Sakshi News home page

Published Fri, Jul 27 2018 2:04 AM

Article On Controlling Fake News In Social Media - Sakshi

నకిలీ వార్తల మహమ్మారిని అదుపుచేయాలనే విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. అయితే, ఇందుకు సామాజిక మాధ్యమాలు, వినియోగదారులపై విధించే నియంత్రణ ఎలా ఉండాలి? ఏ స్థాయిలో అమలు చేయాలనే అంశాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయిస్తేనే అందరికీ మేలు. అసలు నకిలీ వార్త అంటే ఏమిటి? దాన్ని ఉపయోగించి నేరం చేసేలా జనాన్ని రెచ్చగొట్టడం అంటే ఏమిటో నిర్వచనాలు రూపొందించాలంటే ముందు ఈ పదాల అర్థాలపై సంబంధిత వ్యక్తులు, సంస్థల మధ్య విస్తృత ఏకాభిప్రాయం అవసరం. అప్పటి వరకూ నేరం చేయడానికి పురికొల్పే సంస్థగా పరిగణిస్తామని వాట్సాప్‌ను బెదిరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

నకిలీ వార్తలు గుర్తించడంలో కఠిన నియంత్రణ పాటించాలంటూ సందేశాలు, ఫొటోలు పంపడానికి ఉపయోగించే వాట్సాప్‌కు కేంద్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఇటీవల నోటీస్‌ జారీ చేసింది. దీన్ని ప్రసార మాధ్యమాల జవాబుదారీతనం పెంచే ప్రయత్నంగా ప్రభుత్వం భావిస్తోంది. వదంతులకు దారితీసే నకిలీ వార్తల ప్రచారం జరుగుతుంటే ఇలాంటి మాధ్యమాలు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తే చర్యలు తప్పవని ఐటీ శాఖ హెచ్చరించింది. వాట్సాప్‌ వినియోగ దారులు సొంతంగా పంపించే (ఒరిజినల్‌) సందేశం ఏదో, ఎవరో పంపిన (ఫార్వర్డ్‌ చేసిన) మెసేజ్‌ ఏదో గుర్తించే ‘ఫార్వర్డ్‌ లేబుల్‌’ను ఇటీవల రూపొందించాక ఐటీ శాఖ ఈ ప్రకటన చేసింది. తప్పుడు సమా చారాన్ని అనేక పెద్ద గ్రూప్‌ల ద్వారా పంపించడం ఆనవాయితీగా మార డంతో ఈ కొత్త మార్పు నకిలీ వార్తను వ్యాప్తిచేసే ఫార్వర్డ్‌ మెసేజ్‌లను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

వాట్సాప్‌ ద్వారా ఇటీవల అనేక పుకార్లు వ్యాపించడంతో పిల్లలను ఎత్తుకుపోయేవారనే అనుమానంతో అనేకమంది అమాయకులను మూకలు కొట్టి చంపాయి. ఈ నేపథ్యంలో ఇలా అనుమానంతో, ద్వేషంతో అరాచక సమూహాల దాడులు, హత్యలు జరగకుండా చూడడానికి చర్యలు తీసుకోవడానికి బదులు నకిలీ వార్తల అదుపుపై సర్కారు దృష్టి కేంద్రీకరిస్తోంది. గాలి వార్తలు సృష్టించేవారిని పట్టుకోకుండా వాటి వ్యాప్తికి దోహదం చేసే మాధ్యమా లపై బాధ్యత పెట్టడంవల్ల ప్రయోజనం ఉండదు. సామాజిక మాధ్య మాల్లో వచ్చే వివరాలు తమకు అందుబాటులోకి తేవాలని కూడా ప్రభు త్వం డిమాండ్‌ చేస్తోంది. అంటే అసలు నేరస్తులను వదిలేసి, నకిలీ వార్తల ప్రసారం ద్వారా ఈ నేరాలకు ఈ మాధ్యమాలు ప్రోత్సహిస్తున్నా యనే సర్కారు ధోరణి హేతుబద్ధంగా లేదు.

ఈ వైఖరి అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఐటీ శాఖ ప్రకటన ప్రకారం ఇక్కడ నేరం పుకార్లు వ్యాప్తి చేయడమే. ఈ పని చేస్తున్నది వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలనే విధంగా ఈ ప్రకటన ధ్వనిస్తోంది. భారత చట్టాల్లో నకిలీ వార్త అనే ప్రస్తావన లేదుగానీ ఏదైనా ప్రకటన, పుకారు లేదా వార్త ప్రజల్లో భయాందోళనలు కలిగించి, వారిని నేరం చేయడానికి పురికొల్పుతుందో అలాంటి వార్తల ప్రచారం చేసే వ్యక్తులను శిక్షించవచ్చని ఐపీసీ సెక్షన్‌ 505లో పేర్కొన్నారు. అయితే ఇలాంటి వార్తలు నిజమేనని మంచి నమ్మ కంతో వాటికి ప్రచారం కల్పిస్తే అది నేరం కాదనే మినహాయింపు ఇచ్చారు. చిక్కల్లా అంతా ఇక్కడే వస్తుంది. పుకార్లు లేదా గాలి వార్తల ప్రసారానికి కారణమైందని వాట్సాప్‌పై అభియోగం మోపితే ఈ సంస్థ ఈ ఐపీసీ సెక్షన్‌ 505లోని మాటలు ఉపయోగించి తన తప్పేమీ లేదంటూ సమర్థించుకునే వీలుందా లేదా అనేది స్పష్టం కావడం లేదు.

ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ రాజ్యాంగ విరుద్ధం
నకిలీ వార్తల ప్రచారం చేసేవారిని శిక్షించడానికి దాదాపు వీలు కల్పించే ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66 ఏను రాజ్యాంగ విరుద్ధమంటూ 2015లో సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ సెక్షన్‌లో నేరాన్ని స్పష్టంగా నిర్వచించలేదని తేల్చిచెప్పింది. నేరానికి శిక్ష వేసే ఏ చట్టమైనా నేరాన్ని సూటిగా నిర్వ చించకపోతే అది కోర్టు పరిశీలనకు నిలవదని కూడా ప్రకటించింది. మరి అలాంటప్పుడు వాట్సాప్‌ ఏ నేరం చేయడానికి జనాన్ని ప్రోత్సహిం చిందీ స్పష్టంగా పేర్కొనకుండా ఐటీ శాఖ ఇచ్చిన నోటీసు ప్రాధాన్యం సంతరించుకుంది.

నేరమేమిటో ఖచ్చితంగా ప్రస్తావించకుండా ఎవరి పైనైనా అభియోగం మోపడం కుదిరే పని కాదు. గాలి వార్తల విస్ఫోట నానికి వాట్సాప్‌ మాధ్య మమే కారణమంటూ దాన్ని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని చర్యలకు ఉపక్రమిస్తే–ఏ చట్టం కింద తనను మూక లను రెచ్చగొడుతున్నట్టుగా చూపిస్తారని ఈ సంస్థకు ప్రభుత్వాన్ని నిల దీసే హక్కు ఉంది. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నియంత్రణ సాధ్యమయ్యే విషయం కాదు. అదీగాక వాటిని అదుపు చేసే క్రమంలో ప్రభుత్వ సంస్థలు పక్షపాత వైఖరి అవలంభించే ప్రమాదం ఉంటుంది. ఏది అసలీ, ఏది నకిలీ అని తేల్చాలంటే ఓ అంశంపై అభిప్రాయాలు, వాస్తవాలు, సత్యాన్ని విడదీసి పరిశీలించాల్సి ఉంటుంది. వ్యంగ్య రచ నలపై ఏ మాత్రం ప్రమాదకరం కాని చర్చలను కూడా ఈ నేపథ్యంలో నకిలీ వార్తల పేరుతో అభిశంసించే ముప్పు పొంచి ఉంది.

ఉదాహ రణకు, కొన్ని అవాంఛనీయ చర్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అనే అభి ప్రాయాన్ని వాట్సాప్‌ ద్వారా ప్రసారం చేస్తే దాన్ని ‘నకిలీ’ అని ముద్ర వేయడానికి వీలుంది. ఇలాంటి వార్తలను సమర్ధంగా నియంత్రించలేక పోయారనే ఆరోపణతో సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందే గాని దానివల్ల ప్రయోజనం ఉండదు. చివరికి గాలి వార్తల నియంత్రణ పేరుతో ఇంటర్నెట్‌ ద్వారా ప్రసారమయ్యే విషయాలను ఇలా పరోక్షంగా అదుపు చేయడానికి దారితీస్తుంది. సామాజిక మాధ్య మాలపై ఈ తరహా కట్టడి చేయడం వాటిపై ఆంక్షలకు వీలు కల్పిస్తుంది. వాక్‌స్వాతంత్య్రాన్ని, గోప్యతను దెబ్బదీస్తుంది.

సోషల్‌ మీడియాపై నిఘా ప్రమాదకరం!
ఇలాంటి ప్రభుత్వ నియంత్రణ వాట్సాప్‌లో వచ్చే విషయాలపై నిఘా, గోప్యతకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో తీవ్ర అభ్యంతరాలు తలె త్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో జరిగే అన్ని రకాల చర్చలు, అభి ప్రాయాలపై పకడ్బందీగా నిఘా పెట్టాలంటే వాట్సాప్‌లో వచ్చే అన్ని రకాల విషయాలు, వివరాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలా చేయడానికి వాట్సాప్‌ తన డేటా అంత టినీ ప్రభుత్వంతో పంచుకోవాలని ఆదేశాలు జారీచేసే పరిస్థితి వస్తుంది. కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం ఓ వ్యక్తి తన డేటాను ప్రైవేటు సంస్థ లకు అందజేయడంలో ఇబ్బందిపడకపోవచ్చేమోగాని, అవే వివరాలను ప్రభుత్వానికి ఇవ్వడం అంత తేలికకాదు. ఇక్కడ అనేక భయాలు, అను మానాలు, అపోహలు తలెత్తుతాయి.

మరో పక్క సామాజిక మాధ్య మాల్లో వచ్చే విషయాల వివరాలు తనకు అందజేయాలనే ఒత్తిడి ప్రభుత్వం నుంచి రోజు రోజుకూ పెరుగుతోంది. దేశంలో 2017లోనే ఈ రకమైన ప్రభుత్వ ఒత్తిళ్లు 62 శాతానికి పెరిగాయని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాలపై డేటా కోసం డిమాండ్‌ సగటున 30 శాతంగా ఉంది. డేటా అంద జేయాలనే అభ్యర్థనలు అత్యధికంగా అందుకున్న సోషల్‌ మీడియా వేదికల్లో ఫేస్‌బుక్‌ రెండో స్థానంలో ఉంది. 

సామాజిక మాధ్యమాలపై సర్కారు దృష్టి
మరో ఆసక్తికరమైన విషయమేమంటే, సర్కారు అమలు చేసే అధికార విధానాలపై ప్రజల వ్యక్తిగత అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల వినియోగదారుల ద్వారా తెలుసుకోవాలనే ప్రతిపాదన ఇటీవల ప్రభుత్వ పరిశీలనకు వచ్చింది. దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్త  మౌతున్నాయి. అవసరం ఉందన్న సాకుతో ప్రభుత్వం వాట్సాప్‌ సంభా షణలపై నిరంతర నిఘా పెట్టి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటే సామాజిక మాధ్యమాల వినియోగదారులు స్వేచ్ఛగా అభిప్రాయాలు తమ మాటల్లో వ్యక్తం చేయలేరు.

సర్కారీ అభిశంసనకు భయపడి అనేక పరిణామాలు, ప్రభుత్వ చర్యలపై అసమ్మతి తెలపడానికి ప్రజలు వెను కంజ వేస్తారు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే విషయాలపై నిఘా ఎంత సేపు ఉండాలి, ఇలా సేకరించే వివరాలను ఎంత వరకు వాడుకోవచ్చనే అంశాలకు చైనా, ఇండియా మినహా అత్యధిక దేశాల్లో పరిమితులున్నాయి. ఈ దేశాల్లో ఏఏ అంశాలపై ఏఏ మాధ్యమాలపై నిఘా పెట్టాలనే విషయంపై స్పష్టమైన నిబంధనలున్నాయి. అవాంఛ నీయ సంఘటనలకు దారితీసే గాలి వార్తల వ్యాప్తిలో వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలపై పట్టు బిగించి, వాటిని బాధ్యులను చేయ డానికి ప్రభుత్వం డేటా తనకు అందించాలనే డిమాండ్‌ పెంచుతోంది. ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది.

ఏదైనా అంశానికి సంబంధించి తమకు అందిన సమాచారాన్ని వాట్సాప్‌లో ఏ యూజరైనా ఒకేసారి ఐదుగురికి మాత్రమే పంపించేలా ఈ సంస్థ చర్యలు తీసుకో వడం వల్ల ప్రమాదమైతే లేదు. ప్రభుత్వ ఆంక్షలు, ఒత్తిళ్లు కారణంగా తన యూజర్ల స్వేచ్ఛకు పరిమితులు విధిస్తున్నట్టుగానే తాజా చర్యను పరిగణించాల్సి ఉంటుంది. ఈ పరిణామం కారణంగా అంతకు ముందు వాట్సాప్‌ వినియోగదారులు తమకు అందిన విషయాలను ఒకేసారి అనేకమందికి సులువుగా పంపించుకునే సౌలభ్యాన్ని కోల్పోతున్నట్టే. 

నకిలీ వార్తల వ్యాప్తి లేదా ప్రసారానికి సంబంధించిన కొన్ని నిబం ధనలను ఉల్లంఘిస్తే అందుకు బాధ్యులైన జర్నలిస్టుల గుర్తింపును (అక్రెడిటేషన్‌) రద్దు చేస్తామని బెదిరిస్తూ కొన్ని నెలల క్రితం ప్రభుత్వం కొత్త పరిష్కార మార్గాలను వెదకడానికి ప్రయత్నించింది. గాలి వార్తల నియంత్రణ పేరుతో సర్కారు జర్నలిస్టుల స్వేచ్ఛపై ఇలా అడ్డగోలు ఆంక్షలు పెట్టడం అన్యాయమంటూ మీడియాకు చెందిన అనేక వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. ఫలితంగా, అక్రెడిటేషన్‌ రద్దు చేయడానికి వీలు కల్పించే ఈ ప్రభుత్వ సర్క్యులర్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

నకిలీ వార్తల మహమ్మారిని అదుపుచేయాలనే విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. అయితే, ఇందుకు సామాజిక మాధ్యమాలు, వినియోగదారులపై విధించే నియంత్రణ ఎలా ఉండాలి? ఏ స్థాయిలో అమలు చేయాలనే అంశాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయిస్తేనే అంద రికీ మేలు. అసలు నకిలీ వార్త అంటే ఏమిటి? దాన్ని ఉపయోగించి నేరం చేసేలా జనాన్ని రెచ్చగొట్టడం అంటే ఏమిటో నిర్వచనాలు రూపొందిం చాలంటే ముందు ఈ పదాల అర్థాలపై సంబంధిత వ్యక్తులు, సంస్థల మధ్య విస్తృత ఏకాభిప్రాయం అవసరం. అప్పటి వరకూ నేరం చేయ డానికి పురికొల్పే సంస్థగా పరిగణిస్తామని వాట్సాప్‌ను బెదిరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఆదిత్య ప్రసన్న భట్టాచార్య, సిద్ధార్థ సోంకర్‌
జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయాల విద్యార్థులు

Advertisement
Advertisement