Sakshi News home page

చిన్నారి అపహరణ...విడుదల

Published Mon, Jan 19 2015 9:30 AM

girl abducted for gold

హైదరాబాద్: బాలికను కిడ్నాప్ చేసి... చెవి పోగులు, కాళ్ల పట్టాలు తీసుకొని వదిలేసిన ఘటన కాప్రా జమ్మిగడ్డలో కలకలం సృష్టించింది. జవహర్ నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.... జమ్మిగడ్డ భరత్ నగర్ లో ఉండే దారావత్ రాజు, స్వరూప దంపతుల కుమార్తె ధృతి (5). స్థానిక హిందూ బ్రిలియంట్ స్కూల్ లో ఎల్కేజీ చదువుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తన ఇంటి ముందు ఆడుకుంటున్న ధృతి వద్దకు ఓ మహిళ వచ్చి తనతో వస్తే చాక్లెట్ కొనిస్తానని చెప్పి...ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని సాకేత్ సమీపంలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ వద్దకు తీసుకు వెళ్లింది. అక్కడ ఓ గల్లిలో బాలిక చెవులకు ఉన్న 2 గ్రాముల బంగారు పోగులు, 5 తులాల కాళ్లపట్టీలను తీసుకుని పారిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే పోలీసులు సమీప ఠాణాలకు సమాచారం ఇచ్చారు. రాత్రి 7.20కి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కుషాయిగూడ పోలీసులకు సాకెత్ వద్ద చిన్నారి ధృతి ఏడుస్తూ కనిపించగా వారు జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా బాలికను అపహరించిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

Advertisement
Advertisement