గుంటూరు ఈస్ట్: గుంటూరులోని ఆనందపేటలో ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదైంది. తెలిసిన వివరాల ప్రకారం... ఆనందపేట 6వ లైనులో షేక్ ఆదంఫరూఖ్, ఫరీదాబేగం దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదో తరగతి చదివే ఫేరోజ్ అనే కుమారుడు, 9వ తరగతి చదివే షేక్ ఫౌజియా తస్లీమా (15) కుమార్తె ఉన్నారు. బాలిక గుంటూరులోని ప్రైవేటు పాఠశాలలో చదువుతుంది. సోమవారం రోజూలాగానే స్కూలుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరూ బయటకు వెళ్లారు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చేటప్పటికీ వంటగది తలుపులు వేసి ఉండటంతో తండ్రి తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
కిటికిలో నుంచి చూడగా కుమార్తె తస్లీమా ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందకు దించి జీజీహెచ్కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. పాతగుంటూరు ఎస్.హెచ్.ఒ బాలమురళీకృష్ణ జీజీహెచ్ అత్యవసర విభాగం వద్దకు బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. తండ్రి ఫరూఖ్ను, బంధువులను విచారించారు. బాలిక మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.