సాక్షి, హైదరాబాద్: నత్తనడక సాగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. జూన్ కల్లా కనీసం 60 వేల ఇళ్లను పూర్తి చేయాలని అన్నారు. మార్కెట్ ధర కంటే తక్కువకే స్టీల్ను అందించేందుకు కంపెనీలు ముందుకొచ్చిన నేపథ్యంలో ఇళ్ల నిర్మాణంలో జాప్యం ఉండొద్దని స్పష్టం చేశారు. సోమవారం గృహ నిర్మాణ శాఖ జిల్లా నోడల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు.
కొన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, స్టీల్ ధరలను తగ్గించినందున కాంట్రాక్టర్లు కూడా టెండర్లకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో అధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయడంలేదని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వేగాన్ని పెంచాలని ఆదేశించారు.
నిధులకు ఇబ్బంది లేదని, ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ సత్యమూర్తి, ఆయా జిల్లాల నోడల్ అధికారులు, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, గిరిజన సంక్షేమ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.