ఆధార్‌ ఉంటేనే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ | Sakshi
Sakshi News home page

ఆధార్‌ ఉంటేనే ఆస్తుల రిజిస్ట్రేషన్‌

Published Wed, Jul 5 2017 2:52 AM

ఆధార్‌ ఉంటేనే ఆస్తుల రిజిస్ట్రేషన్‌

వచ్చే నెల నుంచి అమల్లోకి!
 
సాక్షి, హైదరాబాద్‌: భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఇక నుంచి ‘ఆధార్‌’తప్పనిసరి కానుంది. క్రయ, విక్రయ లావాదేవీలకు గాను ఇరు పార్టీలూ ఆధార్‌ వివరాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేయాలన్న నిబంధన త్వరలో అమల్లోకి రానుంది. దీనిపై రిజిస్ట్రే షన్ల శాఖ ఇంతకుముందే అంతర్గత సర్క్యు లర్‌ జారీ చేసినా.. ఆచరణలోకి రాలేదు. ఇటీవల భారీగా రిజిస్ట్రేషన్‌ అక్రమాలు బయటపడిన నేపథ్యంలో ‘ఆధార్‌’లింకును తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. రెండు మూడు వారాల్లో ఈ నిబంధనను అధికారికంగా అమల్లోకి తెస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొంత జాప్యం జరిగినా ఆగస్టు నుంచి కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
 
పారదర్శకత కోసమే..
ప్రస్తుతానికి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వ్యక్తిగత ధ్రువీకరణతో సరిపెడు తున్నారు. క్రయ, విక్రయాలు జరిపే ఇరు పార్టీల ధ్రువీకరణ కార్డులతో పాటు ఇద్దరు సాక్షులు సంతకాలు చేస్తే రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది. కానీ ఆధార్‌ నిబంధన అమ ల్లోకి వస్తే ఇరు పార్టీలు కచ్చితంగా తమ ఆధార్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వారి వేలిముద్రలు కూడా తీసుకుంటారు. సాక్షుల ఆధార్‌ వివరాలు కూడా తీసుకోవా లని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు యోచిస్తు న్నారు. తద్వారా సంబంధిత లావాదేవీ పూర్తి పారదర్శకతతో జరుగుతుందని, ఏదైనా అక్రమం జరిగినా కచ్చితంగా తేలు తుందనే భావిస్తున్నారు. సాక్షుల ఆధార్‌ విషయంగా ఇంకా తుది నిర్ణయం తీసుకో లేదు. క్రయ, విక్రయదారుల్లో ఎవరికైనా ఒకవేళ ఆధార్‌ లేనిపక్షంలో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకోవాలనే నిబంధన విధిస్తున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అధికారులు చెబుతున్నారు.
 
కోర్టు కూడా అడ్డుకోదేమో..!
వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అమలు చేసే సంక్షేమ పథకాలకు మినహా ఇతరాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయవద్దని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం ఏ మేరకు అమల్లోకి వస్తుందన్న దానిపై అస్పష్టత ఉంది. రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ తప్పనిసరి చేస్తే.. కోర్టుపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అన్నదిశగా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికా రులు ఆలోచన చేస్తున్నారు. అయితే పాన్‌కార్డును ఆధార్‌తో లింకు చేయడాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భూ అక్రమాల నియంత్రణ కోసం ఉపయోగపడే అవకాశం ఉన్నందున రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ తప్పనిసరి చేయ డానికి న్యాయపరంగా ఇబ్బందులు రావని భావిస్తున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Advertisement
Advertisement