Sakshi News home page

రూపాయికే నల్లా కనెక్షన్!

Published Fri, Mar 4 2016 2:12 AM

రూపాయికే నల్లా కనెక్షన్!

జీహెచ్‌ఎంసీ మినహా ఇతర నగరాలు, పట్టణాల్లో అమలుకు ప్రభుత్వం యోచన
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్‌ను జారీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పురపాలనలో సంస్కరణల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి చేసిన సిఫారసుల్లో ఇది కూడా ఒకటి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఈ నెల 5న రాష్ట్రంలోని నగర, పురపాలికల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లతో సమీక్ష నిర్వహించనున్నారు.

ఇందులో రూపాయికే నల్లా కనెక్షన్‌తోపాటు 100 రోజుల ప్రణాళిక, పురపాలికల ఆదాయ, వ్యయాలు, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన,  వేసవిలో తాగునీటి సరఫరా, మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులపై చర్చించనున్నారు.  పురపాలికల్లో అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించడంతో పాటు నీటి చార్జీలను పకడ్బందీగా వసూలు చేసేందుకు రూపాయికే నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రకటించే అంశంపై పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. మేయర్ల సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ దీనిపై ప్రకటన చేయొచ్చు.

Advertisement

తప్పక చదవండి

Advertisement