హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే కార్పొరేటర్ అభ్యర్థుల ఎన్నికల వ్యయపరిమితిని రూ. 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఆయా రాజకీయ పార్టీల నుంచి అందిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లలో వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థుల వ్యయపరిమితిని రూ.లక్షన్నరకు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 6,511 మంది సిబ్బందిపై క్రిమినల్ చర్యలు చేపట్టడానికి నోటీసులు జారీ చేయాలని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ బి.జనార్ధన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖకు లేఖలు రాయాలని, అలాగే సంబంధిత ఉద్యోగుల హెచ్ఓడీలకు కూడా లేఖలు రాయాలని సూచించారు. గైర్హాజరైన వారికి తిరిగి జనవరి 4,5 తేదీల్లో శిక్షణ ఇచ్చేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.