'ప్లీనరీకి ముఖ్యమంత్రిగా వెళ్లొద్దు' | Sakshi
Sakshi News home page

'ప్లీనరీకి ముఖ్యమంత్రిగా వెళ్లొద్దు'

Published Fri, Apr 22 2016 1:55 PM

'ప్లీనరీకి ముఖ్యమంత్రిగా వెళ్లొద్దు' - Sakshi

హైదరాబాద్ : ఖమ్మం నగరంలో ఈ నెల 27న టీఆర్‌ఎస్ నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, బహిరంగ సభలకు ఎలక్షన్ కమిషన్ అనుమతించింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో టీఆర్‌ఎస్ కార్యక్రమాలకు ఎన్నికల నియమావళి వర్తించనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో పార్టీ కార్యక్రమాల కోసం ముందు నుంచే ఏర్పాట్లు చేశామని, ఇప్పటికిప్పుడు మరో చోటకు తరలించడం సాధ్యం కాదని, ఖమ్మంలోనే నిర్వహించుకునేందుకు అనుమతించాలంటూ.. మంత్రి కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని లేఖ ద్వారా కోరిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం ఈ నెల 27న ఖమ్మంలో సభ, ప్లీనరీ నిర్వహణకు షరతులతో అనుమతించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి లేఖ ద్వారా శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమాలకు అయ్యే ఖర్చునంతా పార్టీ తరఫున వెచ్చించాలని, ప్రజా ధనాన్ని ఖర్చు చేయరాదని ఈసీ పేర్కొంది. అలాగే అధికార యంత్రాంగాన్ని వాడరాదని, ముఖ్యమంత్రి, మంత్రులు అధికార హోదాలో ఈ కార్యక్రమానికి హాజరుకావొద్దని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు షరతులతో అనుమతిస్తున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement