హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ పదాథికారులకు దిశానిర్ధేశం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 7న హైదరాబాద్కు రానున్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన రెండేళ్ల తరువాత తొలిసారి తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన పూర్తిస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ బుధవారం హైదరాబాద్లో ఒక ప్రకటనలో తెలియజేశారు. పర్యటన షెడ్యూల్ ప్రకారం.. నరేంద్ర మోదీ ఆగస్టు 7న హైదరాబాద్కు రానున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు మోదీ బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న 'బిజేపీ బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనం' లో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడి కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తారు. అంతకముందు వివిధ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నరేంద్ర మోదీ పర్యటన సంబంధించి రాష్ట్ర పార్టీ బీజేపీ కార్యకర్తలను సమాయత్తం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నది.
దీనిలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తోంది. నరేంద్ర మోదీ రాక సందర్భంగా మహబూబ్నగర్ లో 29న, నల్గొండలో జులై 30న, రంగారెడ్డి అర్బన్ జులై 29, మెదక్ జులై 30న, నిజామాబాద్ జులై 31న, మంచిర్యాల ఆగస్టు 3న, కరీంనగర్ 29న, వరంగల్ జిల్లాలో జులై 30న వరంగల్ కార్పొరేషన్ జులై 31న, హైదరాబాద్ లో ఆగస్టు 2న జిల్లాలలో సన్నాహాక సమావేశాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ సన్నాహాక సమావేశాలలో బీజేపీ శాసనసభ్యులు, కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.