చికెన్ గున్యాపై కేంద్రమంత్రి సమీక్ష | Sakshi
Sakshi News home page

చికెన్ గున్యాపై కేంద్రమంత్రి సమీక్ష

Published Wed, Sep 14 2016 1:32 PM

union minister jp nadda conduct a review meeting on chikungunya in Delhi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న చికెన్ గున్యా తీవ్రతపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జయప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ ఢిల్లీ ప్రభుత్వమే ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ సరిగా స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా చికెన్గున్యాకు అవసరమైన మందుల కొరత ఎక్కడా లేదని వెల్లడించారు. ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి ఏడుగురు మరణించారు. మరోవైపు మలేరియా కేసులు కూడా ఢిల్లీలో అధికమవుతున్నాయి. 
 
పరిస్థితి ఇలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈ విషయాన్ని ప్రధానినే అడగండి.. తమ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్, ప్రధాని అన్ని అధికారులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, వ్యాధుల విజృంభణ గురించి వారినే నిలదీయండంటూ విస్తుపోయే ట్వీట్ను కేజ్రీవాల్ చేసిన సంగతి తెలిసిందే. మెడికల్గా ఈ వ్యాధి బారిన పడి ఎవరు మరణించడం లేదని, మీడియా మాత్రమే చికెన్ గున్యాతో మరణాలు సంభవిస్తున్నాయని ప్రచారం చేస్తుందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తప్పించుకుంటున్నారు. చికెన్ గున్యా కేసులపై విచారణకు ఆదేశించినట్టు పేర్కొంటున్నారు.    
    

Advertisement

తప్పక చదవండి

Advertisement