Sakshi News home page

రంగంలోకి కోర్టు అధికారి.. 

Published Wed, Jan 24 2018 1:46 AM

Court officer in the field - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫుట్‌పాత్‌లపై వెలుస్తున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో తమ అధికారులనే హైకోర్టు రంగంలోకి దిగింది. హైదరాబాద్‌ సిద్ది అంబర్‌బజార్, మహబూబ్‌గంజ్‌లలో ఆక్రమణల పరిశీలనకు న్యాయాధికారిని నియమించాలని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ (ఎంఎస్‌జే)ను ఆదేశించింది. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని న్యాయాధికారికి స్పష్టం చేసింది. న్యాయాధికారికి అన్ని రకాల సహాయ, సహకారాలు అందించాలని పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది.

తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజ్‌ గంగారావుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిఅంబర్‌ బజార్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో లక్ష్మీనివాస్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. మంగళవారం మరో సారి విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను కమిటీ తొలగించిందని తెలిపారు.  

కంటితుడుపుగా వ్యవహరిస్తున్నారు...: పిటిషనర్‌
అధికారులు కంటితుడుపుగా వ్యవహరిస్తున్నారని, ఆక్రమణలు అలాగే కొనసాగుతున్నాయని పిటిషనర్‌ లక్ష్మీనివాస్‌ కోర్టుకు ఫోటోలు చూపించారు. ఆక్రమణలు చేయబోమని కోర్టుకు హామీ ఇచ్చి న షాపుల యాజమానులు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని నివేదించారు. కొంత మంది దుకాణదారులు, స్థానిక పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తనను బెదిరిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న 4 షాపుల యజమానులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని అధికారులను ఆదేశించింది.  

Advertisement
Advertisement