అమ్మ ఇచ్చే అమృతం అందడం లేదు! | Sakshi
Sakshi News home page

అమ్మ ఇచ్చే అమృతం అందడం లేదు!

Published Sun, Aug 6 2017 1:41 AM

అమ్మ ఇచ్చే అమృతం అందడం లేదు! - Sakshi

- జాతీయ సగటు 41.6 శాతం.. రాష్ట్రంలో 37 శాతమే
అవగాహనపై వైద్య శాఖ నిర్లక్ష్యం
 
సాక్షి, హైదరాబాద్‌: భావితరాలు ఆరోగ్యంగా ఉంటేనే ఏ సమాజమైనా ప్రగతివైపు అడుగులు వేస్తుంది. అయితే నవజాత శిశువుల ఆరోగ్యంలో కీలక పాత్ర అయిన తల్లిపాల విషయంలో మన రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ముఖ్యంగా పుట్టిన గంటలోగా శిశువులకు తల్లిపాలు అందించడం వల్ల రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నా, ఈ దిశగా ప్రయ త్నాలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నా మన దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో మాత్రం పురోగతి కనిపించడంలేదు. దేశంలో ఏటా 26 కోట్ల మంది పిల్లలు పుడుతుండగా సగటున ప్రతిరోజూ 70 వేల మందికిపైగా మహిళలు ప్రసవిస్తున్నారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 41.6 శాతం మంది నవజాత శిశువులకు మాత్రమే పుట్టిన గంటలోగా తల్లిపాలు అందుతు న్నాయి. అలాగే 55 శాతం మంది శిశువులు మాత్రమే పుట్టిన ఆరు నెలలపాటు పూర్తి కాలం తల్లిపాలు తాగుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం 37.1 శాతం మంది పిల్లలకు మాత్రమే పుట్టిన గంటలోగా తల్లిపాలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన సర్వే కావడంతో మన రాష్ట్రంలో పాత జిల్లాల వారీగానే ఈ గణాంకాలు ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం నవజాత శిశువులకు పుట్టిన గంటలోగా తల్లిపాలు తాగించే విషయంలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో తల్లిపాల పాత్ర ఎంతో కీలకమైనది.

తల్లీపిల్లల ఆరోగ్యం, పోషణ, విద్య, ఆర్థిక ప్రగతి, వ్యాధుల నివారణలో తల్లిపాల సంస్కృతి పాత్ర ముఖ్యమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తేల్చింది. శిశువులకు మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లి పాలు అందించడంతోపాటు అదనపు ఆహారం ప్రారంభిం చిన తర్వాత నుంచి రెండు ఏళ్ల వరకు వీలైతే మరికొంత కాలం తల్లిపాలు కొనసాగించడం వల్ల ఆర్యోకరమైన భావితరం తయారవుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 1989 నుంచి తల్లిపాల సంస్కృతిని పెంచే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలని డబ్ల్యూహెచ్‌వో నిర్ణయించింది. దేశం లోనూ ఏటా ఈ వారోత్సవాలు నిర్వ హిస్తున్నా మన రాష్ట్రంలో మాత్రం వైద్య ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని మరిచిపోయింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా మాతాశిశు సంరక్షణకు ఏటా కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ మాతాశిశు రక్షణలో కీలకమైన తల్లి పాల వారోత్సవాలను మాత్రం పట్టించుకోవడంలేదు.

Advertisement
Advertisement