‘షి ట్యాక్సీ’ ప్రారంభం | Sakshi
Sakshi News home page

‘షి ట్యాక్సీ’ ప్రారంభం

Published Fri, Feb 28 2014 5:31 AM

‘షి ట్యాక్సీ’ ప్రారంభం - Sakshi

అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: జీహెచ్‌ఎంసీ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘షి ట్యాక్సీ’ ప్రారంభమైంది. గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ ట్యాక్సీని నగర మేయర్ మాజిద్ హుస్సేన్.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, డిప్యూటీ స్పీకర్ రాజ్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్, గ్రీన్ క్యాబ్స్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ బ్యాంకుల ద్వారా ట్యాక్సీకి రుణాలు మంజూరు చేయిస్తుందన్నారు. 15 శాతం వ్యయాన్ని భరించగలిగే అభ్యర్థులకు 85 శాతం రుణం బ్యాంకుల ద్వారా మంజూరు చేయించనున్నట్లు వివరించారు. త్వరలో ఈ పథకం ద్వారా 200 మందికి ట్యాక్సీలను బ్యాంకుల ద్వారా మంజూరు చేయించనున్నట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ క మిషనర్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని రాణించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. షి ట్యాక్సీలతో మహిళా ఉద్యోగులకు భద్రత ఉంటుందన్నారు.

ఈ పథకం ద్వారా 200 కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. గురువారం ప్రయోగాత్మకంగా 5 ట్యాక్సీలను ప్రారంభించామన్నారు. కనీస విద్యార్హత 8వ తరగతి ఉండి, బ్యాంకు రుణంలో 15శాతం భరించగలిగిన ఆసక్తి గల అభ్యర్థులు జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఫుడ్ ప్రాసెస్ శాఖ జాయింట్ సెక్రెటరీ అనూరాధ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement