చిత్తూరు : చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మిట్టకూరుపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కారు... బస్సు కింద భాగంలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులోని ప్రయాణికులు కూడా గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సు కింద నుంచి కారును బయటకు తీసేందుకు పోలీసులు స్థానికుల సహాయంతో ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వేణు, కమలమ్మ, లక్ష్మమ్మ, రమణమ్మ, రేణుకగా గుర్తించారు. మృతులు బైరెడ్డిపాలెం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.