Sakshi News home page

నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత

Published Thu, Jan 21 2016 3:41 PM

నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత

హైదరాబాద్: దళిత రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) దిగివచ్చింది. నలుగురు దళిత పీహెచ్‌డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వేముల రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గురువారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రశాంత్, శేషయ్య, విజయ్‌, సుంకన్న విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌తోపాటు ఈ నలుగురు విద్యార్థులపై గతంలో హెచ్‌సీయూ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఏబీవీపీ విద్యార్థిపై దాడి చేశారనే ఆరోపణలతో ఐదుగురు విద్యార్థులపై హెచ్‌సీయూ గతంలో ఈ చర్య తీసుకుంది. ఈ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఈ ఐదుగురు విద్యార్థులు గతకొన్ని రోజులుగా వర్సిటీ ప్రాంగణంలో నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా విద్యార్థులు భగ్గుమన్నారు. మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హెచ్‌సీయూ ఈ నిర్ణయం తీసుకుంది. 
 

Advertisement

What’s your opinion

Advertisement