ఏం చేసినా ‘సింగపూర్’ కోసమే! | Sakshi
Sakshi News home page

ఏం చేసినా ‘సింగపూర్’ కోసమే!

Published Thu, Oct 27 2016 1:20 AM

Every thing about singapore itself

- కొత్త నోటిఫికేషన్ ప్రతిపాదన కూడా ఓ డ్రామా..
- ఆది నుంచీ ఆ దిశగానే ముఖ్యమంత్రి చర్యలు
- ముందుగా కుదిరిన ఒప్పందాల మేరకే నిర్ణయాలు
- అందుకు అనుగుణంగానే చట్ట సవరణలు, ఆర్డినెన్స్
 
 సాక్షి, హైదరాబాద్:  స్విస్ చాలెంజ్ విషయంలో  రాష్ర్టప్రభుత్వం వెనక్కి తగ్గిందా? న్యాయస్థానం పలుమార్లు అక్షింతలు వేయడం, అనేక తప్పులు ఎత్తి చూపడం వల్ల రాష్ర్టప్రభుత్వం మనసు మార్చుకుందని భావించవచ్చా? గత నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పినంత మాత్రాన స్విస్ చాలెంజ్ ప్రమాదం తొలగిపోయినట్లేనా? ఎంతమాత్రమూ లేదని అధికార వర్గాలంటున్నాయి. మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ర్టప్రభుత్వం హైకోర్టుకు నివేదించడం కూడా ఓ డ్రామాయేనని, స్విస్‌చాలెంజ్‌ను కానీ, సింగపూర్ కంపెనీల కన్సార్టియంను కానీ వదులుకునే ఆలోచనే ప్రభుత్వానికి లేదని అధికారులు అంటున్నారు. కొత్త రాజధాని అమరావతిలో సింగపూర్ కంపెనీలతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. అందుకే ఒకవైపు న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే హడావిడిగా  స్విస్ చా లెంజ్ అమలు కోసం ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు.

 కొత్త నోటిఫికేషన్ ఓ డ్రామా..
 స్విస్ చాలెంజ్ విషయంలో విచారణ సందర్భంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని ్టప్రభుత్వం చెప్పడం ఓ పెద్ద నాటకమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్ అంటే కేవలం సింగపూర్ కంపెనీలు చేసిన ప్రతిపాదనలను కొనసాగింపునకే తప్ప మరొకటి కాదని, ఈ కారణంగా సింగపూర్ కంపెనీలతో దాపరికం, రహస్య అవగాహనలన్నీ అలాగే ఉంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. స్విస్ చాలెంజ్ మౌలిక సూత్రాలను, నిబంధనలను కూడా తుంగలో తొక్కి సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో నేరుగా సీఎంతో పాటు మంత్రుల కమిటీ సంప్రదింపులు జరిపారు. వాటిలో నీకెంత నాకెంతనే రహస్య అవగాహన కుదిరిందని, అందుకే ఆ కంపెనీలను సీఎం వెనకేసుకు వస్తున్నారని అధికార వర్గాలు కోడై కూస్తున్నాయి.

 మౌలికసూత్రాలకు విరుద్ధం
 స్విస్ చాలెంజ్ మౌలిక సూత్రాల ప్రకారం.. చేపట్టే ప్రాజెక్టుతో ఎటువంటి సంబంధం లేని, ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వని... ప్రాజెక్టుకు సంబంధించి ఏ సంస్థ అయినా తమంతట తాము ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంది.వీటిరి సీఆర్‌డీఏ పరిశీలించిన తరువాత, గత చట్టం ప్రకారం సీఎస్ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి వెళ్లాలి. అందుకు పూర్తి విరుద్ధంగా సీఆర్‌డీఏ పరిశీలించిన తరువాత పలు సార్లు సింగపూర్ కంపెనీలతో సీఎం సంప్రదింపులు జరిపిన తరువాత మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన తరువాత ఆ ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులను సూచిస్తూ ఏకంగా సీఎం ఆమోదంతరువాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి పంపించారు. పూర్తి రివర్స్‌లో సాగిన దీన్ని చూసి సీఎస్ నేతృత్వంలోని అధారిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీఎం ఆమోదించాక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి ఎలా పంపుతారంది. అయినా కేబినెట్‌లో సింగపూర్  ప్రతిపాదనలు ఆమోదించారు.

 ముందుగానే ఒప్పందాలు...
 సింగపూర్ కంపెనీలతో ముందుగానే ముఖ్యమంత్రి సంప్రదింపులు జరిపి అన్ని ‘అవగాహనలు’ కుదిరిన తరువాత ఇక స్విస్ చాలెంజ్ ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు స్విస్ చాలెంజ్ అనేదానికే అర్ధం ఉండదనేది అధికారుల అభిప్రాయం. సింగపూర్ ప్రభుత్వంతో జీ టు జీకి మాత్రమే కేంద్రం అనుమతించింది. కేంద్రానికి టోకరా వేస్తూ సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో బాబు ఒప్పందాలు చేసుకున్నారు. పైగా కొలిక్కి రాని అనేక ఆర్థిక పరమైన అంశాలను  చంద్రబాబు ఈ ఏడాది జూన్ 7వ తేదీన స్వయంగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్, సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి పరిష్కరించారని స్పష్టంగా మంత్రుల కమిటీ మినిట్స్‌లో పేర్కొన్నారు.. ‘‘అసలు కొలిక్కి రాని ఆర్థిక పరమైన అంశాలపై బాబు ఏమి మాట్లాడారు? సింగపూర్ కంపెనీల ప్రతినిధులు ఏమి చెప్పారు? ఇరువురు మధ్య ఏ ఒప్పందం జరిగింది?’’ వంటి విషయాలన్నీ చాలెంజ్ చేసే ఇతర సంస్థలకు కూడా తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement