► సంస్థాగతంగా పలు మార్పులు
► టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మరొకరికి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం గాంధీభవన్లో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయని అధిష్టానం విశ్వాసంతో ఉందన్నారు. పార్టీ విజయంకోసం రూపొందిస్తున్న ప్రణాళికలో భాగంగా సంస్థాగతంగా పలు మార్పులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ నెలాఖరులోపు ఏఐసీసీ, పార్టీ వర్కింగ్ కమిటీలో మార్పులు ఉంటాయన్నారు.
తెలంగాణ పార్టీ ముఖ్యుల్లో ఒకరికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అవకాశం వస్తుందన్నారు. ఏఐసీసీ ప్రధానకార్యదర్శిగా ఒకరికి, మరో ఇద్దరిని కార్యదర్శులుగా తెలంగాణ నుంచి నియమించనున్నట్టు ఉత్తమ్ చెప్పారు. అలాగే ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఒకరిని నియమిస్తారని తెలిపారు. రాష్ట్రపార్టీలోనూ మార్పులు ఉంటాయన్నారు. బూత్ కమిటీ స్థాయి నుంచి కార్యక్రమాలు, సమీక్ష వంటివాటికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. టీపీసీసీకి మరో కార్యనిర్వాహక అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తారని చెప్పారు. ఇకపై ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారన్నారు. మాజీ ఎంపీలు విజయశాంతి, అజహరుద్దీన్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ఒక ప్రచార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.