మా అప్పీల్‌పై వాదనలు వినండి | Sakshi
Sakshi News home page

మా అప్పీల్‌పై వాదనలు వినండి

Published Tue, Apr 24 2018 2:15 AM

Listen to arguments on our appeal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ అంశంపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యేల తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ సోమవారం హైకోర్టును కోరారు. ఈ అప్పీల్‌పై వాదనలు వినడంతో పాటు విచారణార్హత తేల్చాలని కోర్టును కోరారు.

ఇందుకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతం అసెంబ్లీ జరగడం లేదని, అంత అత్యవసరం ఏముందని ప్రశ్నించింది. బహిష్కరణ తీర్మానంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మళ్లీ ఇక్కడ ఎలా పిటిషన్‌ దాఖలు చేస్తారని అడిగింది. ఈ విషయం పైనా వాదనలు వినిపిస్తామని, అందువల్లే వాదనలు వినాలని కోరుతున్నట్లు వైద్యనాథన్‌ చెప్పారు. అప్పీల్‌ దాఖలుకు అనుమతివ్వడంపై ఈ నెల 26న విచారణ చేపడతామని దర్మాసనం తెలిపింది.

Advertisement
Advertisement