ‘‘ఆ, అదెక్కడ వస్తుందిలే. జబ్బు మనిషి, చంటిపిల్ల తల్లి’’ అందావిడ. తలుపుచాటునే నుంచుని వుంది పిన్ని. ‘‘అట్టే రోజులుండను, అత్తయ్యా! పెళ్లి అయిన వెంటనే వచ్చేస్తాను. మా అక్కయ్యని, పిల్లల్ని చూసి చాలా ఏళ్లయింది,’’ అన్నది బెరుకుగా. ‘‘ఊ, వెడతావు. నీ పాడుమొహం పెట్టుకుని అక్కడికి వెళ్లకపోతే వచ్చిన నష్టమేమీ లేదులే. చూశావుగా నువ్విన్నాళ్లూ కలవరిస్తున్న మీ అక్కయ్య కొడుకుని,’’ అని కసిరాడు పిన్ని మొగుడు. పక్కన పెద్దవాడు, మామగారు ఉన్నా రనైనా ఆలోచన లేకుండా ఆ మాటలన్న వాడిని పీటపెట్టి నెత్తి పగలగొడదామా అన్నంత కోపం వచ్చింది. అన్నం దగ్గిర్నించి లేచిపోవాలనిపించింది. మా తాతయ్య ‘శాంతించ’మన్నట్టు నాకేసి చూశాడు. పిన్ని తలుపుచాటు నించి అవతలకి వెళ్లిపోయిన చప్పుడు వినిపించింది. భోజనాలు అయినాయో లేదో పిన్ని మొగుడు చెప్పులు తొడుక్కుని కర్ర పట్టుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. పిన్ని నాకూ తాతయ్యకీ దక్షిణపు వేపున మల్లె పందిరి కింద పక్కలు వేసింది. తాతయ్య వీధి అరుగుమీద చుట్ట కాలుస్తూ మా బండి తోలుకొచ్చిన వెంకన్నతో మాట్టాడు తున్నాడు. నేను పందిరి కింద మంచం మీద పడుకుని, ఎర్రగా నిప్పుముద్దలా ఉదయిస్తున్న తదియ చంద్రుణ్ని చూస్తున్నాను. మల్లెచెట్టు విరగబూసింది. కన్నీటిబొట్లలా అప్పుడప్పుడు బాగా విచ్చిన పువ్వులు నామీద రాలుతున్నాయి. మరచెంబులో నీళ్లు తీసుకుని పిన్ని వచ్చింది. తలవేపున చెంబు పెట్టి తాతయ్య మంచంమీద కూర్చుంది. ‘‘పిన్నీ! నువ్వు వచ్చేసెయ్యి. వీళ్లేమన్నా సరే, నేను తీసుకువెళ్లదలుచుకున్నాను,’’ అన్నాను. ‘‘ఎలా రమ్మంటావయ్యా, వాళ్లు వద్దంటూంటే? పట్టుకు లాక్కెళతావా?’’ అన్నది నీరసంగా, రాని నవ్వు తెప్పించుకుని. ‘‘పిన్నీ! ఎందుకిలాగైపోయావ్ నువ్వు?’’ ‘‘ఏం చేస్తాను, నా ఖర్మ! ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో యీ యింట్లో పడ్డాను.’’ ‘‘కాదు, పిన్నీ! ఇది నీ పాపం కాదు. దీనికి బాధ్యత పూర్తిగా తాతయ్యదే.’’ ‘‘ఆయన తప్పేముంది? పెళ్లి చేసి నప్పుడు కలగన్నాడా, వీళ్లిట్లాంటివాళ్లని.’’ ‘‘నువ్వు ఇంకా సంగీతం పాడుతున్నావా పిన్నీ!’’ ఈ ప్రశ్న వినగానే ఆమె మొహం మరోవైపుకి తిప్పింది. ఆ గుడ్డి వెన్నెల్లో ఆమె బొటబొట కన్నీళ్లు కార్చటం కనిపించింది. ‘‘ఎందుకేడుస్తున్నావు పిన్నీ!’’ ఆమెకి దుఃఖం వచ్చింది. వెక్కివెక్కి బిగ్గరగా ఏడ్వసాగింది. ‘‘ఊరుకో, పిన్నీ! ఇంట్లోవాళ్లు వింటారు,’’ అన్నాను, నా కళ్లనీళ్లు తుడుచుకుంటూ. ఆమె ఏడుపునాపింది కాస్సేపటికి - ‘‘ఇన్నేళ్లలోనూ నన్నీ ప్రశ్న అడిగినవాడివి నువ్వొక్కడివే. అందుచేత ఏడుపునాపు కోలేకపోయాను. నేను ఇక్కడికి కాపరాని కొచ్చేటప్పుడు నా వీణ తెచ్చుకున్నాను. దానిని మా ఆయన విరగ్గొట్టి పారేశారు. పాడుతున్నట్టు వినిపిస్తే గొంతు పిసికి చంపేస్తానన్నారు. ఒకటి రెండుసార్లు నేను పాడుకోబోయాను. ‘ఆ పాటలేమిటే?’ అని మా అత్తగారు నన్ను గదమాయించి పాటలు మానిపించారు’’ అన్నది పిన్ని నిస్పృహగా. ‘‘పిన్నీ! ఒక్కమాటడుగుతాను, కోపం రాదుగదా? నీ మీద ఏవో అపనిందలు వేశారుట, నిజమేనా?’’ ‘‘ఆ, అవన్నీ యిప్పుడెందుకులే?’’ ‘‘కాదు, చెప్పు పిన్నీ. నిజమేనా?’’ ‘‘నువ్వు కొత్తలో ఉత్తరం రాశావు చూడు. ఆ ఉత్తరం మా ఆయన చూశారు. దాంతో అనుమానపడి నన్ను నానా మాటలూ అని కొట్టారు. ఆ తరవాత కూడా ఊళ్లోవాళ్లతో లేనిపోనివి కల్పించి బాధపెడుతూనే వున్నారు. నా బతుకంతా యిలాగే తెల్లవారిపోవలసివుందేమో?’’ రెండు నిమిషాల సేపు ఎవ్వరం మాట్లాడలేదు. ‘‘నేనా ఉత్తరం రాయటం చాలా తెలివితక్కువే. నా పొరపాటు క్షమిస్తావా, పిన్నీ?’’ ‘‘ఇందులో నువ్వు తెలిసి చేసిందే ముంది, క్షమించటానికి? అప్పుడు నా పెళ్లిలో నువ్వు అస్తమానమూ నా కూడా తిరిగేవాడివి జ్ఞాపకం వుందా? అప్పుడే మా ఆయన తల్లితో అన్నారట, ‘ఎవరా అబ్బాయి, పోకిరీ మొహం వేసుకుని దాని వెంట తిరుగుతున్నాడు?’ అని.’’ ‘‘పిన్నీ! నువ్వెంత కాదన్నా, నీ కష్టాలకు కొంతవరకు నేను కూడా కారణమైనట్టు తోస్తున్నది. నిన్నీ నరకంలోనుండి ఎలా రక్షించగలనా, ఏం చేస్తే నీ కష్టాలు గట్టెక్కుతాయా అని వేదనపడుతున్నాను.’’ ‘‘సర్లే, నువ్వేం చేస్తావు నాకోసం? నువ్వు రేపు లక్షణమైన పిల్లని చేసుకోబోతున్నావు. నువ్వు సుఖంగా వుంటే నాకదే చాలు. ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇలాగే కాలం గడుపుతాను.’’ ‘‘ఎంత మారిపోయావ్, పిన్నీ! మన చిన్నప్పటి రోజులు తలుచుకుంటే ఏడుపు వస్తున్నది. నీమీద నాకు అంత గౌరవం కలిగించింది నీ సంగీతమే. నీ కంఠంలో అప్పటి అమృతపు నదులు ఎక్కడ యింకిపోయాయి? అప్పుడు పాడేదానివి, ‘శ్రీరామ పాదమా! నీ కృప చాలునే’ అని అమృతవాహిని రాగంలో ఒక కృతి. జ్ఞాపకం వుందా? ఆ ఒక్క ముక్క అనవూ, వినాలనుంది.’’ ‘‘సర్లే. ఇప్పుడేమిటి? అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను’’ అన్నదామె. ఇంతలోనే అత్తగారు ‘‘ఓ లలితమ్మా! ఎక్కడున్నావమ్మా తల్లీ!’’ అని కేకేసింది. పిడుగుపడ్డట్టు ఉలిక్కిపడ్డాం యిద్దరమూ. పిన్ని లేచి వెళ్లిపోయింది గబగబ, కాళ్లు ఎత్తెత్తి వేసుకుంటూ... నాకా రాత్రి నిద్రపట్టనేలేదు. తెల్లవారుకట్ట ఏ గంటో నిద్రపోయి వుంటాను. లేచేసరికి పక్కమీద ఒత్తుగా మల్లెపువ్వులు రాలి వాడి నలిగిపోయివున్నాయి. అవన్నీ ఏరి పొట్లం కట్టి నా సంచీలో పదిలపరిచాను. పొద్దున్నే మొహం కడుక్కుని నేనూ, తాతయ్యా బండి కట్టుకుని తిరుగుముఖం పట్టాము. ముసలాయన ఆ ఒక్కరోజులోనే నెలరోజులు లంకణాలు చేసినవాడల్లే అయిపోయాడు. బండిలోనే కూర్చుని, తల వంచుకుని కుమిలి కుమిలి ఏడ్చాడు. బండి తోలే వెంకన్న అన్నాడు: ‘‘తాతయ్యగోరూ! బంగారబ్బొమ్మలాంటి పిల్లని యీ యెదవ సచ్చినోళ్ల కెల్లాగిచ్చారండీ! మీ యల్లుడి వూసు ఈ వూళ్లో ఎత్తితే సాలు అంతా తిట్టేవాళ్లే. ఒల్లంతా రోగాలేనంట. నా యాలకి,’’ అన్నాడు. ‘‘ఒరే, నువ్వూరికే వాగబోకురా. అసలే ఆయన కష్టపడుతున్నాడు,’’ అన్నాను నేను కోపంగా. ‘‘నీకేం తెలుసుద్దయ్యా?నేను మీ తాతయ్యగోరింటో యింతప్పట్నించీ పని సేశా. ఆ పిల్ల ఎసుమంటి పిల్లో నాకు తెలవదనా? మాలచ్చిమంటి తల్లి. ఎన్ని కట్టాలు పడుతుండదో ఆళ్ల సేతుల్లో’’ అన్నాడు వెంకన్న. ఆ మాటలు విని తాతయ్య మరీ కుంగిపోయాడు. ఎక్కడ త్యాగరాజకృతి విన్నా నాకు మా లలిత పిన్నే జ్ఞాపకం వొస్తుంది. ఆమె సంగీతం గాని, కంఠం గాని ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుందామన్నా జ్ఞాపకం రావు. పెళ్లికాక ముందు ఎలా వుండేదో కళ్లు చించుకున్నా గుర్తుకు రాదు. కాని చంటిపిల్లని చంకన వేసుకుని ఎత్తెత్తి కాళ్లు వేస్తూ వచ్చి నన్ను పలకరించిన ఆ లలిత పిన్నే జ్ఞాపకం వచ్చి మనస్సును రంపం కోత కోస్తుంది ఇప్పటికీ. ఆమె వ్యక్తిత్వానికి కేంద్రమైన వీణలాగా ఆమె జీవితం కూడా భగ్నవీణ. - నండూరి రామ్మోహనరావు -
గాలివాన
క్లాసిక్ కథ ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయోజనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండోతరగతి పెట్టె ఎక్కుతుంటే తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచి వుంటుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దాని మీద ఒక మూలగా ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలు గుతూ ఉంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమైన పట్టాలు ఏర్పడ్డాయి. సోఫాలో ఉన్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ. వాళ్లని చూస్తే ఆయనకు ఎంతో గర్వం. రైలు పెట్టెలో మూడు మెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచు కున్నారు. తను ఎక్కినందుకు అందులో ఉన్న నలుగురు ప్రయాణీకులు చిరాకు పడుతున్నట్టు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టి లోకి వెడితే బాగుంటుందని అనిపించింది. కాని రైలు కదిలిపోయింది. కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు. నలుగురూ దూర ప్రయాణీకులని ఆయన గ్రహించాడు. కిటికీల పక్కనివున్న రెండు మెత్తల మీదా ఇద్దరు పెద్ద వయసువాళ్లు కూర్చున్నారు. లోపలగా వుండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతీ కూర్చుని ఉన్నారు. యువతి ఆ యువకుని భార్య అయివుంటుంది. సిగరెట్టు పొగ మెల్లని ఘాటు రావుగారి నాసికా రంధ్రాలలోకి తెలియకుండానే ప్రవేశించి ఒక క్షణంపాటు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. రైలుపెట్టెలో సిగరెట్టు పొగ గురించి రావుగారికి తీవ్రమైన అభిప్రాయా లున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమైన అభిప్రాయాలు న్నాయి. ఆయన వేదాంతి. వేదాంతం జీవితం తోటీ, జీవన విధానం తోటీ, వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటీ అనుబంధించి వుంటుం దని ఆయన వాదము. ఒక్క వేదాంతిగానే గాకుండా, మంచి వక్తగా కూడా ప్రఖ్యాతి పొందాడు. ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం యివ్వడం కోసం. రావుగారు యువ దంపతుల వేపు చూచారు. యువతి ముఖం చాలా బరువుగా వుంది. ఆమెకు కాస్త వుత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా ఏదో అతను ఉద్యోగంలో వున్న దూరదేశానికి మొదటిసారి ఆమె వెడుతున్నట్లుంది. గాలి పెరిగింది. బలంగా కిటికీ తలు పుల మీద ఒత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టిలో చీకటిగా అయిపోయింది ఎంచేతో. ఇంకా సాయంత్రం అయివుండదు. రావు గారి పక్కన కూర్చున్న పెద్దమనిషి కని పించీ కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుకున్నారు. ఆయనకు రావుగారి వయస్సు వుంటుంది ఏభై ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించటం రావుగారికి వింతగా కన్పించింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన గంభీరంగా చుట్ట కాలుస్తూ దాని రుచిని ఆస్వాదిస్తున్నాడు. ఆయన రావుగారికంటె పెద్దవాడై యుంటాడు. కాని ముఖంలో చురుకు ఉంది. అయినా జారిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు వయస్సును చాటుతూనే ఉన్నాయి. తాను చాలా అదృష్టవంతుడని రావు గారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయన కంటె పెద్దదిలా కన్పిస్తుంది. ఆయనకొక ఇరవయ్యయిదేళ్ల కొడుకున్నాడనీ, ఆ కొడుక్కి అప్పుడే యిద్దరు పిల్లలున్నారనీ, అతను ఈమధ్యనే తండ్రిగారి న్యాయవాద వృత్తినంతనీ చూసుకోవడం ప్రారంభించా డనీ వాళ్లెవ్వరూ అనుకోరు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించా లని నిశ్చయించుకున్నాడు. మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలని, కోరికలు వాళ్ల ఆత్మను బంధించేటంత బలంగా వుండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన యింట్లో తుచ తప్పని క్రమపద్ధతి చాలా శ్రమపడి అమలులో పెట్టాడు. ఆ పద్ధతి ఆయన మనస్సుకీ శరీరానికీ కూడా ఎంతో శాంతీ, సుఖం సమకూరుస్తోంది. గాలి అరుస్తోంది. జల్లు కూడా ప్రారం భించింది. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి అటూ ఇటూ చూచి దూరంగా జరిగింది. చక్కగా దువ్విన తలకట్టులోనించి ముంగురులు విడిపోయి ఆమె నుదురుమీద, చెక్కుల మీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తల దువ్వుకునే పద్ధతి రావుగారు నిర్ణ యించారు. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ల అలవాట్లు, నోములు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ రావుగారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయమైపోయాయి. గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు హోరుగా రైలు పెట్టె మీద మొత్తుతున్నాయి. పెట్టె తలుపు తెరుచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలీ వానా పెట్టెలోకి చొచ్చుకు వచ్చాయి. చినిగి పోయి తడిసిపోయిన గుడ్డలతో ఒక ఆమె ప్రవేశించింది. లోపల వున్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్యపెట్టకుండా తలుపు మూసి ఒక మూల నీరు కారుతూ నిలబ డింది. ముసలాయన ‘ఇది పరుపుల పెట్టి అని తెలియదూ’ అన్నాడు. ‘బాబ్బాయి! తాతగారు! ముష్టిముండకి కొంత నిలబట్టాక సోటివ్వరా బాబుగారూ. దయగల బాబులు! బిడ్డలున్నాతండులు! ఓ కానీ పారెయ్యండి బాబు. ఆకలి కడుపులో సిచ్చెడుతంది బాబులు...’ రావుగారు ఆమెవేపు చూశారు. ఆమె కళ్లల్లో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆ తళుకు రావుగారి హృదయంలో ప్రయో జనం లేని విరోధ భావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు షుమారు ముప్పయి ఏళ్లుంటాయి. ఆకలితో చచ్చిపోతున్నట్టు కన్పించడం లేదు. ఎంత అసహాయత నటించినా, ఆమెలో స్థైర్యం ఉంది. బిచ్చ మెత్తుకోడం మీద రావుగారికి అసలు సానుభూతి లేదు. బిచ్చమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చం అడిగితే ఆయన ఇంక అనుమానం లేనంత గట్టిగా ‘ఫో’ అన్నారు. ఆమె ముఖం అదో మోస్తరుగా పెట్టి రెండో పక్కకు తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరకు వెళ్లి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. ‘వెళ్లు, వెళ్లు’ అన్నాడు. ‘అల్లా అనకండి తాతగారు. ఆ బాబంత రాతిగుండె కాదు బాబు నీది. ఆ బాబుగారికి యింత మాత్రం జాలి లేదు. ‘ఫో’ అంటాడు’. తను అన్న ‘ఫో’ ఆమె అనుకరించడం పెద్ద పొగరుబోతుతనమని రావుగారికి అనిపించింది. ఇష్టం లేకపోయినా ఆమె వేపు చూస్తూ కూర్చున్నాడు. ముసలాయన చిత్రమైన అవస్థలో పడ్డాడు. దానికి ఓ డబ్బు యిచ్చి పంపేస్తే పెట్టిలో నలుగురూ పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం. ఇవ్వకపోతే ఆ ముష్టిది నోరు ఎలా జారవిడస్తుందోనని భయం. ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరికి ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ‘డబ్బున్న దొరలున్నా రని, నాబోటి ముష్టిముండని ఆకలితో సచ్చిపోనివ్వరని ఎంతో ఆశగా ఈ పెట్టిలో కొచ్చాన్రా దేముడ! మూడోకలాసు పెట్టెల్లో పేదోళ్లుంటారు. ఆళ్లకే ఎక్కువ జాలి. డబ్బున్నా బాబులంతా రాతిగుండె లని తెలుసుకోలేక పోయాన్రా దేముడా! రావుగారి పక్కనున్న పెద్దమనిషి విచిత్రంగా ఆమెవేపు చూశాడు. ‘ఉనది ఏమి ఊరు’ అని తమిళుల తెలుగులో అడిగాడు.‘ఓ వూరేటి, ఓ పల్లేటి బాబు మాబోటి పేదోళ్లకి. తమబోటి పెభువులకి వూళ్లుంటాయి. పెద్ద పెద్ద లోగిళ్లుంటాయి. గేటు ముందు బంట్రోతులు కూచోని ముష్టోళ్లని రానీకుండా తరిమేయిత్తారు. నాబోటి పేదముండకో వూరేటి? ఓ పల్లేటి?’ ‘నాలుక చాలావాడి’ అన్నాడాయన రావుగారిని ఉద్దేశించి, ఇంగ్లీషులో. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానపాములా పాకు తోంది. ముష్టిది పెట్టెలో యువ దంపతు లకు ఎదురుగా కూర్చుంది. యువకుడు అన్నాడు: ‘మాతో కూడా వచ్చేయ కూడదూ నువ్వు? పనీపాటా చేస్తూ వుందుగాని తిండీ గుడ్డా యిస్తామ్.’ ‘ఏదో యిచ్చి దాన్ని పంపెయ్య కూడదూ?’ అంది యువతి భర్తని ఉద్దేశించి. రావుగారు తప్ప తక్కిన అందరూ ఆమెకు ఏదో యిచ్చారు. ఆమె మాటలు వింటుంటే అందరికీ సరదాగా వుంది. కాని రావుగారి మనస్సు ఇతర విష యాలతో నిండిపోయింది. ఆయన గాలి వానను గురించీ, తను రైలులోంచి దిగడాన్ని గురించీ ఆలోచిస్తున్నాడు. రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తం పాటు తెలియలేదు. సరిగ్గా అప్పుడే గాలివాన మరీ తీవ్రమైంది. ఆయన గొడుగు ఒక చేత్తో బట్టుకు లేచాడు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కు నెట్టివేసింది. తూలిపోయారు. ముష్టిమనిషి ఆయన సామానులు దింపి పెడతానంది. రావు గారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలో చించడానికి అవకాశం లేదు. ఆమె సహా యాన్ని అంగీకరించక తప్పలేదు. కాని ఏదో అస్పష్టమైన నియమాన్ని ఉల్లం ఘిస్తున్నట్లు ఆయన మనస్సులో కొంచెం బాధ. కాని రైలు దిగి స్టేషనులోకి పరుగెత్తి వెళ్లిపోయారు. ముష్టి ఆమె సామానుల బరువుతో తూలుతూ వెనకాల వచ్చింది. సామానులు వెయిటింగు రూములో పెట్టింది. ఎక్కడా ఒక్క దీపం లేదు. రావు గారు కొంత డబ్బు తీసి ఆమెకు ఇవ్వబో యాడు. ఆమె వద్దనలేదు గాని, ఏదో విన బడకుండా అని మాయమైపోయింది. రావుగారు కూర్చున్నాడు. గింగురు మనే ఆ గాలిలో కళ్లు పట్టు తప్పిపోతు న్నాయి. గుడ్డలన్నీ తడిసిపోయాయి. పెట్టి తీసి చేత్తో యిటూ అటూ తడిమాడు. బాటరీ లైటు చేతికి తగిలింది. పట్టరాని సంతోషం వచ్చింది. తడిబట్టలు విప్పి పొడిబట్టలు కట్టుకున్నాడు. స్వెట్టరు తొడుక్కున్నాడు. మఫ్లరు చెవులకు, తలకు చుట్టుకున్నాడు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషనులో ఎవరో ఒకరు ఉండి తీరాలని బయటికి వచ్చాడు. ఇద్దరు ప్లాట్ ఫారం దాటివెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు పిలిచారు. ఇద్దరూ ఆగారు. ఒకరు స్టేషను మాష్టరనీ ఇంకొకరు బంట్రోతనీ రావుగారు గుర్తించారు. ‘నేను వూర్లోకి వెళ్లాలి’ అన్నారు రావుగారు ఆదుర్దాగా. ‘చాలా కష్టం. రోడ్డుమీద అంగుళం అంగుళానికీ చెట్లు పడి వున్నాయి. గాలివాన చాలా తీవ్రంగా వుంటుందనీ, 36 గంటల వరకూ తగ్గదనీ మాకు వార్త వచ్చింది.’ ‘కాని స్టేషన్లో యింకెవరూ లేరు.’ ‘నేనేం చేస్తాను? ఎల్లాగో స్టేషనులోనే మీరు గడపాలి.’ స్టేషను మాష్టరు వెళ్లిపోయాడు. రావు గారు వెయిటింగ్ రూంలోకి వెళ్లిపోయారు. మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావు గారికి తోచలేదు. క్రమశిక్షణ, నియ మాలు, విలువలు అన్నీ కూడా మానవా తీతమైన కొన్ని శక్తులు విజృంభించినపుడు అర్థరహితాలైపోతాయని ఆయనకు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సును ఆవరించింది. ఆ బాధ దుర్భరంగా వుంది. చుట్టుపక్కల ఎక్కడా మానవ హృదయమన్నది లేదు. గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది. ఆ గదిలో యింకో వస్తువేదో వున్నట్టు రావుగారికి కనిపించింది, తెరచిన తలుపులో నుంచి లోపలికేదో ప్రవేశించినట్టుగా. చేతిలో దీపం వెలిగించి ఆయన ఆ వేపు చూశాడు. ముష్టి ఆమె గజగజ వణుకుతూ వొక మూల నిలబడివుంది. ఆమె తడి వెంట్రు కలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటి వెంట నీరు కారుతోంది. ‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా ఉంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియ వేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్లీ తలుపులు మూసి గదిలో వున్న కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ‘‘ఏం గాలివానండి బాబుగారు. నేను పుట్టిన్నాటినుండి యింత గాలివాన నేను చూడలేదు’’ అంది ముష్టి ఆమె. ఆమె గొంతులో బెదురులేదు. అంత ప్రశాంతంగా ఎట్లా మాట్లాడకల్గుతూందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశాడు. మూలగా వొణుకుతూ కూచున్నది. రావుగారు తన పంచ ఒకటి తీసి ఆమె వేపు విసరి ‘యిది కట్టుకో’ అన్నారు. కృతజ్ఞత చూపిస్తూ బట్ట మార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్న చోట కూర్చుంది. రావుగారికి ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది. బిస్కట్ల పొట్లం తీశాడు. ఒకటొ కటి చొప్పునా నమలడం ప్రారంభించాడు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని కొన్ని బిస్కట్లిచ్చాడు. ఆమె గదిలో వుండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటే ఆమె వుండడం కొంత నయం. ఆమె దేన్ని గూర్చీ బాధ పడదు గాలీ వానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు బాగా ఆమెకు అనుభవమై వుంటాయి. రావుగారు గడియారం వంక చూచారు. తొమ్మిది గంటలయింది. ‘ఈ యిల్లు కూలిపోదు గదా?’ అని ఆయన అడిగారు. ‘ఎవరు చెప్పగలరు? యిల్లు గట్టిగానే వున్నట్టుంది. గాలిబలం ఎక్కువైతే ఏది ఆగుద్ది?’... ఆమె గొంతులో ఏదో ఒక చనువూ స్థైర్యం. ఆయన పెట్టె దగ్గరకు పోయి కూర్చు న్నాడు. ఆయన కూర్చున్న మూలకు ఆమె కూడా చేరింది. అక్కడ కూచుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు అంది. ‘గాలివాన యింత ముదిరిపోతుందని నేననుకోలేదు.’ ‘బాబుగారు ఎందుకలా భయపడతా’ రందామె. ‘ఒక్కరుండేకంటె యిద్దర మున్నాం గదా! టిక్కెట్టు కలెక్టరు రైలు కదులు తూంటే నన్ను దింపేశాడు, ఏం చేయను! ఇక్కడుండి పోయాను. అయినా నాకేటి విసారం? బాబుగారు చుట్టుమెట్టుకోనాకి ఓ పొడి గుడ్డ యిచ్చారు. ఆకలికి మేత పడేశారు. వున్నంతలో సుకంగా వుండాలి బాబుగారు! అది లేదనీ, యిది లేదనీ సీకాకు పడితే ఏం లాభం?’ ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమితపడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కసహ్యం. ఆయన మనస్సుకీ మన మనస్సుకీ ఎంతో అంతరం వుంది. అయినా ఆ భయంకరమైన రాత్రివేళ తనకు తోడుగా ఆమె వున్నందుకు కృతజ్ఞత ఆయన మనసులో నిండింది. ‘నీకెవరూ చుట్టాలు లేరా?’ అన్నా రాయన. వెంటనే యింత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. రైలులో ఒక కానీ కూడా యివ్వనందుకు ఆమెకు తన మీద ఏమన్నా కోపముందేమోనని ఆయన అనుమానం. కాని ఆమె మాటల్లో గానీ చేతల్లో గానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆయన దగ్గరగా జరిగింది. ‘సుట్టాలందరికీ వుంటారు. ఏం లాబం బాబుగారు? మా అయ్య తాగు తాడు. ఆడే మా అమ్మని సంపేశాడం టారు. నాకు మనువు అవలేదు. కానీండి బాబుగారు ఓ దొంగ ముండావాడితో సేవితం కలిగింది. నాకు ఇద్దరు పిల్లలండి బాబుగారు. ఆడికి జూదం, తాగుడు అలవాటైపోయాయండి. ఇంట్లో తిండికీ తిప్పలకీ నా సంపాదనే. పిల్లలింకా చిన్నోళ్లు బిచ్చమెత్తుకోనాకి. మావోడికి రోజుకో పావలా ఇత్తానండి తాగుడికి. ‘నువ్వు ఏమాత్రం సంపాదిస్తావు?’ ‘ఒక్కొక్కరోజు ఐదు రూపాయలు దాకా దొరుకుద్ది. ఒక్కొక్కరోజు కానీ కూడా ఉండదు.’ రావుగారు అనుకోకుండానే ఆమె ముఖం మీదికి దీపం వేశారు. ఆమె నవ్వింది. ఎవరినైనా సరే ఆమె కిందా మీదా పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా యిష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపిం చింది. జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడచిన కాలపు స్మృతుల బరువు గానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలు గానీ ఆమెకు లేవు. ఆయన ఆమె కొంటె చిరునవ్వుని యింకా అలానే చూస్తూ కూచున్నారు. ‘ఏటండి బాబుగారు! నాకేసలా చూత్తారు?’ అంది. ‘మునుపున్నంత రంగుగా యిపుడు లేనండి.’ వెంటనే ఆయన తనలోకి ముడుచుకు పోయారు. తన మనస్సులో అశ్లీలైన భావాలు వుంటాయన్నట్లు ఆమె సూచిం చినందుకు ఆమె మీద అసహ్యం కలిగింది. ‘నీవేపు చూడ్డం లేదు’ అన్నారాయన గట్టిగా. ‘దీపం ఆర్పడం మరచిపోయాను.’ అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. గది తలుపులు ఒక్క వూపులో తెరుచు కున్నాయి. అడ్డుగా పెట్టిన సామాను చెల్లాచెదురైపోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీమీద నుంచి పల్టీ కొట్టింది. రావుగారి గుండె గొంతుకలో అడ్డింది. శక్తి కొద్దీ ఒక మూలలోకి గెంతి, పిచ్చిగా ఆయన ముష్టి ఆమెను కౌగలించు కున్నాడు. వెంటనే సిగ్గుపడ్డాడు. కాని ఆమె ఆయన చెయ్యిపట్టి నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్లాడు మూలలోకి. ఆమె ఆయనను ఆ మూలలో కూచోబెట్టింది. తను కూడా దగ్గరగా కూర్చుని చేతు లాయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మథన జరుగుతోంది. కాని ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావ సరం. అంచేత ఆయన కాదనలేదు. ఆమె మరీ దగ్గరగా జరిగి వొళ్లోకి వాలింది. ఆయన ముడుచుకుని దీర్ఘంగా అవమానకరమైన ఆలోచనా పరంపరలో మునిగిపోయాడు. ఆమె మాట్లాడుతూనే వుంది. ‘ఈ మూల భయం లేదండి. బాబుగారికి చక్కని కూతుళ్లుంటారు యింటికాడ. బాబుగారు ఆరిని తలుచు కుంటున్నారు. మా గుడిసి ఎగిరిపోయుం టది. పిల్లేమైయుంటారో! ఇరుగు పొరు గోళ్లు సూత్తుంటార్లెండి. మావోడు చిత్తుగా తాగి పడుంటే గుడిసి ఎగిరిపోతే ఆడికేం తెలుత్తాది? పిల్లలు సుకంగా వున్నారో లేదో?’ ఒక మానవ హృదయంలోనించి వెలువడిన యీ వేదన వింటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్నీ మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆమెను గట్టిగా అదుముకున్నాడు క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానివేసింది. గాలి చేసే గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. కాలం అతి మెల్లగా జరుగుతోంది. కాని ఆ సంగతి ఆయనకు తెలియదు. గాలివాన బలం హెచ్చింది. పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కాని గాలివల్ల వాన వారిద్దరినుంచీ దూరంగా రెండో పక్కకి పడుతోంది. కొంతసేపటికి రావుగారి మనస్సు మేలుకుంది. లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశాడు. అమాయికంగా, నిశ్చింతగా వుంది. స్వచ్ఛమైన, నిసర్గమైన ఒక శోభ ఆ ముఖంలో దివ్యత్వం స్ఫురింప జేసింది. గాలివాన జోరు హెచ్చింది. కాని ఆయన మనస్సులో అమితమైన ప్రశాంతి నిండింది. శరీరం అలసిపోయి విశ్రాంతి కోరింది. క్రమంగా ఆయన పరిసరాలను మరచిపోయి నిద్రలో మునిగిపోయాడు. మళ్లీ మెలకువ వచ్చేసరికి వాన తగ్గింది. గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టి ఆమె లేచి వెళ్లిపోయింది. గడియారం చూచుకున్నారు. ఐదుగంటలయింది. అనుకోకుండానే జేబులు తడుము కున్నారు. ఆయనకు స్ఫురించిన మొదటి మాట ‘దొంగ ముండ’. కాని ఆమె అల్లా దొంగతనం చేసి వుంటుందనుకోడం ఆయనకు యిష్టం లేదు. గదిలో నాల్గు మూలలా వెతికారు. కనబడలేదు. గదిలో నుంచి బయటికి వచ్చారు. భీభత్సంగా వుంది. ప్లాట్ఫారం తప్ప చుట్టుపక్క లంతా నీటిమయం. కొందరు దెబ్బలు తిన్నవాళ్లు స్టేషను రెండో పక్కన కింద పడుకుని వున్నారు. ఏదో హాస్పిటల్లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టి నప్పుడు తప్ప అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయనెప్పుడూ చూడలేదు. వికారం వచ్చింది. వెనక్కు తిరిగాడు. టికెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది. వెయిటింగు రూము కూలిపోతే ఏమైయుండునని ఆయన అనుకున్నాడు. ఆ కల్లోలాన్ని చూస్తూ నిలబడిపోయాడు. ఆ సామాను కింద ఏదో శరీరం ఆనింది. దీపం వేసి చూశారు. ముష్టి ఆమె. తట్టుకోలేకపోయాడు. వంగి నుదురు తాకి చూచారు. చల్లగా చచ్చిపోయివుంది. చేతులు రెండూ యివతలకు వున్నాయి. క్రింది భాగం పూర్తిగా నలిగిపోయి నట్టుంది. ఒక చేతిలో ఆయన పర్సుంది. రెండో చేతిలో కొన్ని నోట్లు, కొంత చిల్లరా వుంది. బహుశా టిక్కట్లు అమ్మిన డబ్బై వుంటుంది. గుమస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి తొందరగా యింటికి పోయుంటాడు. రావు చిన్నపిల్లవాడి వలె ఏడుపు ప్రారంభించాడు. చల్లని ఆ నుదురు ముద్దుపెట్టుకున్నాడు. తనకు ఆత్మ స్థైర్యాన్నీ శాంతినీ గాలివానకు తట్టుకోగల శక్తిని చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడి పోయి వుంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపోయింది. ఆయన హృదయం తుఫానులో సముద్రం లాగా ఆవేదనతో పొంగిపొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు అనిపించింది. తన పర్సును దొంగలించినందుకు గాని, అంత గాలి వానలో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చు నని టిక్కట్ల గదిలోకి వెళ్లినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. ఆమె ఆఖరుతత్వం ఆయనకు తెలుసును. ఇప్పుడు ఆమె చిలిపితనాలు, కొంటెతనాలు ఆయనకు ప్రేమపాత్రాలయ్యాయి. ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవతత్వాన్ని ఈ జీవి వికసింపజేసింది. ఆయన భార్య గాని ఆయన పిల్లల్లో ఎవరుగానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. ఆయన విలువలు, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం... అన్నీ త్యజిస్తాడాయన ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే. అవతల మనుష్యులు వస్తున్న సవ్వడి వినిపించింది. రావుగారు కళ్లు తుడుచుకుని ఒక క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ల సందులోంచి డబ్బు తీసి తెరచి వున్న డ్రాయరులో వేసి డ్రాయరు మూశాడు. కాని తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయన మనస్సు వొప్పలేదు. తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయనకు అనిపించింది. కాని యితరులు ఆమె దొంగతనం చేసిందని అనుకుంటే ఆయన భరించలేడు. అంతచేత జాగ్రత్తగా ఆ పర్సులో నుంచి తన పేరుగల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కణ్నించి వెళ్లిపోయాడు. (స్థలాభావం కారణంగా కాస్త సంక్షిప్తీకరించడం జరిగింది) - పాలగుమ్మి పద్మరాజు
Related News by category
-
చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరు పొందింది. చైనాలోని మింగ్ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్వు చక్రవర్తి కొడుకు ఝుడి నాన్జింగ్ నుంచి బీజింగ్కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్లో ఈ నిర్మాణం చేపట్టాడు. దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. (చదవండి: Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!) -
19 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పటికీ మిస్టరీగానే! ఎవరీ బ్రియానా?
ఈ రంగుల ప్రపంచంలో చీకటి లోకమనేది ఒకటుంటుందని, అందులో దేనికైనా తెగించే మనుషులుంటారని తెలుసుకోలేరు కొందరు. కేవలం తమ కలల ప్రపంచం వైపు పరుగులు తీస్తూ జీవితాలనే పోగొట్టుకుంటుంటారు. బ్రియానా మైట్ల్యాండ్ అనే 17 ఏళ్ల అమ్మాయి తన జీవితంలో అదే పొరబాటు చేసింది. అమెరికాలోని బర్లింగ్టన్ వర్మోంట్లో కెల్లీ, బ్రూస్ దంపతులకు 1986లో బ్రియానా జన్మించింది. ఈస్ట్ ఫ్రాంక్లిటన్ అనే చిన్న పట్టణంలో తన అన్నతో కలిసి పెరిగింది. పిల్లలిద్దరూ తల్లిదండ్రులతో పాటు తమ పొలాల్లోనే పనులకు వెళ్తూ, స్కూల్లో చదువుకునేవారు. ఇంట్లో అంతా ఆమెని ముద్దుగా బ్రీ అని పిలిచేవారు. బ్రీకి తన జీవనశైలి ఏమాత్రం నచ్చేది కాదు. పొలం పనులకు, పల్లె జీవితానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తనకు 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంటికి 15 మైళ్ల దూరంలో ఉన్న ఎనోస్బర్గ్ ఫాల్స్ హైస్కూల్లో చేరతానని పేరెంట్స్పై ఒత్తిడి తెచ్చింది. అక్కడే పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటానని పట్టుబట్టింది. మొదట సంకోచించిన పేరెంట్స్ చివరికి బ్రీ కోరికను కాదనలేకపోయారు. ఆరు నెలలు గడిచేసరికి ఆ హైస్కూల్ నుంచి డ్రాప్ ఔట్ అయ్యి.. ఇంకాస్త పైస్థాయికి వెళ్లేందుకు ఎఉఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. అందుకోసం మోంట్గోమేరీకి దగ్గరల్లో తన చిన్ననాటి స్నేహితురాలు జిలియన్తో కలిసి రూమ్లో ఉంటూ, జాబ్ చేసుకుంటూనే చదువుకునేది. తనున్న పట్టణం తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి, ఉద్యోగానికి, భవిష్యత్తులో ఎదుగుదలకూ అనువైనదని ఆమె నమ్మింది. 2004 మార్చి 19 శుక్రవారం ఉదయాన్నే తన తల్లిని కలిసిన బ్రీ.. తనకు మరో పార్ట్ టైమ్ జాబ్ దొరికిందని, మర్నాడే డ్యూటీలో జాయి¯Œ అవుతానని చెప్పింది. ఆ ఆనందంలోనే కెల్లీని రెస్టారెంట్కి తీసుకెళ్లింది. అప్పుడే తన కెరీర్ గురించి తల్లితో మాట్లాడింది. మధ్యాహ్నం మూడున్నర దాటే సరికి రూమ్ దగ్గర డ్రాప్ చేసి, కెల్లీ వెళ్లిపోయింది. కెల్లీ బ్రీని చూడటం అదే చివరిసారి. అదేరోజు ఈవినింగ్ డ్యూటీకి వెళ్లిన బ్రీ సోమవారం వరకూ రాకపోయేసరికి రూమ్ మేట్ జిలియన్కి భయమేసి బ్రీ కుటుంబానికి, పోలీసులకు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు బ్రీ శుక్రవారం రాత్రి 11:20కే డ్యూటీ నుంచి తన రూమ్కు బయలుదేరిందని తెలుసుకున్నారు. డ్యూటీ తర్వాత పార్టీకి రమ్మని పిలిచిన కొలిగ్స్తో ‘రేపు ఉదయాన్నే న్యూ జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇప్పుడు త్వరగా వెళ్లి రెస్ట్ తీసుకోవాలి’ అందట. మరో రెండు రోజులు గడిచేసరికి ఓ షాకింగ్ నిజం అక్కడ మీడియాని షేక్ చేసింది. అప్పటికే కేసు నమోదైన యాక్సిడెంట్ కారు ఎవరిదో కాదని, కనిపించకుండా పోయిన ‘బ్రీ’దేనని తేలింది. మార్చి 20 శనివారం ఉదయానికి మోంట్గోమెరీ రోడ్ నం. 118లో పాడుబడిన ఇంటిని చాలా విచిత్రంగా వెనుక నుంచి ఢీ కొట్టి ఉందట ఆ కారు. ఎవరో తాగుబోతు యాక్సిడెంట్ చేసి, పారిపోయి ఉంటాడని భావించిన ఓ పోలీసు దాన్ని స్థానిక గ్యారేజ్కి తరలించాడట. ఆ ఇల్లు ఓ నిర్మానుష్యమైన దారిలో పెద్ద మలుపు దాటగానే ఉంటుంది. అదేం ప్రమాదకరమైన మలుపు కూడా కాదు. అయితే ఈ వార్తలు వెలుగులోకి రావడంతో చాలామంది సాక్షులు ఆ కారుని తాము చూశామంటూ ముందుకొచ్చారు. ఆ రాత్రి పన్నెండుంపావుకి ఆ ఇంటిముందు హెడ్ లైట్స్ వెలుగుతున్న కారుని గమనించానని ఒకరు, పన్నెండున్నరకి లైట్స్ వెలగడంతో కారు టర్న్ చేస్తున్నారేమో అనుకున్నానని మరొకరు చెప్పారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ రాత్రి రెండున్నర తర్వాత బ్రీ మాజీ బాయ్ ఫ్రెండ్ రోబాటియాలే కూడా ఆ కారుని చూశాడు. ఆగి, అక్కడ ఎవరూ లేకపోవడంతో కారు లైట్స్ ఆఫ్ చేసి, డోర్స్ క్లోజ్ చేసి, తన దారిన తాను వెళ్లిపోయాడట. ‘అది బ్రీ కారని నీకు తెలుసా?’ అని అడిగితే అప్పటికి తెలియదని చెప్పాడు. ఏది ఏమైనా 11.20కే కారులో బయలుదేరిన బ్రీ, పన్నెండుంపావుకే ఆ కారులో లేదు. యాక్సిడెంట్ అయిన ప్రదేశం తన ఆఫీస్కి చాలా దగ్గర్లో ఉంది. అంటే గంట సమయంలోనే తను మిస్ అయ్యింది. ఇక మరుసటి రోజు మార్చి 20న ఆ పోలీసు కారుని గ్యారేజ్కి పంపించకముందు ఓ బృందం విహారయాత్రకు వెళ్తూ ఆ కారుని చూసి ఆగింది. వారంతా తమ కెమేరాల్లో చాలా ఫొటోలు తీశారు. ఆ ఫొటోలే తర్వాత ఈ క్రైమ్సీన్ కి కీలక సాక్ష్యాలయ్యాయి. అయితే ఆ పర్యాటకులు కారు పక్కనే విరిగిన బ్రేస్లెట్ చూసినట్లు చెప్పారు. కానీ అది పోలీస్ రికార్డుల్లో లేదు. మొదట అనుమానం రోబాటియాలే మీదకు మళ్లింది. అయితే అతడు విచారణ కొనసాగుతుండగానే బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాంతో కేసుకు ముందు సాగలేదు. బ్రీ మిస్సింగ్కి ఐదువారాల ముందు మౌరా ముర్రే అనే అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లోనే గల్లంతైంది. బ్రీ కారు దొరికిన ప్రదేశానికి సరిగ్గా 90 మైళ్ల దూరంలోనే ముర్రే కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దిశగా విచారణ జరిపినా ఫలితం లేదు. మిస్సింగ్కి 3 వారాల ముందు ఒక పార్టీలో బ్రీకి తన మాజీ స్నేహితురాలు లాక్రోస్కి మధ్య గొడవ జరిగిందట. లాక్రోస్ ఆ గొడవలో బ్రీని ముక్కు విరిగేలా కొట్టిందట. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్న బ్రీ.. లాక్రోస్పై తన ప్రతాపాన్ని చూపించకుండా వదిలిపెట్టిందట. ఆ కథ తెలుసుకున్న పోలీసులు, లాక్రోస్ని కూడా విచారించారు. కానీ ఏ ఆధారం దొరకలేదు. ఇలా ఎంతమందిని ప్రశ్నించినా? నిజానిజాలు బయటపడలేదు. చాలామంది బ్రీ పారిపోయి ఉంటుందని నమ్ముతారు. కానీ అది నిజం కాదని వాదించేవారు, ఇదో మానవ అక్రమ రవాణా కేసని నమ్ముతారు. బ్రీ ఎవరి నుంచో తప్పించుకునే క్రమంలో కారు వెనక్కి టర్న్ చేసుకునేటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగి ఉంటుందని, అందుకే లైట్స్ వెలుగుతూ, డోర్స్ ఓపెన్ లోనే ఉన్నాయని ఊహిస్తుంటారు. పైగా కరాటేలో నిష్ణాతురాలైన బ్రీని ఒకరు కిడ్నాప్ చేయలేరని ఎక్కువ మందే ఉండి ఉంటారనేది డిటెక్టివ్స్ మాట. 2022 మార్చి 18న ఇప్పటి దాకా దొరకని కొత్త డీఎన్ఏ దొరికిందని వెళ్లడించడంతో అది క్రిమినల్ది అయ్యే అవకాశం ఉండొచ్చని ఆశ మొదలైంది. పదిహేడేళ్లప్పుడు మాయం అయిన బ్రీకి ఇప్పుడు సుమారు 36 ఏళ్లు ఉండి ఉండొచ్చు. అయితే గత 19 ఏళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉంది. ∙సంహిత నిమ్మన -
నాకు మా బావ అంటే చాలా ఇష్టం.. కానీ
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్లో.. భవిష్యత్లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. నాకు 43 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్గా రావడంలేదు. స్కానింగ్ ద్వారా ఇంకెన్ని రోజుల్లో నాకు పీరియడ్స్ ఆగిపోవచ్చనేది తెలుసుకోవచ్చా? – జి. ప్రసన్నకుమారి, కోటగిరి మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. మామూలుగా నెలలు ఆగి.. ఏడాది వరకూ రాకపోతే దాన్ని మెనోపాజ్గా పరిగణిస్తాం. పెరీమెనోపాజ్.. అంటే మెనోపాజ్ కంటే రెండుమూడేళ్లు ముందు.. వెనుక టైమ్ అన్నమాట. అండాశయాల్లో అండాలు తయారుకానప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ బాగా తగ్గిపోతుంది. మెనోపాజ్కి సగటు వయసు 51 ఏళ్లు. నలభై అయిదేళ్లలోపు ఆగిపోతే ఎర్లీ మెనోపాజ్ అంటారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో గర్భసంచి లైనింగ్ పలుచగా ఉండడం, అండాశయాల్లో అండాలు లేదా ఫాలికిల్స్ లేకపోవడం.. మెనోపాజ్ అని చెప్పడానికి కొన్ని మార్గాలు.. సూచనలు. నిర్ధారించడానికి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అనే రక్తపరీక్ష చేసినప్పుడు అది 35 కన్నా ఎక్కువ ఉంటే మెనోపాజ్ అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ఒంట్లోంచి వేడివేడి ఆవిర్లు, ఆ వెంటనే చెమటలు, మూడ్స్వింగ్స్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. నెలలు ఆగిపోయిన తర్వాత కూడా గర్భసంచి లైనింగ్ పలుచగా కాకుండా దళసరిగా అంటే 5ఎమ్ఎమ్ కన్నా ఎక్కువగా ఉంటే తర్వాత పరీక్షల కోసం సూచిస్తాం. దీనిని ఎండోమెట్రియల్ హైపర్ప్లాజియా అంటారు. అందుకే 40 నుంచి 45 ఏళ్లలోపు నెలసరి ఆగిపోతే టీఎస్హెచ్, థైరాయిడ్ పరీక్షలను కచ్చితంగా చేయించాలి. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
నాకిప్పుడు 43 ఏళ్లు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది..
మా పాపకు పద్దెనిమిదేళ్లు. ఛాతీ మరీ ఫ్లాట్గా ఉంది. ఇంప్రూవ్ అవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. పుష్పలత, అమలాపురం బ్రెస్ట్ డెవలప్మెంట్ సాధారణంగా తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య మొదలవుతుంది. ఈ గ్రోత్ ప్రతి అమ్మాయికి డిఫరెంట్గా ఉంటుంది. దాదాపుగా 17 – 18 ఏళ్లు వచ్చేసరికి బ్రెస్ట్ గ్రోత్ పూర్తవుతుంది. పరిమాణం, ఆకారం అందరమ్మాయిలకు ఒకేలా డెవలప్ అవదు. మస్సాజ్లు, క్రీములు, మాత్రలు, వ్యాయామం.. లాంటివేవీ కూడా బ్రెస్ట్ సైజ్ని, షేప్ని చేంజ్ చేయలేవు. రొమ్ములు ఫ్యాటీ టిష్యూతో ఉంటాయి. అది మజిల్ కాదు కాబట్టి వ్యాయామంతో బ్రెస్ట్స్ సైజ్ను పెంచలేం. బరువు తగ్గినప్పుడు బ్రెస్ట్ సైజ్ కూడా కొంత తగ్గవచ్చు. బరువు పెరిగినప్పుడు పెరగవచ్చు. కానీ ఇది తాత్కాలిక మార్పు మాత్రమే. కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా బ్రెస్ట్ సైజ్ను పెంచే అవకాశం ఉంది. కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. స్కార్ టిష్యూ ఫామ్ అవడం, బ్రెస్ట్ ఫీడ్ చెయ్యలేకపోవడం వంటి శాశ్వత సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్ని అరుదైన వ్యాధుల్లో కూడా బ్రెస్ట్ చాలా చిన్నగా ఉండొచ్చు. టర్నర్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన డిజార్డర్లో కూడా ఫ్లాట్ చెస్ట్ అండ్ నిపుల్స్ ఉండొచ్చు. అలాంటి అనుమానాలేమైనా ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా?ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు .. డౌన్సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్ను సంప్రదిస్తూ టైమ్కి చేయవలసిన స్కానింగ్లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం. -
సద్దాం హుస్సేన్ వాడని ఓడ
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఓడ ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ ముచ్చటపడి ప్రత్యేకంగా తయారు చేయించుకున్నది. అయితే, ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ దీనిని వాడలేదు. నాలుగు అంతస్తులు, పద్దెనిమిది విశాలమైన గదులు, లోపల అధునాతన సౌకర్యాలతో రూపొందించిన ఈ 270 అడుగుల పొడవైన ఓడ పేరు ‘బస్రా బ్రీజ్’. ఇందులో ఫైవ్స్టార్ హోటల్ను తలదన్నే ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ఒక సెలూన్, డ్రైక్లీనింగ్ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. సద్దాం హుస్సేన్ ఈ ఓడను ఒక డెన్మార్క్ కంపెనీ ద్వారా తయారు చేయించుకున్నాడు. దీని తయారీ 1980లో ప్రారంభమైంది. తయారీ పూర్తయ్యాక మరుసటి ఏడాది ఇది ఇరాక్ తీరానికి చేరుకుంది. ఇంత ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఓడలో సద్దాం హుస్సేన్ ఎన్నడూ అడుగుపెట్టలేదు. ఇరాక్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఓడను బస్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధన కేంద్రంగా మార్చింది. నిజానికి ఇరాక్ ప్రభుత్వం 2018లో ఈ ఓడను 30 మిలియన్ డాలర్లకు (రూ.245 కోట్లు) అమ్మకానికి పెట్టినా, దీని కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఇప్పుడిది శాస్త్ర పరిశోధన కేంద్రంగా మారడంతో వార్తలకెక్కింది.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement