Sakshi News home page

విద్యుత్ టెండర్ల కోసం కంపెనీల క్యూ

Published Tue, Jun 23 2015 1:38 AM

Power tenders For Companies in the queue

* 1,000 మెగావాట్ల కొనుగోళ్లకు టెండర్లు
* విద్యుదుత్పత్తిదారుల నుంచి  2,265 మెగావాట్లకు స్పందన

సాక్షి, హైదరాబాద్: దక్షిణాది నుంచి ఎనిమిదేళ్ల పాటు 1,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కొనుగోళ్లు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్లకు మంచి స్పందన లభించింది. మొత్తం 2,265 మెగావాట్ల విద్యుత్‌ను విక్రయించేందుకు 5 ప్రైవేటు విద్యుత్ కంపెనీలు ముందుకొచ్చి బిడ్లు దాఖలు చేశాయి.

ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు భవిష్యత్తు అవసరాల కోసం 8 ఏళ్ల పాటు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుదుత్పత్తిదారుల నుంచి సాంకేతిక అర్హత (టెక్నికల్ క్వాలిఫికేషన్) కోరుతూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) గత నెల 15న టెండర్లను ఆహ్వానించింది. సోమవారం ఈ టెండర్లను ఎస్పీడీసీఎల్ అధికారులు తెరిచి పరిశీలించారు.

సాంకేతిక బిడ్డింగ్‌లో అర్హత సాధించిన కంపెనీల నుంచి త్వరలో ఆర్థిక బిడ్లను ఆహ్వానించనున్నారు. నెల్లూరుకు చెందిన మూడు కంపెనీలు 1,200 మెగావాట్లకు బిడ్లు దాఖలు చేయగా, వీటి నుంచి 1,000 మెగావాట్ల కొనుగోళ్లకు త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఉత్తరాదికి చెందిన రెండు కంపెనీలు సైతం 1,000 మెగావాట్లను విక్రయించేందుకు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, వాటిని తిరస్కరించాలని ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది.

Advertisement
Advertisement