చినుకు చిటుక్కుమంటే... గుండె గుభేల్..! | Sakshi
Sakshi News home page

చినుకు చిటుక్కుమంటే... గుండె గుభేల్..!

Published Tue, Jun 28 2016 11:16 PM

చినుకు   చిటుక్కుమంటే... గుండె గుభేల్..!

సిటీలో షరా మామూలుగా వర్షం సమస్యలు
ప్రాణాంతకంగా మారిన  రహదారుల తవ్వకాలు
గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు మారని అధికారుల తీరు
నరకం చవిచూస్తున్న నగరవాసులు

 

వానొచ్చిందంటే నగరవాసి వణికిపోతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు రావడానికే జంకుతున్నాడు. జలాశయాలను తలపిస్తున్న రహదారులు, ఎక్కడ పడితే అక్కడ గుంతలు, అస్తవ్యస్తమైన మ్యాన్‌హోళ్లు, ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు దడపుట్టిస్తున్నాయి. వర్షంలో బయటికొస్తే ప్రాణాలకు గ్యారంటీ లేదనే పరిస్థితి దాపురించింది. ఏటా వర్షం ఇబ్బందులు ఎదురవుతున్నా..గతం నుంచి పాఠాలు నేర్వడం లేదు మన అధికారగణం. ఫలితంగా వర్షాకాలంలో నగరవాసి నరకం చవిచూస్తున్నాడు. ఈ సీజన్‌లో తొలిసారిగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు కురిసిన వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. తెగిన కరెంటు తీగలు తగిలి విద్యుత్‌షాక్‌తో ఓ చిన్నారి చనిపోయాడు. రోడ్లపై భారీగా వర్షం నీళ్లు నిలవడం, మ్యాన్‌హోళ్లు, మురికి కాలువలు పొంగిపొర్లడం తదితర సమస్యల కారణంగా దాదాపు ఆరుగంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. మాదాపూర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో గంటసేపు ఎక్కడి వాహనాలు అక్కడే కదలకుండా నిలిచిపోయాయి.  - సాక్షి, సిటీబ్యూరో

 

సిటీబ్యూరో:  మంగళవారం ఉదయం... దిల్‌సుఖ్‌నగర్ నుంచి బయలుదేరిన ద్విచక్ర వాహనచోదకుడు బంజారాహిల్స్ చేరుకోవడానికి 1.45 గంటలు పట్టింది. సాధారణ సమయాల్లో 13.6 కిమీ దూరాన్ని గరిష్టంగా 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. సోమవారం రాత్రి నుంచి కురిసిన వర్షం, పొంగిపొర్లిన డ్రైనేజీలు, జలమయమైన రోడ్లు వీటన్నింటికీ తోడు ప్రధాన రహదారుల వెంట సాగుతున్న మెట్రో రైల్ పనులు... వెరసి వాహనచోదకుడు నరకాన్ని చవి చూడాల్సి వచ్చింది. కీలక ప్రాంతాల్లో దాదాపు రోజంతా ఇదే పరిస్థితి నెలకొంది.

 
రహదారులపై సీజనల్ బాటిల్ నెక్స్...

సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటిస్తున్న సర్కారు మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాథమిక సమస్యలపై మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టట్లేదు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే రహదారులు హుస్సేన్‌సాగర్‌ను తలపిస్తుంటాయి. అడుగడుగుకీ ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలతో ఏది గొయ్యో, ఏది రహదారో తెలియని పరిస్థితి నెలకొంటోంది. ఫలితంగా అలా నీరు నిలిచిన ప్రాంతాలను తప్పించుకోవడానికి వాహనచోదకులు ఓ పక్కగా వెళ్లడమో, వేగాన్ని పూర్తిగా తగ్గించుకుని ముందుగు సాగడమో జరుగుతోంది. ఈ కారణంగానే రహదారులపై ఎక్కడిక్కడ సీజనల్ బాటిల్ నెక్స్ ఏర్పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వాహనాలు గరిష్టంగా గంటకు 10 కిమీ వేగంతోనూ వెళ్లలేకపోతున్నాయి. దీని ప్రభావం ఆ రహదారిలో ప్రయాణించే ప్రతి వాహనంపైనా ఉంటోంది.

 
అన్నీ తాత్కాలిక ప్రాతికదికనే...

ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందు జీహెచ్‌ఎంసీ సహా ప్రభుత్వ విభాగాలన్నీ ‘అప్రమత్తమవుతాయి’. ఎలాంటి తవ్వకాలు, రహదారిపై నిర్మాణాలు చేపట్టకూడదంటూ అధికారులు ఆదేశిస్తూ ఉంటారు. వాస్తవానికి వచ్చే సరికి ఇవేవీ అమలుకావట్లేదు. మరోపక్క నగర వ్యాప్తంగా 250 ప్రాంతాలు వర్షం కురిస్తే చాలు నీరు నిలిచే వాటర్ లాగింగ్ ఏరియాలుగా మారినట్లు బల్దియా ఏళ్ల క్రితమే గుర్తించింది. ఒక్క మైత్రీవనం చౌరస్తా మినహా... మిగిలిన చోట్ల శాశ్వత ప్రాతిపదికన తీసుకున్న చర్యలు కనిపించవు. వీటి నిర్వహణకు ఏటా రూ.3 కోట్ల వరకు వెచ్చిస్తున్న బల్దియా అధికారులు రహదారులకు డెక్ట్ నిర్మాణం, నాలాల అభివృద్ధి తదితర అంశాలపై అవసరమైన స్థాయిలో దృష్టి పెట్టట్లేదు. ఫలితంగా ఏటా నిధులు ఖర్చవుతున్నా... ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. దీంతో ఏమాత్రం వర్షం కురిసినా నగరంలోని రోడ్డుపై వాహనాలు బారులు తీరడం ఆనవాయితీగా మారిపోయింది.

 
అడ్డంకిగా మారిన ‘మెట్రో’ పనులు...

సిటీలో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యలకు తోడు మెట్రో రైలు నిర్మాణ పనులు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం కోసం రహదారిలో దాదాపు సగం ఆక్రమిస్తూ బారికేడ్లు ఏర్పాటవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఈ బారికేడ్లు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. దీనికితోడు వీటి నిర్మాణానికి అవసరమైన భారీ సామగ్రి రవాణా వాహనాలతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రహదారులపై గోతులు ఏర్పడుతున్నాయి. నిర్మాణం పూర్తయ్యే వరకు వీటిని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం లేకపోవడంతో ఇవీ వాటర్‌లాగింగ్ ఏరియాలుగా మారి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నాయి.

 
డివైడర్ల నిర్మాణంలో లోపాలు సైతం...

ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు... రైట్-లెఫ్ట్ రహదారుల్ని వేరు చేసేందుకు ఉద్దేశించిన డివైడర్లు సైతం నగర వాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వీటి నిర్మాణంలో శాస్త్రీయత కొరవడటం, అవసరమైన కనీస జాగ్రత్తలు, ప్రమాణాలు సైతం పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల మధ్యలోనే డివైడర్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మరోపక్క గతంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులు, లాలీపాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం ఆర్జించాలనే జీహెచ్‌ఎంసీ వైఖరి కారణంగా డివైడర్ల ప్లేస్‌లో సెంట్రల్ మీడియమ్స్ వచ్చి చేరుతుండటంతో నీరు వెళ్లే అవకాశం లేక ఇబ్బందులు పెరుగుతున్నాయి.

 
మంగళవారం నరకం చూపిన ప్రాంతాల్లో కొన్ని:

పంజగుట్ట, మోడల్ హౌస్, సికింద్రాబాద్, ఆలుగడ్డబావి, బేగంపేట, మెట్టుగూడ, మలక్‌పేట, తార్నాక, హబ్సిగూడ, శ్రీనగర్‌కాలనీ, తిరుమలగిరి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, అబిడ్స్, ఎంజే మార్కెట్, అమీర్‌పేట, మెహదీపట్నం, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మూసాపేట.

 

‘నైతికంగా మనమూ బాధ్యులమే’
గచ్చిబౌలి: మాదాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటనలో నైతికంగా మనమూ బాధ్యులమేనని వెస్ట్ జోనల్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి పేర్కొన్నారు. మ్యాన్‌హోల్ పనులు పూర్తి చేసి జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తే పూర్తి బాధ్యత వహించాల్సి ఉండేదని అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి వెస్ట్‌జోన్ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ, మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు, ఎలక్ట్రికల్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లోపించడం మూలంగానే మాదాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి జార్ఖండ్‌కు చెందిన మోతీయాదవ్ మృతి చెందాడని పేర్కొన్నారు. అందరూ బాధ్యత వహించి క్షేత్ర స్థాయి నుంచి ఎప్పటికప్పుడు మ్యాన్‌హోళ్లు,  రోడ్ల మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

అన్ని ఏజెన్సీలు నిబంధనలు పాటించాల్సిందే: ట్రాఫిక్ చీఫ్
నగరంలో వాటర్/డ్రైనేజ్ పైప్‌లైన్ల పనులు, భూగర్భ కేబుల్స్ ఏర్పాటు, ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిబంధనల్ని పాటించట్లేదని ట్రాఫిక్ చీఫ్ జితేందర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వీరికి అనుమతిస్తున్న సమయంలోనే పనులు జరుగుతున్న ప్రాంతాల్లో బారికేడ్లు, సూచికలు ఏర్పాటు చేయాలని, ఏ ఏజెన్సీ పనులు నిర్వహిస్తోందో కచ్చితంగా తెలపాలని, ఎంత సమయంలో పని పూర్తవుతుందో పేర్కొనాలంటూ స్పష్టం చేస్తున్నామన్నారు. వీటిని ఆయా ఏజెన్సీలు బేఖాతరు చేయడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పనులు చేపడుతున్న ప్రతి సంస్థా పూర్తి వివరాలను వెల్లడించడంతో పాటు నిబంధనలు పాటించాల్సిందేనని, స్థానిక ఏసీపీ లేదా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలోనే పనులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement