వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు కేటీఆర్‌

Published Thu, Dec 28 2017 3:01 AM

ktr got World economic forum invitation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సుకు హాజరు కావాలంటూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆహ్వా నం అందింది. జనవరి 23–26 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు హాజరు కావాలని ఓ రాష్ట్ర మంత్రికి ఆహ్వానం లభించడం ఇదే తొలిసారి. ఏటా జరిగే ఈ సదస్సుకు 2,500 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రతినిధులు, ఆర్థికవేత్తలు హాజరవుతారు. సాధారణంగా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకే ఈ సదస్సుకు ఆహ్వానం దక్కుతుంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం పట్ల ఫోరం అభినందనలు తెలిపింది. ఇందుకు చురుగ్గా పనిచేసిన కేటీఆర్‌కు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం పంపుతున్నట్లు పేర్కొంది.

ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుంచి రానున్న పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో కేటీఆర్‌ సమావేశమవుతారని ఆయన కార్యాలయం తెలిపింది. కాగా, ఫోరం నుంచి ఆహ్వానం లభించడంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సు ద్వారా ప్రపంచం ముందు ఉంచుతామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్‌తో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ హాజరవుతారు. గతంలో చైనాలోని డాలియాన్లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు సీఎం కేసీఆర్‌ హాజరైన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement