బాబు హామీలకు పూచీ తనదన్న పవన్ కల్యాణ్ ఎక్కడ ?
‘ఛలో అసెంబ్లీ’ నిర్వహిస్తామని నిరుద్యోగుల ప్రకటన
నాంపల్లి: జాబు కావాలంటే బాబు రావాలి... అన్నారు, బాబు వచ్చినా మాకు జాబు రాలేదు. బాబుకు జాబు రావడానికి కారణమైన గబ్బర్ సింగ్(పవన్ కల్యాణ్) కూడా కనిపించడం లేదు. బాబు ఇచ్చిన హామీల అమలుకు పూచీగా తను ఉంటానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అని నిరుద్యోగులు ప్రశ్నించారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నిరుద్యోగులను నిండా ముంచేసింది.
వయసు మీద పడుతున్నా కొలువులకు నోటిఫికేషన్ జారీ చేయడంలేదు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా ఒక్క ఉద్యోగం భర్తీకి నోచుకోలేదంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద బుధవారం నిరుద్యోగులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ వినూత్నంగా ప్లాస్టిక్ ప్లేట్ను ప్రదర్శిస్తూ భిక్షాటన చేశారు.
రోడ్డు మీద బైఠాయించి ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. ఈ ఐదేళ్లు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలాన్ని వెళ్లదీస్తే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలోని ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిరుద్యోగుల సంఘం నేత లగుడు గోవిందరావు చెప్పారు.