బొంకుతున్న బంకులు | Sakshi
Sakshi News home page

బొంకుతున్న బంకులు

Published Fri, Oct 14 2016 9:30 PM

Bonkutunna bankulu

సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్‌లో పెట్రో బంక్‌లు మళ్లీ బొంకుతున్నాయి. కొలతల్లో దగా, నాణ్యతలో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను నిలువునా దోచేస్తున్నారు. బంకులపై గత కొన్ని నెలలుగా తనిఖీలు లేకపోడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సంబంధిత పౌరసరఫరాల, తూనికల కొలతల శాఖాధికారులు నిద్రవస్థలో జోగుతున్నారు. కేవలం బంకుకు స్టాంపింగ్‌ సమయంలో తప్ప పరిశీలించిన దాఖలాలు కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం స్పెషల్‌ ఆపరేషన్‌ టీం(ఎస్‌వోటీ) పోలీసులు, తూనికల కొలత శాఖ వేర్వేరుగా దాడులు నిర్వహించి బట్టబయలు చేసిన పెట్రో అధునిక సాంకేతిక మోసాల కథ కంచికి చేరింది. అప్పట్లో కొన్ని పెట్రోల్, డీజీల్‌ బంకులు యాజమాన్యాలు ఫిల్లింగ్‌ మిషన్ల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక చిప్‌లు అమర్చి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా మీటర్‌ రీడింగ్‌ను జంపింగ్‌ చేస్తూ దొరికిపోగా, మరికొందరు సాక్షాత్తు ప్రధాన ఆయిల్‌ కంపెనీలు సరఫరా చేసిన రిమోట్‌ ద్వారా ఆయిల్‌ పంపింగ్‌ కంట్రోల్‌ చేస్తూ దొరికి పోవడం సంచలనం సృష్టించింది. ఆయిల్‌ కంపెనీలు సరఫరా చేసిన ఫిల్లింగ్‌ మిషన్‌ మోడల్‌ను తప్పుబట్టి నోటీసులు జారీ చేసి హడావుడి సృష్టించిన  అధికారులు చివరకు కాంపౌండింగ్‌తో సరిపెట్టడం విస్మయానికి గురిచేస్తోంది.


లీటర్‌కు 10 ఎంఎల్‌ నొక్కేస్తారు
పెట్రోల్‌ బంకుల్లో డీలర్లు ప్రతి లీటర్‌కు సగటున  8 నుంచి 20 ఎంఎల్‌ వరకు తక్కువగా పంపింగ్‌ జరగడం సర్వసాధారణంగా  మారింది. తూనికల,కొలతల శాఖ నిబంధనల ప్రకారం ఐదు లీటర్లలో 25 ఎంఎల్‌ వరకు తక్కువగా ఉండవచ్చు. కానీ ప్రతి లీటర్‌లో తక్కువగా పంపింగ్‌ జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


యథేచ్చగా కల్తీలు...
నాన్‌ ఎలక్టాన్రిక్‌ పెట్రోల్‌ బంకుల్లోనే కల్తీ జరుగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఎలక్టాన్రిక్‌ బంకులుæఆయిల్‌ కంపెనీల ప్రధాన యూనిట్లకు అనుసంధానమై ఉండటంతో  కల్తీకి అస్కారం లేకుండా పోయింది. ఒక వేళ కల్తీ జరిగినా..రీడింగ్, డెన్సిటీ ద్వారా బయటపడుతోంది. దీంతో నాన్‌ ఎలక్టాన్రిక్‌ పెట్రోల్‌ బంక్‌ల్లోనే ఈ వ్యవహరం సాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ట్యాంకర్ల కొద్ది టిన్నర్, నాఫ్త ఆయిల్, కిరోసిన్‌  సరఫరా జరుగడం ఇందుకు బలం చేకూర్చుతోంది..సాధారణంగా నిత్యం 25 వేల లీటర్ల పెట్రోల్, 40 వేల లీటర్ల డీజిల్‌ఆయిల్‌ను విక్రయించే బంకులు పూర్తి స్థాయి ఎలక్టాన్రిక్‌గా మారాల్సి ఉంటుంది. ఆయితే మహానగరంలో అనేక బంకుల్లో సెల్స్‌ ఉన్నా... పూర్తి స్థాయి ఎలక్టాన్రిక్‌గా బంక్‌లుగా మార్పు జరగకపోవడం పలు అనుమానాలకు తావీస్తోంది.

Advertisement
Advertisement