రైల్వే ‘ప్రత్యేక దోపిడీ’ | Sakshi
Sakshi News home page

రైల్వే ‘ప్రత్యేక దోపిడీ’

Published Thu, Sep 29 2016 2:22 AM

రైల్వే ‘ప్రత్యేక దోపిడీ’ - Sakshi

- ప్రత్యేక రైళ్లు, సువిధ రైళ్ల పేర అదనపు చార్జీలు  
- ఫ్లెక్సీ ప్రైస్ పేరిట మరో రకం దోపిడీ
- రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో చార్జీల మోత  
- దళారుల అక్రమార్జనకు ఊతం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుడిపై రైల్వే ముప్పేట దాడి చేస్తూ.. చార్జీలు ఏ మాత్రం పెంచకుండానే దొడ్డిదారి వడ్డింపులతో నడ్డి విరుస్తోంది. పండుగొచ్చిందంటే చాలు 50 శాతం అదనపు చార్జీలతో ప్రయాణికుల నిలువుదోపిడీకి పాల్పడే ఆర్టీసీ తరహాలోనే దక్షిణమధ్య రైల్వే రంగంలోకి దిగింది. ఒకవైపు ఏడాదికిపైగా వివిధ రూట్‌లలో ‘సువిధ’ పేరుతో నడుపుతున్న రైళ్లలో చార్జీలను రెట్టింపు చేయగా.. ఇటీవల ‘ఫ్లెక్సీ ప్రైస్’పేరుతో రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్లలో చార్జీల మోత మోగించింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రతి 10 శాతం బెర్తులపైన భారాన్ని పెంచేశారు. తాజాగా దసరా, దీపావళి, తిరుమల బ్రహ్మోత్సవాల పేరిట అక్టోబర్, నవంబర్ నెల ల్లో నడుపనున్న 52 ప్రత్యేక రైళ్లను సైతం వదిలి పెట్టకుండా సాధారణ చార్జీల స్థానంలో ‘తత్కాల్’ చార్జీలు విధించి అదనపు దోపిడీకి అధికారులు తెరలేపారు. దీంతో ఇప్పటి వరకు చౌకగా ఉన్న రైలు ప్రయాణం భారంగా మారింది.

 ప్రత్యేక రైళ్లలో తత్కాల్ చార్జీలు...
 తిరుమల బ్రహోత్సవం, దసరా, దీపావళి పర్వదినాల దృష్ట్యా నడిపే ప్రత్యేక రైళ్లన్నింటికీ తత్కాల్ చార్జీలు వర్తించనున్నాయి.హైదరాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-మైసూర్, సంత్రాగచ్చి(కోల్‌కత్తా)-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-పట్నాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ రెండవ వారం వరకు ఈ రైళ్లు  అందుబాటులో ఉంటాయి.

 ‘సువిధ’ంగా దోపిడీ  ....
 గతంలో ప్రీమియం రైళ్ల పేరుతో బెర్తుల బేరానికి దిగిన రైల్వే ఇప్పుడు ‘సువిధ’ంగా పేరు మార్చుకుంది. ఈ రైళ్లలో సాధారణ చార్జీలు ఉండవు. ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో తత్కాల్‌తోనే చార్జీలు మొదలవుతాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు పెరిగి, బెర్తులు నిండుతున్నా కొద్దీ చార్జీలు పెరుగుతాయి. మొదట తత్కాల్‌తో ప్రారంభమై ఆ తరువాత క్రమంగా పెరుగుతాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌క్లాస్ చార్జీ రూ.365 ఉంటుంది. కానీ సువిధ రైళ్లలో ఇది తత్కాల్ చార్జీలతో అంటే రూ.470తో మొదలవుతుంది. మొదటి 25 బెర్తుల వరకు ఈ చార్జీలు ఉంటాయి. ఆ తరువాత 26వ బెర్తు నుంచి నుంచి 50వ బెర్తు వరకు సుమారు రూ.900.. 51వ బెర్తు నుంచి 72వ బెర్తు వరకు దాదాపు రూ.1200 నుంచి రూ.1300 వరకు పెరుగుతుంది. ఇలా ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు చార్జీలు పెరుగుతాయి.

 రాజధాని, శతాబ్దిల్లో ఫ్లెక్సీ ప్రైస్....
 ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా చార్జీల పెంపునకు రైల్వే ‘ఫ్లెక్సీ ప్రైస్’పేరుతో అదనపు దోపిడీకి తెరలేపింది. ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉండే రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఫస్ట్ ఏసీ మినహా మిగతా బెర్తులలో ప్రతి 10 శాతం బెర్తులపైన  10 శాతం చొప్పున చార్జీలు పెరుగుతాయి. ఉదాహరణకు రిజర్వేషన్ కార్యాలయంలో బుకింగ్ కోసం నిరీక్షిస్తున్న మొదటి 10 మంది  ప్రయాణికులు సాధారణ చార్జీలపైనే బుకింగ్ చేసుకుంటే అదే లైన్‌లో పడిగాపులు కాసే ఆ తరువాత 10 మంది తమ బుకింగ్‌లపైన  10 శాతం చార్జీలు అదనంగా చెల్లించవలసి  ఉంటుంది. అలాగే  21వ ప్రయాణికుడి నుంచి  30వ ప్రయాణికుడి వరకు 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా  సాధారణ చార్జీలపైన 50  శాతం వరకు చార్జీలు పెంచుకునే విధానాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి  తెచ్చారు. కాగా ఫ్లెక్సీ ప్రైస్ దళారుల అక్రమ ద ందాకు అవకాశం కల్పిస్తుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో టిక్కెట్‌లు బుక్  చేసి ప్రయాణికులకు అధికధరలకు విక్రయించే దళారులకు ఫ్లెక్సీ ప్రైస్ మరింత లాభసాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 
 ప్లాట్‌ఫామ్ చార్జీ పెంపు
 దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ చార్జీలను రూ.10 నుంచి రూ.20 కి పెంచింది. ఈ నెల 30వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే ఇంచార్జి సీపీఆర్వో ఏకే సింగ్ తెలిపారు. సాధారణ రోజుల్లో ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌ల ద్వారా రోజుకు రూ.1.5 లక్షల ఆదాయం లభిస్తుండగా, చార్జీల పెంపు వల్ల రోజుకు రూ.5 లక్షల ఆదాయం రానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement