‘కీలాగే’స్తారు! | Sakshi
Sakshi News home page

‘కీలాగే’స్తారు!

Published Tue, Feb 2 2016 1:29 AM

‘కీలాగే’స్తారు!

కీ లాగర్స్ సాఫ్ట్‌వేర్ ప్రయోగిస్తున్న సైబర్ క్రిమినల్స్
‘నెట్ బ్యాంకింగ్ హ్యాకింగ్’
ఈ పంథాలోనే  దేశ వ్యాప్తంగా నేరాలు చేసిన ఘరానా గ్యాంగ్

 
సిటీబ్యూరో:  కంప్యూటర్ ఆధారంగా చేసే సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ కోవలోనిదే ‘కీ లాగర్స్’. ఎదుటి వ్యక్తుల డేటాను చోరీ చేయ డం దీని ప్రత్యేకత. ఈ పంథాలో నగరానికి చెందిన ఓ బాధితుడి నుంచి రూ.8 లక్షలు స్వాహా చేసిన ముఠాను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు గత నెల లో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన విషయం విదిత మే. దేశ వ్యాప్తంగా మోసాలు చేసిన ఈ ముఠాకు చెంది న మరో నలుగురి కోసం పోలీసులు వేటాడుతున్నారు.

 ఏమిటీ కీ లాగర్స్?
 ఇంటర్‌నెట్‌లో విరివిగా లభిస్తున్నదే ఈ కీ లాగర్స్ సాఫ్ట్‌వేర్. సైబర్ నేరగాడు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని తాను కోరుకున్న కంప్యూటర్‌లో నేరుగా ఇన్‌స్టల్ చేస్తాడు. పరి చయస్తుల పర్సనల్ కంప్యూటర్‌ను ఒకసారి విని యోగించుకోవడానికి తీసుకుని అదును చూసి దీన్ని ఇన్‌స్టల్ చేస్తాడు. అలాగే, ఎవరికైనా జోక్స్, బొమ్మలు, ఉద్యోగావకాశాలంటూ ఈ-మెయిల్ పంపడం ద్వారా నూ అవతలి వ్యక్తి కంప్యూటర్‌లో ఇన్‌స్టల్ అయ్యేలా చేస్తాడు. ఆవిషయం మెయిల్‌ను క్లిక్ చేసిన వ్యక్తికి కూడా తెలీదు. ఒకసారి కీ లాగర్స్ కంప్యూటర్‌లో ఇన్‌స్టల్ అయితే... ఆ కంప్యూటర్‌ను వినియోగించే వ్యక్తి చేసిన ప్రతి కార్యకలాపం సైబర్ నేరగాడి   ఈ-మెయిల్ ఐడీకి చేరిపోతుం ది. చివరకు కీ బోర్డులో ఒక్క బటన్ నొక్కినా ఆ వివరాలు పూర్తిగా సైబర్ నేరగాడికి ఈ-మెయిల్ రూపంలో చేరిపోతాయి. వీటి ద్వారా వ్యక్తిగత సమాచారమైన  ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్, యూజర్ నేమ్స్ తదితరాలు నేరగాళ్లకు అందుతాయి. వీటిని విని యోగించి సైబర్ నేరగాళ్లు అవతలి వ్యక్తి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు. అంతేకాకుండా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజడంతో పాటు దుశ్చర్యలకు పాల్పడతారు.

అప్రమత్తత అవసరం...
ఇంటర్‌నెట్‌లో కీ లాగర్స్ తరహా సాఫ్ట్‌వేర్‌లు అనేకం అందుబాటులో ఉన్నాయి. వీటి బారి న పడకుండా ఉండాలంటే వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అపరిచిత చిరునామాల నుంచి వచ్చే ఈ-మెయిల్స్‌ను వెంటనే డిలీట్ చేయాలి. మొబైల్ ఫోన్‌కు వచ్చే అన్ని ఎస్‌ఎమ్మెస్‌లకు సైతం స్పందించకూడదు. సైబ ర్ కేఫ్‌ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్‌నెట్ బ్యాం కింగ్ వంటి కీలక లావాదేవీలు చేయరాదు. పర్సనల్ కంప్యూటర్స్‌లో అత్యాధునికమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నమ్మకస్తులైన వారికి మాత్రమే పర్సనల్ కంప్యూటర్ వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలి. సైబర్ కేఫ్‌ల యజమానులు ఎప్పటికప్పుడు తమ కేఫ్‌లోని సిస్టమ్స్‌ల్లోని సాఫ్ట్‌వేర్స్‌ను పరీక్షిస్తుండాలి. ఈ తరహా సైబర్ నేరగాళ్లలో విద్యాధికులే ఎక్కువగా ఉంటున్నారు. వీరు పట్టుబడటం కూడా చాలా కష్టం.
 
‘నీలం’ రంగులో ఉంటాయి
 సాధారణంగా మెయిల్‌లో వచ్చే కీలాగర్స్ లింకులు నీలం రంగులో ఉంటాయి. అపరిచిత ఈ-మెయిల్స్ లో ఇలాంటి లింక్స్ ఉంటే వాటి జోలికి పోకపోవడం ఉత్తమం. ఆ లింకును కాపీ చేసి యూఆర్‌ఎల్ బార్‌లో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే ఈ-మెయిల్ అసలుదా? నకిలీదా తెలుసుకునే అవకాశం ఉంటుంది. - వీపీ తివారీ, సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్

Advertisement
Advertisement