'చంద్రబాబు గురించి ఎన్టీఆరే చెప్పారు' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు గురించి ఎన్టీఆరే చెప్పారు'

Published Mon, Jun 6 2016 4:44 PM

'చంద్రబాబు గురించి ఎన్టీఆరే చెప్పారు' - Sakshi

హైదరాబాద్: రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన గొప్పతనం ఏంటో ఎన్టీఆర్ మాటలు వింటే తెలుస్తుందని వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు. 'వాడు ఔరంగజేబు వారసుడు' అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారంటే చంద్రబాబు వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతోందన్నారు. రాజకీయ వనంలో గంజాయి మొక్క చంద్రబాబు అని అన్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబుపై వచ్చినన్ని ఆరోపణలు ఎవరిపై రాలేదన్నారు. చంద్రబాబు రాజకీయమంతా కుట్రలు, హత్యలేనని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలనడం అభివృద్ధిని అడ్డుకోవడమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నా ప్రజల తరపున ఆయన పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. ప్రజల బాధలు జగన్ గొంతులో వినిపిస్తున్నాయని అన్నారు. తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే చంద్రబాబుపై జగన్ మోహన్ రెడ్డి యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు.

కేసీఆర్ కు భయపడే చంద్రబాబు విజయవాడకు పారిపోయారని ఎద్దేవా చేశారు. సచివాలయం పూర్తికానున్నా ఉద్యోగులు రావాల్సిందేనని బెదిరిస్తున్నారని ఆరోపించారు. జగన్ ను బలహీనపరిచేందుకు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు రాజకీయ కుట్రను ఛేదించేవరకు జగన్ నిద్రపోరు, నిద్రపోనివ్వరని భూమన చెప్పారు.

Advertisement
Advertisement