హైదరాబాద్‌ కాదు చిచులం! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ కాదు చిచులం!

Published Sun, Jan 21 2018 2:00 AM

pandu ranga reddy about hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిచులం.. ఈ పదం చాలామందికి కొత్త! కానీ హైదరాబాద్‌ ‘కథ’మరోలా ఉంటే.. ఇప్పుడు దాని స్థానంలో ఈ పదమే మార్మోగిపోయి ఉండేది. వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమంటున్నారు చారిత్రక పరిశోధకుడు కెప్టెన్‌ లింగాల పాండురంగారెడ్డి! హైదరాబాద్‌ పూర్వపు పేరు ఇదేనట.

ఈ మేరకు ఆయన తన పరిశోధన వ్యాసాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండ్రోజులపాటు జరిగిన అంతర్జాతీయ హెరిటేజ్‌ సదస్సులో సమర్పించారు. చివరి రోజైన శనివారం ఇదే అంశంపై మాట్లాడారు. చిచులం (స్థానిక ప్రజలు దీన్ని చచలంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని పుస్తకాల్లో కూడా చచలంగానే ప్రచురితమైంది) అంటే చింత చెట్టు అని అర్థం. ది రాయల్‌ హిస్టారికల్‌ సొసైటీ ఫెలో అయిన పాండురంగారెడ్డి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..

‘‘భాగ్యనగరం అంటే హైదరాబాద్‌కు మరోపేరని అందరికీ తెలిసిందే. ఈ నగరానికి హైదరాబాద్‌గా నామకరణం చేయటానికి ముందు భాగ్యనగరంగా పిలిచేవారని, ఇబ్రహీం కులీకుతుబ్‌షా–భాగమతిల ప్రణయ కావ్యానికి నిదర్శనమని భావిస్తారు. కానీ ఇదంతా కాల్పనిక గాథ. వారిద్దరి ప్రణయానికి అవకాశమే లేదని కుతుబ్‌షా వయసు, అక్కడి పరిస్థితులను చూస్తే అవగతమవుతుంది. భాగమతిని కలిసేందుకే మూసీపై వంతెన నిర్మించారంటారు. కానీ వంతెన కట్టిన సమయంలో ఇబ్రహీం వయసు పదిన్నరేళ్లు.

ఆ వయసులో ప్రేమ ఎలా సాధ్యం. చరిత్రలో నిచిపోయిన కుతుబ్‌షా వంశవృక్షం వివరాలు, వారి కుటుంబ సభ్యుల వివరాల్లో ఎక్కడా భాగమతి ప్రస్తావనే లేదు. అసలు హైదరాబాద్‌ నగరానికి కుతుబ్‌షాహీలు పునాది వేశారన్న విషయమూ తప్పే. ఈ నగరం వెలియకముందే మూసీ నదికి దక్షిణాన చిచులం పేరుతో ఓ పెద్ద గ్రామం ఉంది. గోల్కొండ నగరంలో జనాభా పెరిగిపోవటం, ఇంతలో ప్లేగువ్యాధి ప్రబలటంతో జనం దాన్ని ఖాళీ చేసి వెలుపల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే తోటలూ పెంచుకున్నారు.

మూడునాలుగేళ్ల తర్వాత మళ్లీ వాటిని ఖాళీ చేసి కోట లోపలికి చేరారు. ఆ తాత్కాలిక ఇళ్లను ప్రజలు ఆక్రమించేసుకున్నారు. అవి కాలనీలుగా వెలిశాయి. చార్మినార్‌ ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన మీర్‌ ముమిన్‌ ఈ చిచులంలోనే నివసించారు. అక్కడే చనిపోయారు. ఇప్పు డాయన సమాధి అక్కడే ఉంది. ఈ చిచులం విస్త రించి నగరంగా మారింది. తదుపరి హైదర్‌ అలీకి చిహ్నంగా దాన్ని హైదరాబాద్‌గా పిలిచారు. వెరసి హైదరాబాద్‌ అసలు పేరు చిచులం మాత్రమే.

ఫ్రెంచ్‌ వజ్రాల వ్యాపారి టావర్నియర్‌ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి తోట(బాగ్‌)లు చూసి ఇది బాగ్‌ల నగరిగా పేర్కొన్నారు. అదే భాగ్యనగరమైంది. చిచులంలో బ్రాహ్మణవాడి అన్న ప్రాంతముండేది. అక్కడే కుతుబ్‌షాహీల గురువు, సూఫీ తత్వవేత్త చిరాగ్‌ ఉండేవారు. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడే ఉంది. చిచులం విషయం ప్రాచుర్యంలోకి రావాల్సి ఉంది. భాగమతి–కుతుబ్‌షా ప్రణయకావ్యం కాల్పనికంగా బాగానే అనిపించినా చరిత్రలో దానికి స్థానం ఉండరావు. ఎందుకంటే చరిత్ర వాస్తవాలపై లిఖించేది..’’  

Advertisement
Advertisement