‘కాల్’నాగులున్నాయ్! | Sakshi
Sakshi News home page

‘కాల్’నాగులున్నాయ్!

Published Sat, Oct 10 2015 9:06 AM

కీలక సూత్రధారి ఇషాన్ - Sakshi

 యూఎస్, యూకే అప్రమత్తం
 అమెరికాలో వెలుగులోకి ‘సోషల్’ స్కామ్
 ఈ ముఠాతో సంబంధాలపై అనుమానాలు

 
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన కాల్ సెంటర్ క్రైమ్ సమాచారం తెలుసుకున్న అమెరికా, లండన్ కాన్సులేట్ కార్యాలయాలు తమ దేశాలను అప్రమత్తం చేశాయి. ఈ తరహా ముఠాలు మరికొన్ని ఉండొచ్చనే అనుమానంతో యూఎస్‌కు చెందిన సోషల్ సెక్యూరిటీ అడ్మిస్ట్రేషన్‌తో పాటు ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఓఐజీ) కార్యాలయాలు తమ వెబ్‌సైట్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. మరోపక్క అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో బుధవారం ‘సోషల్ సెక్యూరిటీ’ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనికి భారతీయుడే ఆద్యుడని అనుమానిస్తున్న ఆ రాష్ట్ర పోలీసులు... హైదరాబాద్‌లో చిక్కిన ముఠాతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కనెక్టికట్ రాష్ట్రంలోని ఈస్ట్ హార్ట్‌ఫోర్డ్ టౌన్‌లో ఉన్న సౌత్ విండర్స్‌లో నివసించే ఇద్దరికిబుధవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ నుంచి వచ్చినట్లుగా ఫోన్లు వ చ్చాయి. అక్కడి పౌరులకు సోషల్ సెక్యూరిటీ కార్డు, నెంబర్ అత్యంత కీలకం కావడంతో ఫోన్ చేసిన వ్యక్తి వాటి పేర్లతోనే బెదిరించాడు. సోషల్ సెక్యూరిటీ నెంబర్, ఇతర వివరాలు చెప్పి... అవి రద్దయ్యే ప్రతిపాదన ఉందన్నాడు. తనకు మనీగ్రామ్ ద్వారా నిర్ణీత మొత్తం పంపిచకపోతే ఆ ప్రతిపాదన కార్యరూపంలోకి వ చ్చి... అరెస్టవుతారని హెచ్చరించాడు. దీంతో వీరిద్దరూ అక్కడి పోలీసులకు ఫిర్యా దు చేశారు.ఫోనులో బెదిరించిన వ్యక్తి భాష, వాడిన పదజాలం ఆధారంగా అతడు భారతీయుడుగా అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
 అప్పటికే ఓ బాధితుడు సౌత్ విడ్సర్‌లోని వాల్‌మార్ట్ ద్వారా ఫోన్ చేసిన వ్యక్తికి 500 అమెరికన్ డాలర్లు చెల్లించేశాడు. ఈ లావాదేవీని ఆపడానికి అక్కడి పోలీసులు ప్రయత్నించినప్పటికీ... దుండగుడు ‘ఈజీ క్యాష్’ పద్ధతితో డబ్బు డ్రా చేసుకోవడంతో సాధ్యం కాలేదు. ఈ నేర విధానం... హైదరాబాద్‌లో చిక్కిన కాల్ సెంటర్ ముఠా నేరాల తీరు...ఒకేలా ఉండటంతో పాటు సౌత్ విండర్స్ వాసులను బెదిరించిన వ్యక్తి భారతీయుడిగా అనుమానాలు వ్యక్తం కావడంతో ఈస్ట్ హోర్ట్‌ఫోర్డ్ టౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్ సెంటర్ క్రైమ్‌కు సూత్రధారిగా ఉన్న గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన ఇషాన్ పాఠక్ అమెరికా, లండన్లలోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న విషయం కాన్సులేట్ ద్వారా తెలియడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ‘ఈజీ క్యాష్’ ద్వారా డబ్బు డ్రా చేసుకున్న వ్యక్తి వివరాలు తెలుసుకోవడానికి వాల్‌మార్ట్‌ను సంప్రదిస్తున్నారు. బ్యాంకు రుణాలు, సోషల్ సెక్యూరిటీ కార్డుల పేర్లతో ఫోన్లు వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఓఐజీ అమెరికా పౌరులకు సూచించింది.
 
 గాలింపు ముమ్మరం...
 
 మరో పక్క హైదరాబాద్‌లో చిక్కిన ముఠా సభ్యులైన 14 మందినీ పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠాకు సంబంధించి పరారీలో ఉన్న ఇషాన్, రాహుల్ బజాజ్, అలీమ్, ముబీన్‌లతో పాటు మరో ఐదుగురి కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అరెస్టయిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ న్యాయ స్థా నంలో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.

Advertisement
Advertisement