కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసే వారికి సాధారణ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. డీసీసీ అధ్యక్షులుగా కొనసాగాలనుకునే నేతలు ఇకపై పార్టీ బలోపేతానికే పనిచేయాలని స్పష్టం చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులను కట్టబెట్టాలని నిర్ణయించింది. పార్టీ సంస్కరణల్లో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న డీసీసీ అధ్యక్షులు పార్టీని బలోపేతం చేయడంకన్నా తాము పోటీ చేయబోయే నియోజకవర్గాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుండటంతో జిల్లాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో కార్యక్రమాలను అమలు చేయలేకపోతోందని అధిష్టానం అభిప్రాయపడింది. 31 జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకానికి పీసీసీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ నిర్ణయం నేతలకు ఇబ్బందికరంగా మారనుంది.