ఆర్టీసీకి కేంద్రం షాక్ | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి కేంద్రం షాక్

Published Sun, Apr 24 2016 12:52 AM

Central Shock to the RTC

‘జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం’లో వాటా 60 శాతానికి తగ్గించుకుంటున్నట్లు వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి కేంద్రం షాక్ ఇచ్చింది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద కొత్త బస్సుల కొనుగోలు వ్యయంలో కేంద్రం ఇప్పటివరకు 80 శాతం భరిస్తోంది. తాజాగా దాన్ని 60 శాతానికి తగ్గించింది. వెంటనే దీనిని అమలు చేయనున్నట్టు  ఆర్టీసీకి ఉత్తర్వులు పంపింది. తాజాగా కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ పట్టణాలను జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలో చేరుస్తూ కేంద్రం ఇటీవల 130 బస్సులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 60 బస్సులు ఇప్పటికే రాగా  మిగతావాటిని ఇవ్వనున్నట్టు ఇటీవలే పేర్కొంది.

ఆ మేరకు నిధులు కూడా మంజూరు చేసింది. కొత్త బస్సుల కొనుగోలులో తన వాటాను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ మూడు పట్టణాలకు మంజూరు చేసే నిధుల్లోనే వర్తింపజేయనున్నట్టు తాజాగా స్పష్టం చేయగా ఆర్టీసీ కంగుతిన్నది. ఈ 130 బస్సులకు రూ.48.5 కోట్లు అవసరం కాగా తన వాటాగా 20 శాతం భరిస్తే సరిపోతుందని ఆర్టీసీ ఇప్పటి వరకు భావించింది. కానీ తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో 40 శాతం భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద అన్ని నిధులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీని విస్మరిస్తూ ఆర్థిక సాయం చేయకుండా చేతులెత్తేసింది.

Advertisement
Advertisement