హైదరాబాద్ : నగర శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని లక్ష్మీగూడ మద్దికుంట చెరువులో సుమారు లక్ష రూపాయల విలువైన చేపలు గురువారం మృత్యువాత పడ్డాయి. గత కొన్నేళ్లుగా స్థానిక మత్స్యకారులు చెరువులో చేపలు పెంచి వాటిని పట్టి విక్రయించి... జీవనం సాగించేవారు. మృగశిర కార్తె కావడంతో చేపలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది.
ఈ నేపధ్యంలో గురువారం ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు షాక్కు గురయ్యారు. చేపలన్నీ మృతి చెంది నీటిపై తేలడంతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అన్ని చేపలు ఒక్కసారిగా మృతి చెందడంపై వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీటిలో ఆగంతకులు విషం కలిపి ఉంటారని భావిస్తున్నారు. ఈ మేరకు మత్స్యకారులు మైలార్దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.