పగ్గాలివ్వండి.. మా పనేంటో చూపిస్తాం | Sakshi
Sakshi News home page

పగ్గాలివ్వండి.. మా పనేంటో చూపిస్తాం

Published Mon, Feb 1 2016 2:24 AM

పగ్గాలివ్వండి.. మా పనేంటో చూపిస్తాం - Sakshi

చివరి రోజు ప్రచారంలో ఎంపీ కవిత
 
 నాగోల్: ‘రాష్ట్ర పగ్గాలు ఇచ్చారు. అదే చేతులతో నగర పాలనా పగ్గాలూ టీఆర్‌ఎస్‌కు ఇవ్వండి. మా పనేంటో చూపిస్తాం. అభివృద్ధితో నగరాన్ని మెరిపిస్తా’మని ఎంపీ కవిత అన్నారు. నగర మేయర్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. గతంలో మేయర్‌గా పనిచేసిన వారు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. పార్టీ నాగోల్ డివిజన్ అభ్యర్థి చెరుకు సంగీతకు మద్దతుగా ఆదివారం బండ్లగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..‘18 నెలల్లోనే సీఎం కేసీఆర్ అనేక సమస్యలు పరిష్కరించారు. గ్రేటర్ పగ్గాలనూ ఆయనకు అప్పగిస్తే నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తారన్నా’రు. ‘గతంలో పాలకులు నగరాన్ని అభివృద్ధి చేయలేదు. మళ్లీ ఓటు వేయమని ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు.

కుండ మోయలేని వారు బండను ఎలా మెస్తార’ని విమర్శించారు. డివిజన్‌లో అనేక సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 96/1 సర్వే నెంబర్‌లో గుడిసెవాసులకు ఆమోద యోగ్యమైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. సర్వే నెంబర్ 58లోని భూమి రిజిస్ట్రేషన్ కాలేదని, సీఎం సహాయంతో ఆ పట్టాలు కూడా ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. బండ్లగూడ, నాగోలు చెరువును మిషన్ కాకతీయ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తామన్నారు. సభలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆటాపాట ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అభ్యర్థి చెరుకు సంగీత, రాష్ట్ర నాయకులు మల్లేశం, అనంతుల యాదగిరిరెడ్డి, నాగోలు సుధాకరాచారి, చెరుకు ప్రశాంత్, కట్టా ఈశ్వరయ్య, వస్పరి శంకర్, మెట్టు రవీందర్‌గౌడ్, గోల్కొండ మైసయ్య, డప్పు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
 
 గత పాలకులు నగరాన్ని ఏం అభివృద్ధి చేయలేదు. మళ్లీ ఓటు వేయమని ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు. కుండ మోయలేని వారు బండను ఎలా మోస్తారు

Advertisement

తప్పక చదవండి

Advertisement