హైదరాబాద్: తమ మంత్రులపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా చంద్రబాబు మధ్యలో జోక్యం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ మంత్రులను వెనకేసుకొచ్చారు. అయితే అధికార రహస్యాలు వెల్లడించిన చంద్రబాబే దోషి అని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు.. ఓట్ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘించిన ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని దీనిపై విచారణ సిద్ధమా అని వైఎస్ జగన్ అని ప్రశ్నించారు. ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు తన ధోరణిలో ఎదురుదాడి చేశారు.
తమ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుపై విపక్ష నేత చేసిన ఆరోపణలను రుజువు చేయాలని లేకుంటే క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ విషయం తేలిన తర్వాత సభ ముందుకెళ్లాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు తానే కట్టాలన్న ఆశ లేదని, కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విపక్షాల మాదిరిగా బీజేపీ తమపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఎవరు ఆరోపణలు చేసినా పట్టించుకోబోమని, ప్రజలకు జవాబుదారీగా ఉంటామని చెప్పారు.
చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే...
- రాజధాని కట్టుకోవడానికి మన దగ్గర డబ్బుల్లేవు
- ల్యాండ్ పూలింగ్ కు రండని నేను పిలుపిస్తే 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు
- రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా విపక్షాలు విష ప్రచారం చేశాయి
- మా కేబినెట్ లోని ఇద్దరు మంత్రులపై ఆరోపణలు చేశారు
- ఈ ఆరోపణలు వాస్తవమని తేలితే మంత్రులను తొలగిస్తా
- బట్టకాల్చి మీద వేయడం కాదు
- జాగ్రత్తగా ఉండండి, తమాషాలు పోవద్దు
- ఎలాంటి ఎంక్వైరీలు ఉండకూడదనే నీతి నిజాయితీగా బతుకుతున్నా
- ఎవరు నా బినామీలో ప్రూవ్ చేయాలని సవాల్ చేస్తున్నా
- 'సాక్షి' ప్రజాధనంతో పెట్టిన పేపర్
- తప్పకుండా ఆ ఆస్తి తీసుకుంటాం, వదిలిపెట్టే సమస్యలేదు
- పోలవరం నేను కట్టాలనే ఆశ లేదు, కేంద్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా
- బీజేపీ నేతలు కూడా ప్రతిపక్షాలు మాదిరిగా విమర్శలు చేయడం సరికాదు
- మంత్రులిద్దరిపై చేసిన ఆరోపణలు రుజువయ్యాకే సభ జరగాలి
- రుజువు చేయాలి లేకుంటే క్షమాపణ చెప్పాలి
- ఆ రెండు విషయాలు తేల్చిన తర్వాతే ముందుకెళ్లాలి