సాగర్ నుంచి పాలేరు దాకా.. | Sakshi
Sakshi News home page

సాగర్ నుంచి పాలేరు దాకా..

Published Sun, Aug 14 2016 1:36 AM

సాగర్ నుంచి పాలేరు దాకా.. - Sakshi

* నీటి లభ్యతను బట్టి సాగునీరివ్వాలని తీర్మానం
* నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు నీరు విడుదల చేయాలని నిర్ణయం
* ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, విడుదలపై హరీశ్‌రావు సమీక్ష

సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు నీరు విడుదల చేయాలని మంత్రుల బృందం తీర్మానించింది. అలాగే నీటి లభ్యతను బట్టి పాలేరు వరకు సాగునీరివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డుతో సంప్రదింపులు జరపాలని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.

నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, నీటి వినియోగంపై శనివారం నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు నేతృత్వంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డితో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని 12 మధ్య తరహా ప్రాజెక్టులు, వరంగల్ జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై మంత్రుల బృందం సుదీర్ఘంగా సమీక్షించింది.
 
దిగువ మానేరు ఆయకట్టుకు: దిగువ మానేరు డ్యాంలో ప్రస్తుతం నీటి లభ్యతను అంచనా వేసి డ్యాం ఎగువ ప్రాంతాల్లోని పరిమిత ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని హరీశ్ ఆదేశించారు. అలాగే లోయర్ మానేరు డ్యాం దిగువ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచిం చారు. వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లాలోని 12 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేసి 95 వేల ఎకరాలకు నీరివ్వాలని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని కాల్వల పనులను ఆగస్టు నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు. నాగార్జునసాగర్ పరిధిలో గతం లో ఏటా రూ.60 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లిం చగా, ప్రస్తుతం ఆ భారాన్ని రూ.5 కోట్లకు పరిమితం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా చెరువు లు నింపే అవకాశాలపై కూడా సమీక్షించారు.
 
రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి
ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉండటంతో జలాశయాల్లో చేరుతున్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని హరీశ్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, విడుదలపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, విజయప్రకాశ్, కాడా కమిషనర్ మల్సూర్, ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, సీఈలు సునీల్, ఖగేందర్‌రావు, భగవంతరావు, వెంకటేశ్వర్లు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement