బాబోయ్‌! డిప్రెస్‌ మీట్‌! | Sakshi
Sakshi News home page

బాబోయ్‌! డిప్రెస్‌ మీట్‌!

Published Sat, Apr 13 2019 1:30 AM

Sri Ramana Satirical On Chandrababu Naidu Press Meet - Sakshi

మొన్న ఏపీలో పోలింగ్‌ ప్రారంభం అయీ కాకుం డానే చంద్రబాబు నిరసన గళం విప్పారు. ఓటింగ్‌ యంత్రాలు దగా చేస్తున్నా యన్నారు. సైకిల్‌ మీట నొక్కితే ఫ్యాను తిరుగు తోందని అలజడి చేశారు. దాదాపు ముప్ఫై శాతం యంత్రాలు పని చేయడం లేదని చెప్పారు. మొత్తం ఈసీ అవతలి వర్గంతో కుమ్మక్కై, మోదీ చేతి కీలుబొమ్మగా పని చేస్తోందని నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది విన్న వాళ్లు ‘ఆడలేక మద్దెల ఓడు’ అంటే ఇదేనని తెలుగు సామెతలు వచ్చిన పల్లె ప్రజలు చెప్పుకున్నారు. రెండు రోజులు గడిచిపోయినా, ఆఖరికి ప్రశాం తంగా పోలింగ్‌ ప్రక్రియ ముగిసినా చంద్రబాబు పాత పాటే పాడుతున్నారు.

ప్రజల చెవులు బద్దలు కొడుతున్నారు. చంద్ర బాబు భారత రాజ్యాంగ మూలాల గురించి, దేశభక్తి సిద్ధాంతాల గురించి, గాంధేయ వాదంలో నిక్షిప్త మైన నైతిక అంశాల గురించి, తను అవలంభించే మానవతా దృక్పథాల గురించి ప్రతి ప్రెస్‌ మీట్‌ లోనూ మాట్లాడి అందర్నీ బాధిస్తున్నారు. ఒక సీనియర్‌ పాత్రికేయుడు గంట రెండు గంటల సేపు చంద్రబాబు సొంత మీడి యాలో సొంత రొద విని బయటకు వస్తూనే, పరమ గాఢంగా నిట్టూర్చి, ‘ఇది ప్రెస్‌మీట్‌ కాదు డిప్రెస్‌ మీట్‌’ అందరూ అన్ని దారుల నిండా గాలిని వదిలి రిలాక్స్‌ అయ్యాడు. తలపెట్టిన ఓ క్రతువు నిర్విఘ్నంగా పూర్తయినం దుకు పెద్దలు, దేశాభిమానులు మొదలు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.

దేవుడిమీద నమ్మకం లేనివాళ్లు ఓటర్లని మనసా అభినందించాలి. ఇంతటి మహాక్రతువుని నిర్వహించిన ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి కృతజ్ఞతలు చెప్పాలి. అంతేగానీ కుళ్లు రాజకీ యా లకు తెర తీయకూడదు. ఓడిపోతే ఎవరిమీద ఏ విధంగా నెపం వేయాలో ఇప్పుడే శ్రీకారాలు చుట్ట కూడదు. కిందటి ఎన్నికలలో ఈవీఎంలు అద్భు తంగా పని చేశాయి. ఈసారి వచ్చేసరికి సాంకే తికంగా దిగజారి పోయాయి. వాటికి మతి చెడి సైకిల్‌కి ఫంకాకి తేడా తెలియకుండా పోయింది. మంచి నాయకుడు గెలుపుని సమతూకంగా స్వీకరిం చడమే కాదు ఓటమిని సైతం సహనంగా తీసుకో గలగాలి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ప్రజలిచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటాయి. 

ప్రజా తీర్పుని అన్ని పార్టీలు శిరసా వహించాలి. కొన్నాళ్లుగా చంద్రబాబు ఓర్పు, సహ నాలు కోల్పోయి.. ఆముదం గానుగ ఒకే గాడిలో తిరుగుతున్న తీరున ప్రసంగిస్తున్నారని జన సామా న్యం చెప్పుకుంటున్నారు. ప్రజలకి చెప్పడానికి గొప్ప పాయింటు లేనప్పుడే ఉపన్యాసాలు ఆము దం గానుగలవుతాయి. మోదీ, జగన్, కేసీఆర్‌లను అక్షులు పక్షులు కాకుండా చంద్రబాబు తిట్టిపోశారు. ఇది గొప్ప ఎన్నికల వ్యూహంగా పనిచేస్తుందని చంద్రబాబు ఊహించారు. కానీ కాదు. రేపు మోదీ మళ్లీ ప్రధాని అవుతారు. అప్పుడేమవుతుంది. ఒక దేశ ప్రధానిని గౌరవించడం ప్రజలందరి బాధ్యత. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలు కూడా చంద్రబాబుకి తెలియ దని జనం అనుకున్నారు. 

పోలవరం కట్టడానికి, రెండు మూడు కాపిటల్‌ తాత్కాలిక భవన నిర్మాణా లకి చంద్రబాబు తెగ పబ్లిసిటీ ఇచ్చి విఫలమ య్యారు. రైతులిచ్చిన నలభై వేల ఎకరాల భూమి వ్యవహారాన్ని బాబు సొంత ఖాతాలో వేసుకుని కులుకుతున్నారు. జగన్‌ వస్తే అరాచకమే అంటూ బూచిగా చిత్రీకరించే ప్రయత్నంలో పూర్తిగా ఓడి పోయారు. జగన్‌ ఎప్పుడూ గద్దెని ఎక్కి ఉండకపో వచ్చు. పుడుతూనే అనుభవాలు మూటకట్టుకు రారు. చంద్రబాబుకి అట్లా కలిసి వచ్చింది. గడచిన ఐదేళ్లలో అమరావతి పేరు చెబుతూ, అమరావతిలో కూర్చుని చంద్రబాబు దేవతా వస్త్రాలు మాత్రమే నేశారని ఓటర్లు కచ్చితంగా భావించారు. ఇంకా ఎన్నో అంశాలు వ్యతిరేకతనే స్పష్టంగా సూచి స్తున్నాయి.

అయినా ఇప్పటికే ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. కాసిని రోజులు ఓపిక పడితే తేటతెల్లంగా జాతకాలు తెలుస్తాయి. ఈలోగా బురద జల్లుకోవడం అనవసరం. ఒక విచిత్రం ఉంది. పోలింగ్‌ బూత్‌కి వెళ్లేటప్పుడు గంభీరంగా ఉండే ఓటర్లు, వచ్చేటప్పుడు మూతి మెదుపుతారు. అర్థం అయ్యేలా సైగలు చేస్తారు. ఆ సైగలకే చంద్ర బాబు కలవరపడుతున్నారని అనుభవజ్ఞులు పందే లతో వాదిస్తున్నారు.

వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు

Advertisement
Advertisement