పాలిటెక్నిక్‌లలో 13 వేల సీట్లు ఖాళీ! | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌లలో 13 వేల సీట్లు ఖాళీ!

Published Sun, Jun 12 2016 2:12 AM

13 thousand empty seats in the Polytechnic

- ముగిసిన తొలిదశ కౌన్సెలింగ్
- జూలైలో రెండో దశ కౌన్సెలింగ్
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్యలో పాలిటెక్నిక్  సీట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో కలిపి మొత్తం 50,632 సీట్లు ఉండగా... 37,467 మంది (74 శాతం) అభ్యర్థులు మాత్రమే తమకు కేటాయింపు జరిగిన కాలేజీల్లో ప్రవేశం పొందారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 97.84 శాతం మంది అభ్యర్థులు రిపోర్టు చేయగా, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో చేరింది 66.53 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో ఉన్న రెండు ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల్లో మాత్రం సీట్లు పొందిన వారంతా (100శాతం) చేరారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 205 పాలిటెక్నిక్ కాలేజీల్లో 13,165 సీట్లు ఖాళీగా మిగిలిపోనున్నాయని అధికార వర్గాల సమాచారం.

 పాలిసెట్-2016లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సాంకేతిక విద్యా మండలి గత నెల 20 నుంచి నిర్వహించిన తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొత్తం 45,644 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. అయితే కాలేజీలో చేరేందుకు చివరి రోజైన శనివారం నాటికి 37,467 మంది మాత్రమే ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేశారు.

 వచ్చే నెల రెండో వారంలో..
 పాలిసెట్ రెండోదశ కౌన్సెలింగ్‌ను జూలై రెండో వారంలో చేపట్టే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. పాలిసెట్‌లో ర్యాంకులు పొందిన కొందరు అభ్యర్థులు పదో తరగతిలో ఫెయిల్ కావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయినట్లు అంచనా. జూలై 10గా టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన ్నందున రెండో వారంలో రెండోదశ కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు సాంకేతిక విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో మిగిలిపోయిన సీట్లన్నీ రెండోదశలో భర్తీ అవుతాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఇక సాంకేతిక విద్యామండలి పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీలన్నింటిలో ఈ నెల 9 నుంచే తరగతులు ప్రారంభమైనట్లు కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement