దొంగ.. పోలీస్! | Sakshi
Sakshi News home page

దొంగ.. పోలీస్!

Published Sat, Oct 15 2016 2:58 AM

పట్టుబడిన ఎస్సై గుర్తింపు కార్డులోని ఫోటో - Sakshi

► అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీకి యత్నించిన ఎస్సై
► అదే సమయంలో ఇంటి యజమాని
► రావడంతో పట్టుబడిన వైనం
► అరెస్టు చేసిన పోలీసులు..
► అల్మాస్‌గూడలో ఘటన
► 2009లో ఎస్సైగా ఎంపికైన మహేందర్‌రెడ్డి
► ఉగ్రవాది వికారుద్దీన్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌లో సభ్యుడు కూడా..

 
హైదరాబాద్:
అతనో పోలీస్.. దొంగలను పట్టుకోవడమేమోగానీ తానే దొంగగా మారాడు. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేని ఓ ఇంట్లో చొరబడ్డాడు. అందినకాడికి దోచుకెళదామనుకున్నాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు.  ఇతను ఓ ఎస్సై.. పేరు మహేందర్‌రెడ్డి. ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ఈ ఎస్సై సభ్యుడు కూడా. కానీ చోరీకి ప్రయత్నించి దొరికిపోయాడు. హైదరాబాద్‌లో మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
 
అల్మాస్‌గూడలోని శ్రీశ్రీహోమ్స్‌లో నివాసం ఉంటున్న శివప్రసాద్ దసరా పండుగ కోసం తమ స్వస్థలం కరీంనగర్‌కు వెళ్లారు. తిరిగి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత అల్మాస్‌గూడలోని తన ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇంటి తాళం పగలగొట్టి ఉంది. సందేహం వచ్చిన శివప్రసాద్.. 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే మీర్‌పేట్ సీఐ రంగస్వామి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారు ఇంట్లోకి వెళ్లి మెల్లగా పరిశీలించడం మొదలుపెట్టగా.. మహేందర్‌రెడ్డి ఇంట్లో తాపీగా తిరుగుతూ కనిపించాడు. దీంతో అతడిని పట్టుకుని ప్రశ్నించారు. తొలుత మహేందర్‌రెడ్డి పొంతన లేని సమాధానాలు చెప్పాడు.

తాను గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారినని బుకారుుంచాడు. మరి అర్ధరాత్రి ఈ ఇంట్లో ఏం పని అని నిలదీస్తే ఇష్టం వచ్చిన సమాధానాలు చెప్పాడు. దీంతో అతడిని అరెస్టు చేసి.. చోరీకి ప్రయత్నించినట్లుగా కేసు నమోదు చేసినట్లు మీర్‌పేట్ సీఐ రంగస్వామి తెలిపారు. పోలీసులు మహేందర్‌రెడ్డి గురించి ఆరా తీయగా .. అతను ఎస్సై అని తేలింది. గుర్రంగూడకు చెందిన మహేందర్‌రెడ్డి 2009లో ఎస్సైగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడిగా ఉన్నాడు.

ఎస్సై చోరీకి దిగిన ఇల్లు ఇదే..

Advertisement
Advertisement