బిడ్డలను చంపి రిలాక్సయ్యాను | Sakshi
Sakshi News home page

బిడ్డలను చంపి రిలాక్సయ్యాను

Published Fri, Mar 18 2016 2:10 AM

బిడ్డలను చంపి రిలాక్సయ్యాను - Sakshi

 పిల్లలకు తండ్రి గండం తప్పింది.. ఇప్పుడెంతో హ్యాపీగా ఉన్నాను..
 హుస్సేన్‌సాగర్ నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకున్నా.. నాకే పాపం ఉండదు
 సాక్ష్యాలు అడిగితే ఇవ్వలేను: పోలీసు విచారణలో వెల్లడించిన రజని
 ఆమె మానసిక స్థితి సరిగా లేదు: రజని భర్త వినయ్

     
హైదరాబాద్: ‘‘నా ఇద్దరు బిడ్డలను నేనే చంపేశా.. కన్న కూతుళ్లను పాశవికంగా హత్య చేశావు.. ఏం అనిపించలేదా అని మీరంతా ప్రశ్నిస్తున్నారు. నిజానికి నా కూతుళ్లను కడతేర్చాక చాలా రిలాక్స్‌గా, హ్యాపీగా ఉన్నాను. రెండు నెలలుగా నా భర్త నుంచి నా బిడ్డలకు హాని ఉందని చాలా కుమిలిపోయా.. మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇకపై ఉండదు. ఇద్దరు కూతుళ్లను చంపేశాక నేరుగా ట్యాంక్‌బండ్‌కు వెళ్లా.. తలపై హుస్సేన్‌సాగర్ నీళ్లు చల్లుకుని ఒంటిని శుద్ధి చేసుకున్నా.. ఇక నాకే పాపం ఉండదు. అందుకే ట్యాంక్‌బండ్ నుంచి నేరుగా ఇంటికి వచ్చా..’’ కన్న కూతుళ్లు అశ్విక(7), తివిష్క(3)లను కర్కశంగా గాజు పెంకుతో గొంతుకోసి చంపిన తల్లి రజని(41) పోలీసుల విచారణలో చెప్పిన విషయమిది. బుధవారం రాత్రే రజనిని అదుపులోకి తీసుకున్న తుకారాంగేట్ పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు బిడ్డలను కడతేర్చి పోలీసుల ఎదుట ప్రత్యక్షమైన రజని.. కంటతడి పెట్టకపోగా నిర్భీతిగా పోలీ సు విచారణలో చెప్పిన సమాధానాలు అధికారులనే నివ్వెరపరిచాయి. విచారణలో పోలీసు లు అడిగిన ప్రశ్నలకు రజని ఇచ్చిన సమాధానాలు ఆమె మాటల్లోనే..

తండ్రిని చూస్తే భయపడేది..
రెండు నెలలుగా నా పెద్ద కూతురు అశ్విక తండ్రి వినయ్ దగ్గరికి వెళ్లడం లేదు. ఆయన లేనప్పుడు ఇంట్లో బాగానే ఉంటున్న అమ్మా యి.. ఆయన్ను చూడగానే భయపడి పోతోం ది. మా అమ్మాయి తండ్రి లైంగిక వేధింపులకుగురై భయపడిపోతోందని నా అంతరాత్మ చె ప్పింది. నా మనసు ఎప్పుడూ తప్పు చెప్పదు. ఆత్మసాక్షిగా అది నిజమేనని అనుకున్న మీదట నా మనసు నిలకడగా లేదు. నేను ప్రాణంగా చూసుకునే అమ్మాయిలు ఏదో ఒకరోజు తండ్రి చేతిలో అత్యాచారానికి బలైపోతారని దృఢంగా నమ్మాను. నా పిల్లలను రక్షించుకోవడానికి మా ర్గం అన్వేషించా. వారిని చంపేయడమే కరెక్ట్ అనిపించింది. అందుకే నిన్న(బుధవారం) రాత్రి ఇద్దరినీ చంపేశాను. ఇప్పుడు చాలా రిలాక్స్‌గా, హ్యాపీగా ఉన్నాను. ఇకపై నాకు ఎటువంటి చింతా ఉండదు. నా ఇద్దరు పాపలకు తండ్రి నుంచి లైంగిక వేధింపుల భయం ఉండదు. అలాగని నా కళ్లతో ఎప్పుడూ భర్త పిల్లల్ని లైంగికవేధింపులకు గురిచేయడం చూ డలేదు. సాక్ష్యాలు తెమ్మంటే నా దగ్గర లేవు.

భర్త వాదన మరోలా..
ఇద్దరు కూతుళ్లను కోల్పోయి కుప్పకూలిపోయిన రజని భర్త వినయ్ పోలీసులకు ఇచ్చిన వివరణ మరోలా ఉంది. కన్న కూతుళ్లపై.. అందులోనూ ముక్కుపచ్చలారని పసివారిపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రజని చెప్పడం పూర్తిగా అవాస్తవమని వినయ్ చెప్పాడు. ఈ మధ్య తన భార్య మానసిక స్థితి సరిగ్గా లేదని, తనలో తానే ఏదో ఊహించుకుని అవే వాస్తవాలుగా భావించి తనతో గొడవ పడేదన్నాడు. హత్య జరిగిన రోజు ఉదయం భార్యాపిల్లలతో గుడికి వెళ్లివచ్చామని, ఇంటికి వచ్చాక రజని తనతో లైంగిక వేధింపుల ప్రస్తావన తెచ్చి గొడవ పడిందని వెల్లడించాడు. తన మానసిక స్థితి సరిగా లేదని తెలిసి తానేమీ మాట్లాడకుండానే ఆఫీసుకు వెళ్లిపోయానని, తిరిగి వచ్చేసరికి ఘోరం జరిగిపోయిందని పోలీసుల ముందు భోరున విలపించాడు.
 
లైంగిక వేధింపులపై ఆధారాల్లేవు: గాంధీ వైద్యులు

అశ్విక, తివిష్కలను ఊపిరాడకుండా చేసి, గొంతు కోసి హత్య చేసినట్టుగా గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు ధ్రువీకరించారు. తల్లి చేతిలో హత్యకు గురైన ఇరువురు బాలికల మృతదేహాలకు గురువారం గాంధీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ బాలికల ఒంటిపై లైంగిక వేధింపులకు గురైన ఆనవాళ్లు లేవని నిర్ధారించారు. దీంతో మానసిక స్థితి సరిగా లేని కారణంగానే రజని తన కూతుళ్లను హత్యచేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement