హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల అన్ఎంప్లాయిమెంట్తో బాధపడుతున్నారని ఆ రాష్ట్ర వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఎద్దేవా చేశారు. ఒక్క మున్సిపల్ కార్మికుడు కూడా వెంట లేకుండా సచివాలయం వద్ద ధర్నా ఎందుకు చేస్తున్నట్లు అంటూ ఆయన కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. అయినా కాంగ్రెస్ నేతలు పేదల కోసం ఉద్యమించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ సచివాలయం ముట్టడి కోసం యత్నించడంపై తలసాని శ్రీనివాస యాదవ్ శుక్రవారం హైదరాబాద్లో స్పందించారు.
సీఎం కేసీఆర్ ప్రకటనతో మున్సిపల్ కార్మికులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అలాగే మున్సిపల్ కార్మికుల మిగిలిన సమస్యలు కూడా సానుభూతితో పరిష్కరిస్తామని తలసాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ధర్నాలు వద్దు దరఖాస్తు చేసుకుంటే చాలని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం చెబుతుందని ఆయన గుర్తు చేశారు.