Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టు

Published Mon, May 30 2016 12:49 PM

అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టు - Sakshi

హైదరాబాద్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టయింది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సీపీయూలు వంటి దొంగతనాలకు పాల్పడటమే కాకుండా ఐఎంఈఐ నెంబర్ సైతం మార్చే చర్యలకు పాల్పడుతున్న ముఠాను బేగం బజార్ పోలీస్ స్టేషన్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి 25 మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్, సీపీయూతోపాటు ఐఎంఈఐ నెంబర్ ను మార్చే వ్యవస్థగల సాఫ్ట్ వేర్ను సొంతచేసుకున్నారు. మొత్తం ఐదుగురు ఈ కేసులో నిందితులుగా ఉండగా వారిలో ఒకరు జువెనైల్ కాగా ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నారు. వీరిలో ఏ 1గా బిహార్ కు చెందిన భూషణ్ కుమార్ అనే వ్యక్తి ఉండగా.. ఏ2గా జార్ఖండ్కు చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు.

రాము యాదవన్ అనే ఉత్తరప్రదేశ్కు చెందిన దొంగ కూడా ఇందులో ఉన్నాడు. అయితే, వీరికి సహకరిస్తున్న ఆరోపణలతో ఏ 5గా అబిడ్స్ లోని జగదీశ్ మార్కెట్ ఓ సాఫ్ట్ వేర్ షాప్కు చెందిన సుల్తాన్ (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు) అనే వ్యక్తి ఉన్నాడు. తొలుత విజయవాడ జైలు ఒకరినొకరు కలుసుకున్న రాము యాదవన్, భూషణ్‌ కుమార్ అనంతరం అతి కష్టం మీద విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు.

ఆ తర్వాత మొబైల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతూ వాటిని జగదీశ్ మార్కెట్ లోని సుల్తాన్కు చెందిన సాఫ్ట్ వేర్ షాపు ద్వారా ఐఎంఈఐ నెంబర్ మార్చి తిరిగి వాటిని తక్కువ రేట్లకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో అమ్మేవారు. తమకు ఛార్జీలకు డబ్బులు లేవని అబద్దాలు చెప్పి కొట్టుకొచ్చిన ఫోన్లు అమ్మేవారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, నిజామాబాద్, నాందేడ్ వంటి ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల దొంగతనాలకు వీళ్లు పాల్పడ్డారు.

Advertisement
Advertisement