ఏపీఎన్‌జీవో హోం ఆస్తులను అమ్మేందుకు కుట్ర! | Sakshi
Sakshi News home page

ఏపీఎన్‌జీవో హోం ఆస్తులను అమ్మేందుకు కుట్ర!

Published Tue, Nov 18 2014 1:22 AM

Conspiracy to sell assets APNGO Home

హెచ్‌టీఎన్‌జీవో నేతల ఆరోపణ  
నేడు మహాధర్నా

 
సాక్షి, హైదరాబాద్:
హైదరాబాద్‌లోని ఏపీఎన్‌జీవో హోంకు చెందిన భవనాలు, భూమిని విక్రయించేందుకు కుట్ర చేస్తున్నారని, అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఏపీఎన్‌జీవో నుంచి విడిపోయిన హైదరాబాద్ తెలంగాణ ఎన్‌జీవో అసోసియేషన్ (హెచ్‌టీఎన్‌జీవో) ఆరోపించింది. ఈ ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. గచ్చిబౌలిలోని ఏపీఎన్ జీవోల కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలం అభివృద్ధి విషయంలో రూ. 18 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగిందని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.

సోమవారం హైదరాబాద్‌లోని ఏపీఎన్‌జీవో హోం ఆవరణలో ఈనెల 11 నుంచి ఉద్యోగులు చేస్తున్న ధర్నాను ఉద్దేశించి హెచ్‌టీఎన్‌జీవో అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి బలరాం, అసోసియేట్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ, హోం ఆస్తుల విక్రయాన్ని అడ్డుకోవాలని కోరుతూ మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలువనున్నట్లు తెలిపారు. అలాగే ఏపీఎన్‌జీవో హోం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement