చీప్ లిక్కర్ పై పునస్సమీక్ష | Sakshi
Sakshi News home page

చీప్ లిక్కర్ పై పునస్సమీక్ష

Published Sun, Aug 23 2015 4:22 AM

చీప్ లిక్కర్ పై పునస్సమీక్ష - Sakshi

 అంబర్‌పేట : రాష్ట్రంలో చీప్ లిక్కర్ ప్రవేశపెట్టే విషయాన్ని పునస్సమీక్షించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కోరుతానని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. చీప్ లిక్కర్‌తో గౌడ కులస్తుల వృత్తిపై ప్రభావం పడే అంశాన్ని సీఎంకు కూలంకుషంగా వివరిస్తామని తెలిపారు.  అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తాలో ప్రేమ్‌నగర్ గౌడ సంఘ ముఖ్య సలహదారు జి.ఆనంద్‌గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న   జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలతో కలిసి సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ బలహీన వర్గాల సత్తా చాటిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కీర్తించారు. అంబర్‌పేటలో సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ చీప్ లిక్కర్ విషయాన్ని  ముఖ్యమంత్రికి నిర్మొహమాటంగా తెలియజేయాలని స్వామిగౌడ్‌ను కోరారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వానికి సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పి.జ్ఞానేశ్వర్ గౌడ్, సాంబశివ గౌడ్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, గౌడ సంఘ నాయకులు జైహింద్ గౌడ్, రాజేందర్‌పటేల్ గౌడ్, లక్‌పతి యాదగిరి గౌడ్, నిమ్మల బాలయ్యగౌడ్, లింగం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తొలుపునూరి కృష్ణాగౌడ్, కాసాని రాములుగౌడ్, భాస్కర్‌గౌడ్, వెంకటేష్ గౌడ్, యాదగిరి గౌడ్, రాంచందర్‌గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement