పౌరసత్వ రద్దు నిర్ణయాన్ని కొట్టేయండి | Sakshi
Sakshi News home page

పౌరసత్వ రద్దు నిర్ణయాన్ని కొట్టేయండి

Published Sat, Sep 9 2017 3:38 AM

పౌరసత్వ రద్దు నిర్ణయాన్ని కొట్టేయండి - Sakshi

- హైకోర్టులో చెన్నమనేని రమేశ్‌ పిటిషన్‌
కేంద్ర హోంశాఖది ఏకపక్ష నిర్ణయమని ఆరోపణ
 
సాక్షి, హైదరాబాద్‌: వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదం మరోసారి హైకోర్టుకు చేరింది. తన పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ రమేశ్‌ కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరారు. భారత పౌరసత్వ చట్టం– 1955లోని సెక్షన్‌ 10(1) ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో.. ప్రతివాదులుగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి/ సంయుక్త కార్యదర్శి, తెలంగాణ హోంశాఖ కార్యదర్శి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ను పేర్కొన్నారు.

తనకు పౌరసత్వం ఇచ్చిన తర్వాత 30 రోజుల్లో మాత్రమే అభ్యంతరాలు చెప్పాలని భారత పౌరసత్వ చట్టం చెబుతోందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్‌ 5(1) ప్రకారం తనకు పౌరసత్వం వచ్చిందని, అయితే తనపై వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ చాలా ఆలస్యంగా ఫిర్యాదు చేశారన్నారు. దానిపై కేంద్ర హోంశాఖ స్పందించిందని పేర్కొన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యలకు పాల్పడినప్పుడు మాత్రమే పౌరసత్వం రద్దు చేసే వీలుందని, అయినా కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆది శ్రీనివాస్‌ ఫిర్యాదుపై కమిటీ విచారణ నివేదిక తనకు ఇవ్వలేదన్నారు. దేశంలో పుట్టి పెరిగి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన తర్వాత 1993లో అక్కడి పౌరసత్వం తనకు వచ్చిందన్నారు.

స్వాతంత్య్ర సమరయోధులైన తన తల్లిదండ్రుల ప్రజాసేవను స్ఫూర్తిగా తీసుకుని జర్మనీలో ఉంటూనే కరీంనగర్‌ జిల్లాలోని అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాల్ని చేపట్టానని, 2007లో తిరిగి భారత్‌కు వచ్చాక వాటిని కొనసా గిస్తూనే చట్టం ప్రకారం దేశ పౌరసత్వం పొందాన న్నారు. తనకు పౌరసత్వం ఇవ్వడం వల్ల ఏవిధంగా నష్టపోని, బాధితుడు కూడా కాని ఆది శ్రీనివాస్‌ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఫిర్యాదు చేశారన్నారు.

Advertisement
Advertisement