వర్ని(నిజామాబాద్): మద్యానికి బానిసై తాగుడుకు డబ్బులివ్వాలని వేధిస్తున్న కొడుకును ఓ తల్లి హతమార్చింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చందూరు గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మేకల నవీన్(30) మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. మద్యానికి బానిసైన నవీన్ ఈ మధ్య పనికి పోకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. తాగుడుకు డబ్బులు ఇవ్వాలని రోజు తల్లిని వేధిస్తున్నాడు.
ఆదివారం రాత్రి డబ్బులివ్వాలని ఇబ్బంది పెడుతుండటంతో తల్లి తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది. దీంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిన నవీన్ తెల్లవారుజామున తిరిగి ఇంటికి వచ్చి తల్లి దాచుకున్న డబ్బులను తీసుకున్నాడు. ఉదయం లేచి డబ్బులు లేవని గమనించిన తల్లి నవీన్ ను అడిగింది.
దీంతో నవీన్ తల్లితో గొడవకు దిగాడు. విసుగెత్తిన తల్లి కొడుకు ఎంత చెప్పిన మారడం లేదని గొడ్డలితో అతని పై దాడి చేసింది. మంచం మీద పడుకొని ఉన్న సమయంలో గొడ్డలితో మెడ భాగంలో దాడి చేయడంతో నవీన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.