‘వ్యోమోగ్రహ’కు నాసా పిలుపు | Sakshi
Sakshi News home page

‘వ్యోమోగ్రహ’కు నాసా పిలుపు

Published Mon, May 12 2014 2:52 AM

‘వ్యోమోగ్రహ’కు నాసా పిలుపు

 పెరుగుతున్న జనాభా, గ్లోబల్ వార్మింగ్‌తో రాబోయే రోజుల్లో భూమి మనుగడ ప్రమాదకరం కానుంది. అందుకోసం ముందుగానే నా వంతుగా ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టాను. నా ఈ ప్రయత్నాన్ని తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం, స్నేహితులు  ఎంతగానో ప్రోత్సహించారు. వారందరికీ కృతజ్ఞతలు -ప్రవళిక
 
 కాటేదాన్, న్యూస్‌లైన్: అంతరించిపోనున్న భూమి.. ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రమాదపుటంచునున్న మానవజాతి.. కాపాడేందుకు ప్రయత్నాలు.. ఇతర గ్రహాలపై మనిషి మనుగడ అనే అంశంపై సాగించిన పరిశోధనలు.. ఇంకేముంది ఆ విద్యార్థినిని అమెరికాకు చెందిన నాసా పరిశోధనా కేంద్రం గుర్తించింది. వివరాల్లోకి వెళ్తే... మైలార్‌దేవ్‌పల్లి టీఎన్జీవోస్‌కాలనీకి చెందిన వరప్రకాష్, అనురాధ దంపతులు. వీరి సంతానం ప్రవళిక. ఈ బాలిక స్థానికంగా ఉన్న మణికంఠ హిల్స్‌లోని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాలలో ఎనిమిదోతరగతి చదువుతోంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వరప్రకాష్, అనురాధలు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే తమ కూతుర్ని నూతన పరిశోధనల కోసం ప్రో త్సహిస్తున్నారు.

కాగా ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు రఘునందన్ నేతృత్వంలో ప్రవళిక మరో నలుగురు విద్యార్థినులతో ‘వ్యోమోగ్రహ’ పేరుతో పరిశోధనలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రపంచం అంతరించిపోతుందని వస్తున్న కథనాల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ‘వ్యోమోగ్రహ’ పరిశోధనను రూపొం దించారు. ఈ పరిశోధనాంశాన్ని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ నాసాకు పంపించింది. వీరి పరిశోధనాంశాన్ని పరిశీలించిన నాసా అధికారులు ప్రవళిక బృందాన్ని ఆహ్వానించారు.

ఈ మేరకు తమ పాఠశాల విద్యార్థిని సాధించిన ఘనత తమకు మంచి గుర్తింపును తీసుకు వచ్చిందని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాల కరస్పాండెంట్ ఎస్. ప్రమోద్‌రెడ్డి, డెరైక్టర్ బి. శ్రీనివాస్, ప్రిన్సిపల్ గోపాల్, సిబ్బంది ప్రవళికను ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. ప్రవళిక చేస్తున్న కృషి ప్రతి విద్యార్థినికి ఆదర్శం కావాలని ఆమె తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. నాసా పరిశోధనా కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు దాదాపు 15రోజులు పడుతుందని, అందుకు సుమారు రూ.3లక్షలు ఖర్చవుతాయని, దీనిని సొంతంగా తామే భరిస్తున్నామని వారు పేర్కొన్నారు.

Advertisement
Advertisement