ఓటుకు కోట్లు కేసులో విచారణ మళ్లీ ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసులో విచారణ మళ్లీ ప్రారంభం

Published Thu, Oct 27 2016 3:02 PM

ఓటుకు కోట్లు కేసులో విచారణ మళ్లీ ప్రారంభం - Sakshi

ఓటుకు కోట్లు కేసులో విచారణ మళ్లీ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఈ కేసు విచారణను మళ్లీ ప్రారంభించింది. ఇంతకుముందు ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇవ్వగా.. పిటిషనర్లు దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల్లోగా ఈ కేసును తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు మళ్లీ విచారణ ప్రారంభమైంది.  (ఓటుకు కోట్లు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు) చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదాపడింది. 
 
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయించుకోవడం కోసం డబ్బులు ఇస్తూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దానికి సంబంధించిన ఆడియో, వీడియో టేపుల్లో చంద్రబాబు గొంతు కూడా వినిపించడం, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లు నిర్ధారించడంతో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. కేసును పునర్విచారించి, అందులో చంద్రబాబు పేరును కూడా చేర్చాలంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. (ఓటుకు కోట్లు: 8 వారాల పాటు హైకోర్టు స్టే)
 
దాంతో ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించాలని ఆదేశించగా, దానిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టేను సవాలుచేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కేసును నాలుగు వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో ఇప్పుడు మళ్లీ విచారణ మొదలైంది.  (హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు)

Advertisement
Advertisement