ప్రగతిపథంలో పాడి పరిశ్రమ: భూమారెడ్డి | Sakshi
Sakshi News home page

ప్రగతిపథంలో పాడి పరిశ్రమ: భూమారెడ్డి

Published Sat, Feb 24 2018 1:53 AM

Dairy Industry in Progress: Bhoomara Reddy - Sakshi

హైదరాబాద్‌: పాడి పరిశ్రమాభివృద్ధికి పటిష్టమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(విజయ డెయిరీ) చైర్మెన్‌ లోక భూమారెడ్డి చెప్పారు. విజయ డెయిరీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ లాలాపేటలోని కార్యాలయంలో ఆయనను అధికారులు, ఉద్యోగులు అభినందించారు. ఏడాదికాలంలో పాల ఉత్పత్తిదారుల సంఖ్యను 44,432 నుంచి 67,259 వరకు, పాల సేకరణను 3,10,000 నుంచి 4 లక్షల లీటర్ల వరకు పెంచామని ఆయన చెప్పారు.

డెయిరీలో ఖాళీగా ఉన్న 110 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి సాధించామని, ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ చర్యలు తీసుకుంటోందని వివరించారు. కారుణ్య నియామకాల కింద 20 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఢిల్లీ, ముంబైలో విజయ పాల ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యాన్ని కల్పించామని  పేర్కొ న్నారు. సంస్థ టర్నోవర్‌ను రూ.650 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు పెంచాలనే ఉద్దేశంతో పాలను, పాల ఉత్పత్తులను అధికంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. పార్లర్ల సంఖ్యను 150 నుంచి వెయ్యి వరకు పెంచుతున్నట్లు తెలిపారు. హరితహారంలో విజయ పాడి రైతులను భాగస్వామ్యం చేశామన్నారు.

Advertisement
Advertisement